టెక్ ప్రపంచంలో ఏఐ ప్రకంపనలు.. ఉద్యోగ కోతలా లేక పునర్వ్యవస్థీకరణా?

posted on: May 7, 2026 10:23AM

ప్రపంచ టెక్ రంగం ప్రస్తుతం ఒక అనిశ్చిత పరిస్థితిని ఎదుర్కొంటోంది.  2026 సంవత్సరం ఐటీ నిపుణులకు పెద్ద సవాలుగా మారింది. గత కొన్నేళ్లుగా సాగుతున్న ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ ఈ ఏడాది మరింత తీవ్రరూపం దాల్చింది. ఇప్పటికే దాదాపు లక్ష మందికి పైగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, ఇతర విభాగాల సిబ్బంది తమ ఉద్యోగాలు కోల్పోయారు. అయితే.. ఈసారి జరుగుతున్న లేఆఫ్స్‌ వెనుక   ఆర్థిక మాంద్యం మాత్రమే కాదు, వేగంగా విస్తరిస్తున్న 'కృత్రిమ మేధ' (ఏఐ) విప్లవం కూడా ఉంది. కంపెనీలు తమ పనితీరును మెరుగుపరుచుకోవడానికి మానవ వనరుల కంటే సాంకేతికతకే ప్రాధాన్యతనిస్తూ..  భారీ మార్పులకు శ్రీకారం చుడుతున్నాయి.  ముఖ్యంగా మెటా, అమెజాన్, ఒరాకిల్, స్నాప్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు తమ అంతర్గత వ్యవస్థలను ఏఐ ఆధారితంగా మార్చుకుంటున్నాయి. ఈ క్రమంలో భాగంగా  ఏఐ ఆధారిత పునర్వ్యవస్థీకరణ  పేరుతో వేల సంఖ్యలో సిబ్బందికి ఉద్వాసన పలుకుతున్నాయి.  క్రిప్టో దిగ్గజం కోయిన్ బేస్ తన సిబ్బందిలో దాదాపు 14 శాతం మందిని తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. సంస్థ పనితీరును వేగవంతం చేసేందుకు చిన్నపాటి టీమ్‌లతో, ఏఐ సహాయంతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు ఆ సంస్థ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. అలాగే మెటా తన పెట్టుబడులను ఏఐ ప్రాజెక్టుల వైపు మళ్లించే క్రమంలో దాదాపు 10 శాతం ఉద్యోగాల్లో కోత విధించింది.  గార్ట్నర్ వంటి విశ్లేషక సంస్థల నివేదికల ప్రకారం..  ఏఐని వినియోగిస్తున్న సంస్థల్లో దాదాపు 80 శాతం కంపెనీలు ఏదో ఒక రూపంలో మానవ వనరులను తగ్గిస్తున్నాయి. ఏఐ కేవలం మనుషులకు సహాయకారిగా ఉంటుందని గతంలో భావించినప్పటికీ..  ప్రస్తుతం అది నేరుగా ఉద్యోగాలను భర్తీ చేసే స్థాయికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. 

బ్లాక్, అట్లాసియన్ వంటి సంస్థలు కూడా ఏఐ సమీకరణ కోసం అత్యంత వేగవంతమైన, చిన్న టీమ్‌లను ఏర్పాటు చేసుకుంటూ భారీగా ఉద్యోగాలను తగ్గించాయి. అయితే ఈ మార్పు కేవలం ఉద్యోగాలను తీసేయడానికే కాకుండా..  కొత్త నైపుణ్యాలు కలిగిన వారికి తలుపులు తెరుస్తోంది.  ఈ క్లిష్ట సమయంలో ఉద్యోగం కోల్పోయిన వారు మానసిక ఆందోళనకు గురికాకుండా ఉండటం అత్యంత ముఖ్యం. లేఆఫ్ అనేది వ్యక్తిగత వైఫల్యం కాదని, అది కేవలం కంపెనీల వ్యూహాత్మక మార్పు అని నిపుణులు సూచిస్తున్నారు. నిరాశలో మునిగిపోకుండా వాస్తవాన్ని అంగీకరించి, తదుపరి అడుగుపై దృష్టి పెట్టాలి.  మీ ఉద్యోగం పోయి ఉండవచ్చు కానీ మీలోని ప్రతిభ, విలువలు ఎక్కడికీ పోవని గుర్తించాలని అంటున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడటం, అవసరమైతే కౌన్సెలింగ్ తీసుకోవడం ద్వారా మానసిక స్థిరత్వాన్ని కాపాడుకోవచ్చు. 

