దళితులు నడిచిన నేలను శుద్ధి చేస్తారా.. సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం..!
Published on: Wed Sep 9, 2026 6:48PM
.webp)
తెలంగాణ సమాజం బెయిల్ ఇవ్వదు.. కేసీఆర్పై రేవంత్ ఘాటు వ్యాఖ్యలు..!
శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ విధానాలు, ప్రతిపక్షాల తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటే దేశంలో కోట్లాది ప్రజలకు నమ్మకం, భరోసా అని అన్నారు. ‘‘కాంగ్రెస్ ఏం చేసిందని అడిగేవారు పాకిస్థాన్, బంగ్లాదేశ్లను ఒకసారి పరిశీలించాలి. కాంగ్రెస్ దూరదృష్టితో దేశ అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకుందో అర్థం చేసుకోవాలి’’ అని రేవంత్ రెడ్డి అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించడం కాంగ్రెస్ విధానంలో భాగమని తెలిపారు.
కర్ణాటకలోని ఓ చిన్న గ్రామంలో జన్మించి, రజాకార్ల దాడుల్లో తండ్రిని కోల్పోయి, కార్మిక నాయకుడిగా ఎదిగి జాతీయ స్థాయికి చేరుకున్న నేత మల్లికార్జున ఖర్గే అని సీఎం పేర్కొన్నారు. దాదాపు 60 ఏళ్లుగా ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్నారని కొనియాడారు.
ఉత్తరాఖండ్లోని ఓ మైదానంలో ఖర్గే పాల్గొన్న సభ అనంతరం, ఆగస్టు 10న బీజేపీ అనుబంధ సంస్థ అక్కడ శుద్ధీకరణ కార్యక్రమం నిర్వహించడం హేయమైన చర్య అని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ఘటనను శాసనసభ ముక్తకంఠంతో ఖండిస్తోందన్నారు. ఈ వ్యవహారంపై ఖర్గే రాజ్యసభలో భావోద్వేగంతో ప్రధానిని ప్రశ్నించారని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారని తెలిపారు.

ఇదిలా ఉండగా.. తెలంగాణలో విద్యారంగ అక్రమాలు, ధరణి వ్యవహారాలు, 22ఏ అంశాలపై సభలో చర్చించాలని ప్రభుత్వం భావించిందని రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే ఫామ్హౌస్లో కుట్ర చేసి తమ సభ్యులను సభా కార్యకలాపాలను అడ్డుకునేలా ఉసిగొల్పారని ఆరోపించారు. ఈ అంశాలపై చర్చ జరిగితే గత పదేళ్ల పాలనలో జరిగిన అవకతవకలు, అప్పులపై ప్రజలకు అవగాహన కలుగుతుందనే భయంతోనే చర్చను అడ్డుకున్నారని విమర్శించారు.
సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ను అవమానించేలా కొందరు సభ్యులు వ్యవహరించడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమన్నారు. అధికారులపై దాడులకు పాల్పడటంతో పాటు సభాపతి కుర్చీని అవమానించేలా వ్యవహరించారని ఆరోపించారు. వ్యక్తిని మాత్రమే కాకుండా ఆయన తల్లిని కూడా అవమానించేలా మాట్లాడారని అన్నారు.‘‘మహిళలను శక్తిగా కొలిచే సమాజం మనది. భారతదేశాన్ని భారతమాతగా, తెలంగాణను తెలంగాణ తల్లిగా భావిస్తున్నాం. సభాపతి స్థానంలో ఉన్న వ్యక్తి మనసును గాయపరిచేలా మాట్లాడటం తీవ్రంగా బాధించింది’’ అని రేవంత్ రెడ్డి అన్నారు.
ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ సభాపతికి క్షమాపణ చెప్పి, తన పార్టీ సభ్యులతో కూడా క్షమాపణ చెప్పించి సభ సజావుగా జరిగేలా చూస్తారని అందరూ భావించారని తెలిపారు. కానీ అలా జరగకపోగా మరింత దూకుడుగా వ్యవహరించారని విమర్శించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఫామ్హౌస్ ముందు ప్రజాస్వామ్యవాదులు డప్పు దరువులతో నిరసన చేపట్టారని సీఎం చెప్పారు. ‘‘వాళ్లలా ఉన్మాదానికి తెగబడలేదు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపారు. దళిత సోదరులు తమ భావాలను వ్యక్తం చేసేందుకు డప్పును ఒక సాధనంగా ఉపయోగిస్తారు’’ అని అన్నారు.
కానీ ఆ నిరసనకు వెళ్లిన దళితులు నడిచిన నేలను శుద్ధి చేయాలని ఆదేశించడం ద్వారా వారిని తీవ్రంగా అవమానించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ‘‘అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? రాతియుగంలోని రాక్షసుల్లా వ్యవహరిస్తారా? దళితులు నడిచిన నేలను శుద్ధి చేస్తే.. వారి మనసుల్లో పేరుకుపోయిన అంటరానితనాన్ని ఎలా శుద్ధి చేస్తారు?’’ అని ప్రశ్నించారు.
దళితులు దుక్కి దున్ని పంటలు పండిస్తేనే సమాజం కడుపులు నిండుతున్నాయని అన్నారు. శుద్ధి చేయాల్సింది దళితులు నడిచిన నేలను కాదని, అహంకారం, అంటరానితనం, వివక్షతో కూడిన ఆలోచనలను శుద్ధి చేయాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ మనసులో పేరుకుపోయిన దొర అహంకారాన్ని తెలంగాణ సమాజమే ప్రశ్నిస్తుందని అన్నారు. సభాపతిని అవమానించిన వారిపై ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.
‘‘జరిగిన తప్పును ఒప్పుకుని క్షమాపణ చెబితే మీ కిరీటం ఊడిపడుతుందా?’’ అని ప్రశ్నించారు.
మల్లికార్జున ఖర్గేకు జరిగిన అవమానమైనా, గడ్డం ప్రసాద్ కుమార్కు జరిగిన అవమానమైనా.. అది మొత్తం సమాజానికి జరిగిన అవమానమేనని రేవంత్ రెడ్డి అన్నారు. మనువాద భావాలతో వ్యవహరించే వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని తెలిపారు.ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం ఎంతటివారైనా విచారణ ఎదుర్కోవాల్సిందేనని అన్నారు. కుట్రకు పాల్పడిన వారితో పాటు, కుట్రలో భాగస్వాములైన వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
సెప్టెంబర్ 6న జరిగిన ఘటన నుంచి ఇప్పటివరకు చోటుచేసుకున్న అన్ని పరిణామాలను క్రోడీకరించి, సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి శిక్షించాలని ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం వెల్లడించారు.
చివరగా సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్కు ధైర్యం చెప్పారు..
‘‘సభాపతిగా మీరు మానసిక ధైర్యం కోల్పోవద్దు. మీ మనసును గాయపరిచిన వారిని వదిలే ప్రసక్తే లేదు. చట్టాలు, సెక్షన్ల ఆధారంగా కొందరు బెయిల్ పొందొచ్చు. కానీ తెలంగాణ సమాజం వారికి బెయిల్ ఇవ్వదు. రజాకార్లను తరిమికొట్టి మట్టికరిపించిన చరిత్ర ఈ గడ్డది. ఈ ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది’’ అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
(CM Revanth Reddy, Telangana CM Revanth Reddy, Telangana Assembly, Telangana Assembly Session, KCR, K Chandrashekar Rao, BRS, Congress, Gaddam Prasad Kumar, Telangana Politics, Dalit Issue, Dalit Rights, SC ST Atrocities Act, KCR Farmhouse)


