అచ్చ కాంగ్రెస్ కాదు.. పచ్చ కాంగ్రెస్ కాదు.. లుచ్చ కాంగ్రెస్ : కేటీఆర్
Published on: Wed Sep 2, 2026 3:06PM

వంద రోజుల్లో స్వర్గం అన్నారు.. వెయ్యి రోజులు నరకం చూపించారు..!
కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలన పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పాలనను ప్రజా పీడనగా అభివర్ణిస్తూ ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జిషీట్ విడుదల చేశారు. ‘‘వెయ్యి రోజుల పాలన కాదు.. దరిద్రం దండయాత్రకు వెయ్యి రోజులు. వంద రోజుల్లో స్వర్గం చూపిస్తామని చెప్పి.. ప్రజలకు వెయ్యి రోజులు నరకం చూపించారు’’ అని మండిపడ్డారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన ‘క్రిమినల్ వేస్ట్’గా మారిందని కేటీఆర్ విమర్శించారు.
ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం కాంగ్రెస్ ‘అభయహస్తం’ మేనిఫెస్టో అని ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ మాటల్లో చెప్పాలంటే ఇది ‘‘సర్వ భ్రష్టుపాలన’’ అని వ్యాఖ్యానించారు. సచివాలయ ఉద్యోగులు చేస్తున్న నిరసన కూడా ప్రభుత్వ పాలన తీరుకు అద్దం పడుతోందన్నారు. రాష్ట్రంలో కమీషన్లు, పర్సంటేజీలతో అవినీతి పాలన కొనసాగుతోందని కేటీఆర్ ఆరోపించారు. ‘‘ఢిల్లీ ముందు మోకరిల్లిన సిల్లీ పాలన.. జల ద్రోహం చేస్తున్న జలగల పాలన’’ అంటూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వెయ్యి రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.4.5 లక్షల కోట్ల అప్పు చేసిందని కేటీఆర్ ఆరోపించారు.
వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ నేతలంతా ఢిల్లీ ముందు మోకరిల్లుతున్నారని విమర్శించారు. ‘‘ఈ ప్రభుత్వంలో అసమర్థత ప్రో మ్యాక్స్.. అవినీతి ఆల్ట్రా మ్యాక్స్.. అరాచకం హైమ్యాక్స్’’ అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్కు ఓటు వేసిన యువతకు ఈ ప్రభుత్వం ఏం మిగిల్చిందని కేటీఆర్ ప్రశ్నించారు. ‘‘జెన్ జీతో ఫోజులు కొడుతున్న రాహుల్ గాంధీకి తెలంగాణలో ఏం జరుగుతుందో తెలుస్తుందా?’’ అని నిలదీశారు. యువత జాబులు నింపమని అడుగుతుంటే.. ప్రభుత్వం జేబులు నింపుకోవడంలో బిజీగా ఉందని ఆరోపించారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నిస్తూ.. రాహుల్ గాంధీ ఎక్కడ ఉన్నారని నిలదీశారు.

రానున్న అసెంబ్లీ సమావేశాల్లో యువతకు ఉద్యోగాల అంశంపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని కేటీఆర్ తెలిపారు. ఇప్పుడున్నది అచ్చ కాంగ్రెస్ కాదు, పచ్చ కాంగ్రెస్ కాదు, లుచ్చ కాంగ్రెస్ అని మాజీ మంత్రి విమర్శించారుపాలిటెక్నిక్ విద్యార్థులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన జీవో నంబర్ 97పైనా అసెంబ్లీలో ప్రశ్నిస్తామని చెప్పారు. రాజశేఖర్రెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించిందని కేటీఆర్ ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో వెయ్యికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. కేసీఆర్ హయాంలో దేశంలోనే తొలిసారిగా రైతు బీమా పథకాన్ని అమలు చేశామని గుర్తుచేశారు. ప్రస్తుతం ఉన్న రైతు బీమాను కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం చేసిందని విమర్శించారు.
‘రైతుబంధు బంద్ అయ్యింది.. రాహుల్ బంధు మొదలైంది’’ అంటూ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రైతుల డబ్బులను దొంగలించిన జేబుదొంగ రేవంత్రెడ్డి అంటూ ముఖ్యమంత్రిపై తీవ్ర ఆరోపణలు చేశారు.
తెలంగాణకు నీళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ద్రోహం చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. ‘‘నీళ్లడిగితే కోసి రక్తం చల్లండి అంటున్నారు’’ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఎదురైన సమస్యలు, హామీల అమలు వైఫల్యాలను అసెంబ్లీ వేదికగా ఎండగడతామని కేటీఆర్ స్పష్టం చేశారు.
BRS chargesheet, KTR, K. T. Rama Rao, KTR Comments, Congress, Luchcha Congress, Telangana Congress, Revanth Reddy, Telangana Politics, BRS, Congress Government, KTR Criticism, Telangana Politics News, KTR Latest News, Political News, Telugu One, Telugu news


