TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ వద్ద హైటెన్షన్...!

Published on: Tue Sep 8, 2026 2:20PM

గజ్వేల్‌లో కాంగ్రెస్–బీఆర్‌ఎస్‌ నేతల మధ్య ఘర్షణ..!

మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు పలువురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల అరెస్టుల నేపథ్యంలో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని   జవహర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టు విషయం తెలుసుకున్న ఆ పార్టీ శ్రేణులు భారీగా పోలీస్‌ స్టేషన్‌ వద్దకు తరలివచ్చాయి. బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులను నిరసిస్తూ కార్యకర్తలు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

 ‘సీఎం డౌన్‌ డౌన్‌’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బీఆర్‌ఎస్‌ నేతలను అక్రమంగా అరెస్ట్‌ చేశారని ఆరోపించిన కార్యకర్తలు.. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఆందోళన నేపథ్యంలో జవహర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. దీంతో పోలీస్‌ స్టేషన్‌ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

మరోవైపు సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మర్కుక్‌ మండలం వరదరాజ్‌పూర్‌ గ్రామంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నాయకుల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిష్టిబొ మ్మను బీఆర్‌ఎస్‌ నాయకులు దగ్ధం చేశారు. దీనికి పోటీగా కాంగ్రెస్‌ నాయకులు మాజీ సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం ప్రారంభమై, క్రమంగా తోపులాటకు దారితీసింది. 

పరిస్థితి అదుపుతప్పడంతో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు పరస్పరం చెప్పులు, కర్రలు, రాళ్లతో కొట్టుకున్నారు. దీంతో గ్రామంలో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఘర్షణకు దారితీసిన కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

 

 

(High tension at Jawaharnagar police station, BRS Party, KCR, KTR, Congress Party, Gajwel, Siddipet district, CM Revanth reddy, Telugu News, Telugu One)