గబ్బర్ సింగ్ నిర్మాత బండ్ల గణేష్ కధేమిటో?

  ఒకప్పుడు సినిమాలలో కామెడియన్ గా చిన్నచిన్న వేషాలు వేసే బండ్ల గణేష్, అకస్మాత్తుగా ఒకరోజున పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి తెలుగు చిత్ర సీమలో ఉన్నఅందరు పెద్ద హీరోలు, అగ్ర దర్శకులతో భారీ బడ్జెట్ సినిమాలు తీయడం మొదలు పెట్టినప్పుడు అందరూ చాలా ఆశ్చర్యపోయారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కలిసి రావడంతో సినిమాలు తీయగలుగుతున్నానని ఆయన చెప్పినప్పటికీ, ఆయన వెనుక మంత్రి బొత్స సత్యనారాయణ ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.   ఒకప్పుడు హైదరాబాదు శివార్లలో కోళ్ళ ఫారం నడుపుకొని బ్రతికే బండ్ల గణేష్, తరువాత కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకొన్నపుడు, తన భూములతో ఆ వ్యాపారంలో ప్రవేశించడం నిజమే అయినప్పటికీ, పవన్ కళ్యాణ్ తో సినిమాలు తీసేంత డబ్బు సంపాదించడం మాత్రం నిజం కాకపోవచ్చును.   ఆయన మొట్టమొదట రవితేజతో తీసిన ‘ఆంజనేయులు’ సినిమా బోర్లాపడినప్పటికీ, వెంటనే పవన్ కల్యాణ్ తో ‘తీన్ మార్’ అనే మరో భారీ బడ్జెట్ సినిమా తీసాడాయన. కానీ, అది కూడా ఫ్లాప్ అవడంతో ఇక ఆయన పని అయిపోయినట్లే అని అందరూ అనుకొంటున్నతరుణంలో మళ్ళీ పవన్ కళ్యాణ్ తోనే ‘గబ్బర్ సింగ్’ సినిమా తీసి విజయం సాదించారు. అయితే, రెండు వరుస అపజయాలు తట్టుకొని నిలబడటమే గాకుండా, మళ్ళీ వెంటనే మరో భారీబడ్జెట్ సినిమా ఎలా తీయగలిగాడని సినిమారంగంలో ప్రతీ ఒక్కరికీ సందేహాలొచ్చాయి, కానీ, బొత్స సత్యనారాయణ పేరు చూచాయగా వినిపిస్తుండటంతో ఎవరూ నోరు మెదిపే సాహసం చేయలేకపోయారు.   ‘గబ్బర్ సింగ్’ సినిమా మొదలు పెట్టిన వెంటనే, ఆయన జూ.యన్టీఆర్ తో ‘బాద్షా’ సినిమా, అల్లు అర్జున్ తో ‘ఇద్దరు అమ్మాయిలతో’ అనే మరో సినిమా కూడా మొదలు పెట్టడంతో, ఆదాయపన్ను శాఖ కళ్ళు బండ్ల గణేష్ పైన పడ్డాయి. నిన్న, ఆయన ఇల్లు, కార్యాలయాలపై ఒకేసారి దాడి జరిపిన ఆదాయపన్ను శాఖ అధికారులు ఆయన ఇంటి నుండి కొన్ని కీలకపత్రాలు స్వాదీనం చేసుకొన్నట్లు సమాచారం. ఈ రోజు ఉదయం ఆయనను తమ కార్యాలయానికి పిలిపించుకొని వారు మరిన్ని వివరాలు సేకరించారు.   బండ్ల గణేష్ ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడి చేసినప్పుడు, అందరూ గణేష్ కి, బొత్స సత్యనారాయణకి మద్య ఏదయినా రహస్య ఒప్పందాలు జరిగి ఉంటే, అవి బయటపడవచ్చునని భావించారు. కానీ, ఆదాయపన్ను శాఖ అధికారులు మాత్రం అటువంటివేవి దొరికినట్లు ఇంతవరకు ప్రకటించలేదు. అందువల్ల, ప్రస్తుతం కేవలం బండ్ల గణేష్ మాత్రమే ఆదాయపన్ను సమస్యలలో చిక్కుకొన్నట్లు భావించవలసి ఉంటుంది. ఒక వేళ ఆదాయపన్ను శాఖ అధికారులు, బొత్స సత్యనారాయణ కూడా గణేష్ సినిమా వ్యవహారాల్లో ఉన్నట్లు కనిపెడితే మాత్రం అది బొత్సకు కొత్త సమస్యలు తేవడం ఖాయం.

రామ్ గోపాల్ వర్మ సినిమాకి వివాదం తప్పదా?

