గుడ్ న్యూస్.. 'కోవ్యాక్సిన్' మూడో దశ ట్రయల్స్ కు డీసీజీఐ లైన్ క్లియర్..

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కు విరుగుడుగా హైదరాబాద్ జినోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ రూపొందించిన వ్యాక్సిన్ "కోవాక్సిన్" ట్రయల్స్ తుది దశకు చేరుకున్నాయి. వ్యాక్సిన్ పరీక్షలలో అత్యంత కీలకమైన మూడవ దశ ట్రయల్స్ నిర్వహించేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నుంచి భారత్ బయోటెక్ కు అనుమతులు లభించాయి. ఇప్పటికే పూర్తైన తొలి రెండు దశల ట్రయల్స్ కు సంబంధించిన నివేదికను డీజీసీఐకి భారత్ బయోటెక్ పంపగా.. మూడో దశ ట్రయల్స్ కు అనుమతి లభించింది.

 

త్వరలో మొదలయ్యే మూడవ దశ ట్రయల్స్ మొత్తం 28,500 మందిపై జరుగుతుందని, దీని కోసం 18 ఏళ్లు దాటిన వాలంటీర్లను ఎంచుకుని, దేశవ్యాప్తంగా 19 పట్టణాల్లో ట్రయల్స్ నిర్వహిస్తామని భారత్ బయోటెక్ వెల్లడించింది. ఢిల్లీ, ముంబై, పట్నా, లక్నో తదితర నగరాలతో పాటు మరో 10 రాష్ట్రాలలో ఈ ట్రయల్స్ జరుగుతాయని సంస్థ పేర్కొంది. ఇప్పటికే ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ పై రిపోర్ట్ ను విడుదల చేసిన భారత్ బయోటెక్, జంతువులకు ఈ వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు, వాటిల్లో కరోనా వైరస్ ను సమర్థవంతంగా ఎదిరించగల యాంటీ బాడీలు వృద్ధి చెందాయని పేర్కొన్న సంగతి తెలిసిందే. త్వరలో చేపట్టబోయే మూడవ దశ ట్రయల్స్ విజయవంతమైతే ఏ క్షణమైనా వ్యాక్సిన్ ను ప్రపంచంలోకి విడుదల చేస్తామని భారత్ బయోటెక్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా మరో భారత సంస్థ జైడస్ కాడిలా రూపొందించిన వ్యాక్సిన్ రెండో దశ ట్రయల్స్ లోకి ప్రవేశించింది. ఇక ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రాజెనెక రూపొందించిన వ్యాక్సిన్ రెండు, మూడవ దశ ట్రయల్స్ ను అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరమ్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఇప్పటికే భారత్ లో చేపట్టింది.