ఏపీలో జాతీయ సగటును మించి అక్షరాస్యలు.. లోకేష్.!
Published on: Thu Sep 3, 2026 4:16PM

ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత రేటు 2024లో 72.6 శాతం నుండి 2026 నాటికి 82.1 శాతానికి పెరిగింది. అంటే రెండేళ్లలో తొమ్మిదిన్నర శాతం పెరుగుదల నమోదైంది. ఈ విషయాన్ని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెళ్లడించారు. వయోజన అక్షరాస్యత కార్యక్రమంలో భాగంగా ఎన్డీయే ప్రభుత్వం ప్రారంభించిన అక్షర ఆంధ్ర పథకం ద్వారా ఈరెండేళ్లలో పాతిక లక్షల మంది అక్షరాస్యులుగా మారారని నారా లోకేష్ బుధవారం ( సెప్టెంబర్ 2)న ప్రకటించారు.
ఆయన వెళ్లడించిన వివరాల ప్రకారం 2024లో బీహార్ అక్షరాస్యత రేటు కంటే ఏపీలో అక్షరాస్యుల సంఖ్య తక్కువగా ఉంది. అయితే రెండేళ్లలో ప్రభుత్వం చేపట్టిన విధానాల కారణంగా అది 82.1శాతానికి పెరిగింది. ఈ పెంపు కారణంగా ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత రేటు జాతీయ సగటును దాటింది. వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి రాష్ట్రంలో వంద శాతం అక్షరాస్యత సాధించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని లోకేష్ ఈ సందర్భంగా చెప్పారు. వచ్చే ఏడాది మార్చి నాటికి మరో పాతిక లక్షల మందిని, సెప్టెంబర్ 2027 నాటికి అదనంగా మరో 27 లక్షల మందిని అక్షరాస్యులుగా మార్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశామనీ, తద్వారా మొత్తం 52 లక్షల మందిని అక్షరాస్యులుగా మార్చడమే తమ లక్ష్యమన్నారు. ఇందు కోసం 11 ప్రభుత్వ శాఖలు సమన్వయంతో అక్షర ఆంధ్ర కార్యక్రమంలో నిమగ్నమయ్యారన్నారు. ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేస్తున్నామన్నారు.

పాఠశాల విద్యాశాఖపై సమీక్ష సందర్భంగా.. పాఠశాల వయస్సు గల 1,64,821 మంది పిల్లలు అధికారిక విద్యా వ్యవస్థకు దూరంగా ఉన్నారని అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. . పాఠశాల వయస్సు గల ప్రతి బిడ్డను విద్యా వ్యవస్థ పరిధిలోకి తీసుకువచ్చేలా చూడాలని ఈ సందర్భంగా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఎవరైనా విద్యార్థి వరుసగా మూడు రోజుల పాటు పాఠశాలకు గైర్హాజరైతే, వారి తల్లిదండ్రులను సంప్రదించి కారణాలు తెలుసుకోవాలనీ, అలాగే పిల్లలను బడికి పంపేలా వారిలో అవగాహన కల్పించాలని లోకేష్ ఈ సందర్భంగా చెప్పారు.
[Andhra Pradesh literacy rate, Nara Lokesh, Akshara Andhra program, 100 percent literacy target, AP education, Telugu One]


