భాష తెచ్చిన తంటా.. ముంబైలో ఆటోలు, ట్యాక్సీలు బంద్.!
Published on: Tue Aug 25, 2026 9:32AM

మహా సర్కార్ కొత్తగా అమలులోకి తెచ్చిన నిబంధన ముంబైలో ఉద్రిక్తతకు కారణమైంది. ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు మరాఠీ భాష తప్పని సరి చేస్తూ మహారాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆటో, ట్యాక్సీ , క్యాబ్ డ్రైవర్లు తమ వాహనాలను రోడ్డు మీదకు తీసుకురావడం మానేశారు. మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. దీంతో ముంబైలో ఆటోలు, టాక్సీలు రోడ్డెక్కడం లేదు. కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు, సాధారణ ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
మహారాష్ట్ర మోటారు వాహన సవరణ నిబంధనల ప్రకారం ఆటో, ట్యాక్సీ, యాప్ ఆధారిత క్యాబ్ డ్రైవర్లకు మరాఠీలో ప్రాథమిక పరిజ్ఞానం తప్పనిసరి. ఈ నిబంధన అమలులో భాగంగా ఆగస్టు 20 నుంచి రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. రైల్వే స్టేషన్లు, చెక్ నాకాల వద్ద వాహనాలను ఆపి మీటర్ వేయడం, ఛార్జీలు, మార్గాల వంటి సాధారణ సంభాషణలపై డ్రైవర్లను పరీక్షిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 13, వేల మంది డ్రైవర్లకు పరీక్షలు నిర్వహించగా.. కనీస సంభాషణ నైపుణ్యం లేని పాతిక వందల మందికి నోటీసులు జారీ చేశారు. మరాఠీ నేర్చుకునేందుకు వారికి నెల రోజుల గడువు ఇచ్చారు. ఈ లోగా విఫలమైతే లైసెన్స్, పబ్లిక్ సర్వీస్ బ్యాడ్జ్ను సస్పెండ్ చేసే అవకాశం ఉంది.
ప్రభుత్వ నిర్ణయంతో తమ ఉపాధి ప్రమాదంలో పడిందని, యూపీ, బీహార్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ శిక్షణ తరగతుల సిలబస్కు మించి అధికారులు ప్రశ్నలు అడుగుతున్నారని ఆరోపిస్తూ కాందివలి లింక్ రోడ్డుతో పాటు పలు ప్రాంతాల్లో నిరసనలకు దిగారు.
డ్రైవర్ల ఆకస్మిక నిర్ణయంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాము అధికారికంగా సమ్మెకు పిలుపునివ్వలేదని, జరిమానాల భయంతోనే వాహనాలను బయటకు తేవడం లేదని డ్రైవర్లు చెబుతున్నారు. కాగా ఈ పరిణామంపై స్పందించిన మహా సీఎం ఫడ్నవీస్.. ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు మరాఠీ భాషా పరిజ్ణానం అవసరం లేదనీ, కనీసం ప్రయాణీకులతో మాట్లేడే ప్రాథమిక భాషా జ్ణానం ఉంటే చాలనీ వివరణ ఇచ్చారు. నెల రోజుల గడువు ముగియకముందే జరిమానాలు విధించవద్దని, నిబంధనలు అతిక్రమించే అధికారులపై చర్యలు తీసుకుంటామని మహా రవాణా శాఖ మంత్రి హెచ్చరించారు.
Auto and Taxi band in Mumbay, Marathi, Langauge, Must, Condition


