TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రేవంత్ వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ చార్జిషీట్.!

Published on: Wed Sep 2, 2026 2:46PM

తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో  కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుకి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) విమర్శలకు పదును పెట్టింది.  బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై  చార్జ్‌షీట్‌  విడుదల చేశారు. అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన 420 హామీలు, 13 డిక్లరేషన్లు,   6 గ్యారంటీల  అమలులో రేవంత్  ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని  ధ్వజమెత్తారు. ప్రజలను మాయమాటలతో వంచించి అధికార పీఠాన్ని దక్కించుకున్న కాంగ్రెస్, ఈ వెయ్యి రోజుల పాలన ఇసుమంతైనా సంతృప్తికరంగా లేదని విమర్శించారు. 

రైతాంగం, వ్యవసాయ కూలీలు, మహిళలు, విద్యార్థుల జీవితాలతో  రేవంత్ ఆటలాడుతోందని బీఆర్‌ఎస్  ఆ  చార్జ్‌షీట్‌లో పేర్కొంది. వ్యవసాయ రంగానికి సంబంధించి రైతు భరోసా పథకం కింద   ఏటా ఎకరాకు అందిస్తామన్న  15 వేల రూపాయల  సాయాన్ని నిలిపివేసి రైతులను నిట్టనిలువునా మోసం చేసిందని విమర్శించింది.  అలాగే వ్యవసాయ కూలీలకు చెల్లిస్తామని వాగ్దానం చేసిన   12 వేల రూపాయల ఆర్థిక సాయం కూడా నీటి మూటగానే మిగిలిందని చార్జ్ షీట్ పేర్కొంది.  2 లక్షల రూపాయల  రుణమాఫీ ప్రక్రియను అసంపూర్తిగానే మిగిలిందనీ, సగం సగం లెక్కలతో రైతులకు అన్యాయం చేసిందని ఈ సందర్భంగా కేటీఆర్ విమర్శించారు. 

యువత,  విద్యార్థుల భవిష్యత్తును కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా దెబ్బతీసిందని బీఆర్ఎస్ చార్జ్ షీట్ పేర్కొంది.  నిరుద్యోగులకు ఇస్తామని ప్రకటించిన   4 వేల రూపాయల నిరుద్యోగ భృతితో పాటు, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ హామీ పూర్తిగా నీటిమూటగా మారిపోయిందని విమర్శించింది. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను కాపాడటంలో విఫలమైన ప్రభుత్వం, గురుకుల పాఠశాలలను మూసివేసే దిశగా కుట్రలు చేస్తోందని బీఆర్ఎస్ చార్జిషీట్ పేర్క్ంది. విద్యార్థులకు వాగ్దానం చేసిన  5 లక్షల విద్యా భరోసా కార్డు ఆచరణకు నోచుకోలేదని, 12 వేల  కోట్ల రూపాయలకు పైగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయనీ, అలాగే..  మహిళలకు ఇస్తామన్న నెలకు  2 వేల 500 రూపాయల ఆర్థిక సాయం, కల్యాణలక్ష్మి పథకం కింద ఇస్తామన్న తులం బంగారం హామీలను రేవంత్ ప్రభుత్వం విస్మరించిందని పేర్కొంది.  

ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు,  తెలంగాణకు జీవనాధారమైన కృష్ణా, గోదావరి నదీ జలాలపై రాష్ట్రానికి ఉన్న హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్‌కు అప్పగించిందని  విమర్శించారు. అంతేకాకుండా, బాధ్యతారహితమైన ఆర్థిక నిర్ణయాల వల్ల తెలంగాణను దాదాపు రూ. 4.5 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టేశారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిరంకుశ విధానాలను, హామీల అమలును ప్రశ్నించిన నాయకులు, ప్రజలపై అక్రమ కేసులు బనాయిస్తూ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్‌ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

[BRS chargesheet on Congress, KTR press meet, Telangana Congress 1000 days, Revanth Reddy government failures, BRS vs Congress, Telangana politics, 
Telugu One]