ఇక సీసీఎంబీలో కరోనా నిర్ధారణ పరీక్షలు!
posted on Mar 30, 2020 7:05PM
హైదరాబాద్ నగరంలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ సీసీఎంబీలో మంగళవారం నుంచే కరోనాపరీక్షలు నిర్వహించనున్నారు. కేంద్ర మెడికల్ రీసెర్చ్ నుంచి సోమవారం సీసీఎంబీకి ఆదేశాలు జారీ కావడంతో మంగళవారం నుంచి కరోనా టెస్టులు చేయడానికి సీసీఎంబీ సిద్ధమవుతోంది. గాంధీ ఆసుపత్రి నుంచి సీసీఎంబీకి శాంపిల్స్ పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రతి రోజూ 800 నుంచి 1000 కరోనా టెస్టులు నిర్వహించే సామర్థ్యంతో సీసీఎంబీ వుంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) శాస్త్రవేత్తలు కరోనా పరీక్షల కిట్లను అభివృద్ధి చేస్తున్నారని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ ఇటీవల వెల్లడించింది. కచ్చితమైన ఫలితాలు ఇచ్చే ఈ కిట్లను చౌక ధరకు త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది. సీసీఎంబీలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడానికి ప్రణాళిక రూపొందించారు. కిట్ ధర వెయ్యి రూపాయలలోపే ఉండేలా కిట్లు రూపొందించడానికి పరిశీలిస్తున్నట్లు సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ కుమార్ మిశ్రా అన్నారు.