కేబుల్ ఆపరేటర్లకు మంత్రి జవదేకర్ హెచ్చరిక

తెలంగాణలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ-9 ఛానెళ్ల ప్రసారాలను కొందరు ఎమ్.ఎస్.ఓలు నిలిపివేయడంపై కేంద్ర ప్రసారాలశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ-9 ఛానెళ్ల ప్రసారాల నిలిపివేతపై తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశానని జవదేకర్ చెప్పారు. ఛానెళ్ల నిలిపివేతపై తమ ప్రమేయం లేదని టీ. సీఎం కేసీఆర్ బదులుగా సమాధానం ఇచ్చారని ఆయన తెలిపారు. అందువల్ల ఇప్పుడు మేం తీసుకోబోయే చర్యల వల్ల తెలంగాణ ప్రభుత్వానికి ఇబ్బంది ఉండదనుకుంటానని ఆయన అభిప్రాయపడ్డారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే చూస్తూ ఊరుకునేదిలేదని ఆయన హెచ్చరించారు. ఎంఎస్‌వోలపై చర్యలు తీసుకోడానికి కేంద్ర ప్రభుత్వం వెనుకాడదని జవదేకర్ స్పష్టం చేశారు.