కేసీఆర్ మరణాన్ని కోరిన ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలి : ఆర్ఎస్ ప్రవీణ్
Published on: Tue Sep 8, 2026 8:09PM

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరణాన్ని కోరుతూ షాద్నగర్ ఎమ్మెల్యే కె. శంకరయ్య చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS)-2023లోని సెక్షన్లు 196, 351(3), 352, 353, 61తో పాటు దర్యాప్తులో వెల్లడయ్యే ఇతర నిబంధనల కింద FIR నమోదు చేయాలని ఆయన కోరారు.సెప్టెంబర్ 8న కేసీఆర్ నివాసం వెలుపల షాద్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కె. శంకరయ్య చేసిన వ్యాఖ్య లకు సంబంధించిన వీడియోలు, ఆడియోలు టెలివిజన్ ఛానళ్లు, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయని ఫిర్యాదులో ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు.
కేసీఆర్ నివాసం వెలుపల వెయ్యి డప్పులతో ర్యాలీ నిర్వహిం చడంపై ప్రశ్నించిన సందర్భంలో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా అభ్యంతరకరంగా ఉన్నాయని ఆరోపించారు. “కేసీఆర్ ఈ రాష్ట్రానికి పట్టిన పీడ.. అందుకే అతని చావును కోరుకుంటున్నాం” అంటూ ఎమ్మెల్యే వ్యాఖ్యానించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు కేసీఆర్ ప్రాణ భద్రతకు ముప్పు కలిగించేలా ఉన్నాయని, ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు, మద్దతుదారుల్లో భయాందోళనలు కలిగించే అవకాశం ఉందని ప్రవీణ్కుమార్ తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గతంలో కేసీఆర్పై చేసిన వ్యాఖ్యలను కూడా ఫిర్యాదులో ప్రస్తావించారు. జూలై 18, 2026న కొల్లాపూర్లో జరిగిన సమావేశంతో పాటు 2025 మార్చిలో సీఎం చేసిన వ్యాఖ్యలకు, తాజాగా ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు మధ్య రాజకీయ సందేశాల్లో సారూప్యత ఉందని ప్రవీణ్కుమార్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే శంకరయ్య వ్యాఖ్యల వెనుక ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి లేదా కాంగ్రెస్కు చెందిన ఇతర నేతల ప్రేరేపణ, ఉసిగొల్పడం లేదా కుట్ర ఏమైనా ఉందా అనే అంశంపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఆయన కోరారు. రాజకీయ ప్రత్యర్థికి హాని తలపెట్టే ఉద్దేశంతో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల మధ్య ఒప్పందం లేదా సమన్వయం ఉన్నట్లు దర్యాప్తులో తేలితే BNS సెక్షన్ 61 వర్తిస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

కేసీఆర్కు తక్షణం తగిన భద్రత కల్పించాలని కూడా ప్రవీణ్కుమార్ పోలీసులను కోరారు. ఆయనకు ఉన్న ముప్పును సమీక్షించి భద్రతా కవచాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే శంకరయ్య, సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు కేసీఆర్కు హాని తలపెట్టేందుకు వస్తున్నారని ఫిర్యాదులో ఆరోపించారు. ప్రజా శాంతి, శాంతిభద్రతలు, రాజకీయ సామరస్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ వ్యవహారంపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
ఎన్నికైన ప్రజాప్రతినిధి ఒక రాజకీయ నాయకుడి మరణాన్ని కోరుతూ బహిరంగంగా వ్యాఖ్యానించడం తీవ్రమైన అంశమని, ఇటువంటి వ్యాఖ్యలు హింసకు దారితీసే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఫిర్యాదు అందినట్లు రాతపూర్వకంగా రసీదు ఇవ్వడంతో పాటు, BNSS-2023 ప్రకారం నిర్దేశించిన కాలపరిమితిలో తీసుకున్న చర్యల వివరాలను తెలియజేయాలని ప్రవీణ్కుమార్ కోరారు. దర్యాప్తు అధికారి కోరిన పక్షంలో వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో రికార్డింగ్లు, ఆడియోలు, వాటి ట్రాన్స్క్రిప్ట్లు సహా అదనపు ఆధారాలను అందజేస్తామని తెలిపారు.
(Shadnagar MLA K. Shankaraiah, RS Praveen Kumar, KCR, KTR, BRS Party, CM Revanth reddy, CP Sajjanar, DGP C.V. Anand, Telugu One, Telugu news)


