వైఎస్సార్సీపీవైపు మంత్రి పినిపే చూపు
Published on: Tue Sep 4, 2012 4:45PM
రాష్ట్రపశుసంవర్థకశాఖా మంత్రి పినిపే విశ్వరూప్ త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. 2014 లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ తరుపున ఎంపీగా పోటీ చేయాలని ఆయన ఉవ్విళ్లూరుతున్నారు. తొలిసారి ఎంపితో పాటు అవకాశం కలిసి వస్తే కేంద్ర మంత్రి అయి రాష్ట్రంలో మంచి గుర్తింపు పొందాలని ఆయన కోరుకుంటున్నారు. ఈయన అంచనాల ప్రకారం వైకాపా కేంద్రంలో కాంగ్రెస్కు మద్దతు ఇస్తే 2014లో యుపిఎలో వైఎస్సార్సీపీ భాగస్వామి అవుతుంది. లోక్సభ స్పీకర్గా జిఎంసి బాలయోగి కోనసీమ నుంచి ఇలానే ఎంపికయ్యారని పినిపే గట్టిగా నమ్ముతున్నారు. అవకాశంకోసం, సమయం కోసం ఎదురుచూస్తూ కూర్చోకుండా ఇప్పట్నుంచే పావులు కదుపుతున్నారు. అందుకే ముందస్తుగా తన కొడుకుని వైఎస్సార్సీపీలో చేర్చారు. కాంగ్రెస్ నేతలకు తెలియకుండా తన రహస్య ఆలోచనను జగన్ ముందుకు కుమారుని ద్వారా పినిపే చేరవేశారని తెలుస్తోంది. ఇప్పటికే తన సొంత నియోజకవర్గమైన తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని సన్నిహితుల్ని మంత్రిగారు మచ్చికచేసుకుంటున్నారు. జైభీమ్ అసోసియేషన్లను పక్కకు పిలిచి మీకు అవసరమైన ఏర్పాట్లు చేస్తాను కానీ, నేను వైకాపా తరుపున పోటీ చేస్తానని ప్రచారం చేయాలని కోరుతున్నారట. రాజకీయపరిశీలకులు విశ్వరూప్పై నిఘా పెడితే తెలిసిన విషయమేంటంటే మంత్రిగారు ఆల్రెడీ ఛోటా, మోటా నేతలను వైకాపాలో చేరుస్తూ వారిని అస్తమాను పిలిపించుకుని అక్కడి పరిస్థితి కనుక్కొంటున్నారట.


