తెలుగుదేశంకు మరో గవర్నర్ పదవి.. రేసులో ఉన్నదెవరెవరంటే?
Published on: Fri Aug 21, 2026 4:17PM

ప్రధాని నరేంద్ర మోడీ తన కేబినెట్ పునర్వ్యవస్థీకరణ విషయంలో సీరియస్ గా కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగానే బీజేపీ అధిష్ఠానం ఇటీవలే పార్టీ నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. అలాగే ఇప్పుడు దేశ వ్యాప్తంగా భర్తీ చేయాల్సిన ఉన్న ఐదు రాష్ట్రాల గవర్నర్ లను భర్తీ చేయాలని కేంద్రం యోచిస్తున్నది. ఈ ఐదు గవర్నర్ పదవులలో రెండింటిని ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు కేటాయించాలని మోడీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆ రెండింటిలోనూ ఒకటి ఎన్డీయేలో కీలక భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీకి కేటాయించాలని మోడీ నిర్ణయించినట్లు ఢిల్లీ వర్గాల భోగట్టా. ఈ సమాచారాన్ని ఆయన ఇప్పటికే చంద్రబాబుకు అందించారని అంటున్నారు. ఇప్పటికే టీడీపీ తరఫున సీనియర్ నాయకుడు అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి దక్కిన సంగతి తెలిసిందే. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలతో పాటు రాజకీయ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ఆయనకు ఆ అవకాశం కల్పించారు.
ఇప్పుడు 5 రాష్ట్రాల భర్తీలో మరో 2 స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించాలని కేంద్రం డిసైడ్ అవ్వడంతో, రెండో గవర్నర్ పదవి కూడా టీడీపీ ఖాతాలోకి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో తెలుగుదేశం తరఫున మరో గవర్నర్ పదవికి ఎవరు ఎంపికౌతారన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. కాగా గవర్నర్ రేసులో ముగ్గురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
వారిలో సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ యనమలరామృష్ణుడు, అలాగే మరో మాజీ స్పీకర్ ప్రతిభా భారతి, అలాగే సీనియర్ నాయకుడు కేఈ క్రిష్ణమూర్తిలు ఉన్నారు. వీరిలో యనమల, కేఈ బీసీ వర్గానికి చెందిన వారు కాగా, ప్రతిభా భారతి ఎస్సీసామాజిక వర్గానికి చెందిన నేత. ఈ ముగ్గురూ కూడా ఆరంభం నుంచీ తెలుగుదేశం పార్టీకి విధేయంగా ఉండి కీలక బాధ్యతలలో సేవలందించిన వారే. వీరి ముగ్గురిలో చంద్రబాబు ఎవరిని ఎంపిక చేస్తారన్న ఆసక్తి, ఉత్కంఠా సర్వత్రా నెలకొని ఉంది.
Another Governer post for TDP, NDA Governor Appointments, Yanamala Ramakrishnudu, Pratibha Bharati, KE Krishnamurthy, Chandrababu Naidu, TeluguOne


