రాఖీ రాజీ కుదిర్చేసినట్లేనా?
Published on: Fri Aug 28, 2026 3:05PM

తెలంగాణ రాజకీయాలలో తీవ్ర సంచలనం సృష్టించిన కొండా సురేఖ వ్యవహారం ఇక క్లోజ్ అయినట్లేనా? టీపీసీసీ క్రమశిక్షణా సంఘం కొండా సురేఖపై చర్యలకు సిఫారసు చేస్తూ నివేదిక సమర్పించినా, పార్టీ ఆమె పట్ల ఒకింత సానుకూలంగానే ఉందా? ముఖ్యంగా కొండా సురేఖ కుమార్తె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించిన వ్యాఖ్యలు పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే కొండా సురేఖ తీరు పట్ల కాంగ్రెస్ నాయకులలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. దీంతో కేబినెట్ నుంచి ఆమెను బర్త్ రఫ్ చేయడం ఖాయమన్న ప్రచారం కూడా జోరుగా సాగింది. కట్ చేస్తే రాఖీ పండుగ సందర్భంగా కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి శుక్రవారం (ఆగస్టు 28) రాఖీ కట్టి ప్రత్యేకంగా ఆయనతో భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీ ద్వారా వివాదానికి తెరపడినట్లేనా అన్న చర్చ జోరందుకుంది.
గత కొన్ని రోజులుగా మంత్రి కొండా సురేఖ కుటుంబానికి, సీఎం వర్గానికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. మంత్రి సురేఖ కుమార్తె చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించగా, పార్టీ క్రమశిక్షణా కమిటీ సురేఖపై చర్యకు సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డితో కొండా సురేఖ అప్పాయింట్ మెంట్ తీసుకుని మరీ ఆయన నివాసానికి వెళ్లి రాఖీ కట్టడం హాట్ టాపిక్గా మారింది.
రక్షాబంధన్ పండుగ వేళ సోదరభావానికి, ఆత్మీయతకు ప్రతీకగా సీఎంకు రాఖీ కట్టేందుకు అపాయింట్మెంట్ కోరిన సురేఖ.. అనుకున్న సమయానికి జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి నివాసానికి చేరుకుని రేవంత్ రెడ్డికి ఆమె రాఖీ కట్టారు. దీంతో ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రికి, కొండా సురేఖకు మధ్య ఏర్పడిన విభేదాలు సమసిపోయినట్లేనా అన్న చర్చ జరుగుతోంది. దీంతో కేబినెట్ లో ఆమె స్థానానికి ఇప్పట్లో ఢోకా లేదన్న మాట కూడా వినిపిస్తోంది.
(Konda Surekha, Revanth Reddy, Telangana Congress Controversy, Raksha Bandhan, Konda Surekha Rakhi CM Revanth, Telangana Politics, Telugu One)