 ప్రస్తుత ఏఐ యుగంలో మనుగడ సాగించాలంటే పాత పద్ధతులకు స్వస్తి చెప్పి  అప్ స్కిల్లింగ్  మీద దృష్టి పెట్టాలి. ఇకపై కేవలం డిగ్రీ మాత్రమే  కెరీర్‌కు భరోసా ఇవ్వదు, నిరంతర నైపుణ్య సాధన మాత్రమే రక్షిస్తుంది. ముఖ్యంగా  ప్రాంప్ట్ ఇంజినీరింగ్,  డేటా అనాలిసిస్ ,  బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్స్ మీద పట్టు సాధించడం అవసరం. క్లౌడ్ కంప్యూటింగ్ ( వంటి ప్రాథమిక నైపుణ్యాలు ఇప్పుడు ప్రతి టెక్ ఉద్యోగికి తప్పనిసరిగా మారాయి. కోడింగ్ మాత్రమే కాకుండా.. వ్యాపార సమస్యలను సాంకేతికతతో ఎలా పరిష్కరించాలనే  ప్రొడక్ట్ థింకింగ్  ఉన్నవారికి మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉంది.  ఉద్యోగ వేటలో మీ రెజ్యూమే కీలక పాత్ర పోషిస్తుంది. నేటి కాలంలో రిక్రూటర్లు మీ ప్రొఫైల్‌ను పూర్తిగా చదవడానికి కేవలం 10 సెకన్ల సమయం మాత్రమే కేటాయిస్తున్నారు. కాబట్టి మీ రిజ్యూమేను ఏఐ-సావీ (  ప్రొఫైల్‌గా మార్చుకోవాలి. కేవలం  పని చేశాను  అని కాకుండా, మీరు చేసిన పని వల్ల కంపెనీకి ఎంత లాభం కలిగింది, ఎంత ఖర్చు తగ్గింది అనే విషయాలను స్పష్టమైన గణాంకాలతో  వివరించాలి. అలాగే మీ రెజ్యూమే అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ (ఏటీఎస్) ఫ్రెండ్లీగా ఉండేలా తగిన కీవర్డ్స్ ఉపయోగించాలి.  

మరో ముఖ్యమైన అంశం  నెట్‌వర్కింగ్. ఆన్‌లైన్ పోర్టల్స్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే ఉద్యోగం వచ్చే అవకాశం కేవలం రెండు శాతం మాత్రమేనని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే మాజీ సహోద్యోగులు, మెంటర్లు,  లింక్డ్‌ఇన్ ద్వారా ప్రొఫెషనల్ కనెక్షన్లను బలోపేతం చేసుకోవాలి. చాలా వరకు ఉద్యోగాలు బహిరంగంగా ప్రకటించకముందే నెట్‌వర్కింగ్ ద్వారా భర్తీ అవుతుంటాయి. నిరంతర అభ్యాసం, పరిస్థితులకు అనుగుణంగా మారే గుణం అంటే అడాప్ట్ బులిటీ.. ఈ పోటీ ప్రపంచంలో మిమ్మల్ని నిలబెడతాయి.  చివరగా..  భవిష్యత్తు గురించి భయం వద్దు.. సంసిద్ధత అవసరం. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అంచనాల ప్రకారం..  ఏఐ వల్ల కొన్ని ఉద్యోగాలు కనుమరుగైనప్పటికీ..  2030 నాటికి బిగ్ డేటా, ఫిన్‌టెక్ రంగాల్లో కొత్త ఉద్యోగాలు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. సృజనాత్మకత, సహానుభూతి, నాయకత్వ లక్షణాలు వంటి మానవ నైపుణ్యాలను ఏఐ భర్తీ చేయలేదు. కాబట్టి ఏఐని శత్రువుగా కాకుండా ఒక  పవర్ టూల్ గా భావించి, దాన్ని అందిపుచ్చుకున్న వారే రాబోయే దశాబ్దంలో విజేతలుగా నిలుస్తారు.

- సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ నచ్చినట్లైతే https://www.teluguone.comను లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలు తెలియజేయండి. 

google-ad-img
    Related Sigment News
    • Loading...