ఐపీఎస్ అధికారులు కాంతి రాణా తాతా, విశాల్ గున్నిపై సస్పెన్షన్ ఎత్తివేత.!
Published on: Thu Sep 3, 2026 3:17PM

సీనియర్ ఐపీఎస్ అధికారులు కాంతి రాణా తాతా , విశాల్ గున్నిలపై సస్పెన్షన్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎత్తివేసింది. వారిని సర్వీసులోకి పునరుద్ధరిస్తూ సాధారణ పరిపాలన శాఖ గురువారం (సెప్టెంబర్ 3) ఉత్తర్వులు జారీ చేసింది. అఖిల భారత సర్వీసుల క్రమశిక్షణ, అప్పీల్ నిబంధనల ప్రకారం గతంలో వీరిద్దరినీ సస్పెండ్ చేసిన ప్రభుత్వం, ఆ తర్వాత ఆ సస్పెన్షన్ ను పొడిగిస్తూ వచ్చింది. తాజాగా విధించిన సస్పెన్షన్ గడువు శుక్రవారం (సెప్టెంబర్ 4)తో పూర్తి కావస్తున్న నేపథ్యంలో వారి సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

వీరిద్దరి సస్పెన్షన్ ఎత్తివేతపై రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ సమర్పించిన నివేదికలను, అలాగే గత నెల 24న అధికారి కాంతి రాణా తాతా ప్రభుత్వానికి సమర్పించిన వినతిని పరిగణనలోనికి తీసుకుని ప్రభుత్వం వీరి సస్పెన్షన్ ఎత్తివేత నిర్ణయం తీసుకుంది. కాగా ఈ ఇద్దరు ఐపీఎస్ లపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

సస్పెన్షన్ ఎత్తివేత ఉత్తర్వుల ప్రతులను అధికారికంగా విశాల్ గున్ని, కాంతిలాల్ తాతాలకు అందజేసి, రసీదులు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం డీజీపీని ఆదేశించింది. ఇక పోతే..ఈ సస్పెన్షన్ ఎత్తివేత.. శాఖాపరంగా వారిపై క్రమశిక్షణ చర్యలు, విచారణలో ఉన్న క్రిమినల్ కేసులపై ఎలాంటి ప్రభావం చూపదని ప్రభుత్వం ఆ ఉత్తర్వులలో విస్పష్టంగా పేర్కొంది.
[AP IPS officers suspension revoked, Kanthi Rana Tata, Vishal Gunni, Kadambari Jethwani case, Andhra Pradesh, Telugu One]


