TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బొల్లారంలో దారుణం...మహిళ గొంతు కోసి హత్య, భర్తపై కత్తితో దాడి

Published on: Sun May 31, 2026 10:31AM

 

సంగారెడ్డి జిల్లా బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం దారుణ ఘటన చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరిగి వస్తున్న దంపతులపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయడంతో మహిళ మృతి చెందగా, భర్త తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం బీహార్‌కు చెందిన అనిల్ కుమార్, మీనా దంపతులు జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్ నగరానికి వచ్చి బొల్లారం పారిశ్రామికవాడలోని వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్నారు. ఈ దంపతులు ఈరోజు ఉదయం సంతకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఐడీఏ క్రీడా ప్రాంగణం సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు వారిని అడ్డగించారు.

ఈ క్రమంలో మీనాతో అసభ్యంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించగా, భర్త అనిల్ కుమార్ అడ్డుకున్నట్లు సమాచారం. దీంతో దుండగులు అనిల్‌పై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయ పరిచారు. అనంతరం మీనా గొంతు కోసి అత్యంత దారు ణంగా హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్ర గాయాలతో ఉన్న అనిల్ కుమార్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన స్థలానికి చేరుకున్న బొల్లారం పోలీ సులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

అయితే, మృతురాలి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు అలాగే ఉండటంతో ఇది దోపిడీ హత్య కాదని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అలాగే లైంగిక దాడి జరిగిన ఆనవాళ్లు కూడా లభించలేదని వెల్లడించారు. హత్య వెనుక అసలు కారణాలను ఛేదించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ రవీందర్ రెడ్డి తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపగా, హత్యకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.