    వివాదం లేకపోతే అది రామ్ గోపాల్ వర్మ సినిమా కాదని జనం నమ్మే పరిస్థితి ఉందిప్పుడు. మొదట్లో ‘శివ’, ‘క్షణ క్షణం’ వంటి విలక్షణమయిన అనేక మంచి సినిమాలు తీసిన అయన, ఆ తరువాత అండర్ వరల్డ్ గ్యాంగులు, డాన్ల సినిమాల వైపు మళ్ళారు. ఆ తరువాత దెయ్యాలు భూతల వెంట పడ్డారు కొన్నాళ్ళు. తరువాత రక్త చరిత్ర, బెజవాడ రౌడీలు వంటివి రాజకీయ, ఫాక్షనిస్ట్ సినిమాలు తీసి వివాదాలు తలకెత్తుకొన్నారు.   అంతవరకూ తీసిన ప్రతీ సినిమా కూడా ఒక వివాదస్పదమే అయ్యింది. అయినా, అందుకు ఆయన బాధ పడలేదు సరికదా చాలా గర్వపడ్డారు. మళ్ళీ, ఇప్పడు ముంబాయి ఉగ్రవాదుల దాడిని కధాశంగా తీసుకొని '26/11 ఇండియాపై దాడి' చిత్రం స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ సినిమా మార్చ్ మొదటివారంలో విడుదల కానున్న సమయంలో ఈసారి కూడా సినిమాపై వివాదం మొదలయింది. రామ్‌ప్రసాద్ అనే ఒక లాయర్ ఈ సినిమా విడుదల అయితే మతకల్లోల్లాలు చెలరేగే అవకాశం ఉంది గనుక, దానిని విడుదల చేయకుండా నిలిపేయవలసిందిగా కోరుతూ సెన్సార్ బోర్డుకు లేఖ వ్రాసారు. కానీ, ఆయన లేఖపై సెన్సార్ బోర్డు ప్రతిస్పందన ఇంకా తెలియలేదు.

చిరంజీవీ! డైలాగులు మరిచిపోతే ఎలాగయ్యా?

  కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేయడానికి పుట్టిన ప్రజారాజ్యం పార్టీ చివారఖరికి ఆ బంగాళఖాతంలోనే కలిసిపోగా, ఆయన ప్రజారాజ్యం నావ ఎక్కినవారు మునిగి పోయిన వారు మునిగిపోగా, మిగిలినవారు అదే కాంగ్రెస్ పార్టీలో తేలారు. అందుకు బహుమానంగా ఆయన కేంద్ర మంత్రి పదవి స్వీకరించి, తనతో మిగిలినవారిలో కొందరికి యధాశక్తిన ఏవో చిన్నాపెద్దా పదవులు ఇప్పించుకొన్నారు.   ప్రజారాజ్యం ఊపుమీద ఉన్న తోలిరోజుల్లో చిరంజీవి ‘సామాజిక తెలంగాణ’ అనే తనకే అర్ధం కాని ఒక కొత్తరాగం అందుకొని, అందరినీ గందర గోళం లో పడేసి చివరికి తనకీ అర్ధం కాకపోవడంతో, అనువయిన కాంగ్రెస్ పల్లవి ఎత్తుకొన్నాడు.   అయితే, ప్రస్తుతం కాంగ్రెస్ బాష బాగా నేర్చుకొన్నందున, ఆయనని ఎవరయినా “తెలంగాణా సంగతి ఏమిటీ? మీ అభిప్రాయం ఏమిటి?” అని అడిగినప్పుడు ఈ అంశంపై తానూ ఎన్నోసార్లు తన అభిప్రాయం ప్రకటించానని అందువల్ల మళ్ళీ మళ్ళీ అడిగి చరిత్ర తవ్వోదని సూచిస్తుంటారు. ప్రస్తుతం తానూ పూర్తీ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తను గనుక తమ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే అదే తనకు శిరోధార్యం అన్నాడాయన. ఏది ఏమైనా వీలయినంత త్వరలో నిర్ణయం జరగాలని ఆయన కోరుకొన్నారు.   మన కోదండరామాచార్యుల వారు, ఎంతయినా ప్రొఫెసరుగా చేసారు గనుక చిరంజీవికి అర్ధం అయ్యే సినిమా బాషలోనే జవాబిచ్చే ప్రయత్నం చేసారు. నటుడు కెమెరా ముందుకొచ్చి తన డైలాగులు మరిచిపోతే ఎలా ఉంటుందో, లేక వేరొకరి డైలాగులు వల్లిస్తే ఎలాఉంటుందో ఇప్పుడు చిరంజీవి మాటలు కూడా అలానే ఉన్నాయని ఆన్నారు. సామాజిక తెలంగాణా అంటూ ఆవేశపడిపోయి, ఇప్పుడు ఏకంగా తెలంగాణాయే వద్దని మాట్లాడటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోందని అయన అన్నారు.

బెడ్ రూము రాజకీయలేల బాబు?

  ఒకప్పుడు పార్టీలపరంగా మాత్రమే విమర్శించుకొనే స్థాయి నుండి నేడు వ్యక్తిగత దూషణల స్థాయికి మన రాజకీయాలు దిగజారిపోయినందుకు మనం నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి నెలకొంది. షర్మిలకి అసలు గాయమూ లేదు, ఆపరేషనూ జరుగలేదంటూ మొదలయిన విమర్శలు, ఇప్పడు ఒకరి కాళ్ళు మరొకరు పట్టుకోవడం, ఒకరి బెడ్ రూమ్ కబుర్లు మరొకరు మాట్లాడటం వరకు దిగజారిపోయాయి.   నల్గొండలో పర్యటిస్తున్న షర్మిల ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, “సుదీర్ఘ కాలంగా రాజకీయాలలో ఉండి, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన చంద్రబాబు, తన స్థాయిని మరిచి మాపై విమర్శలు చేస్తున్నారు. మా ఇంట్లో 70 బెడ్ రూములు కట్టుకోన్నామని ఆయన ప్రజలకి చెపుతున్నారు. మా ఇంట్లో మేము ఎన్ని బెడ్ రూములు కట్టుకొంటే దానితో ఆయనకి ఏమి సబంధం? అయినా అదేమయినా జాతీయ సమస్యా ఉపన్యాసాలలో మాట్లాడటానికి? మా ఇంట్లో ఎన్నిబెడ్ రూములు ఉన్నాయో తెలుసుకోవాలని ఆయనకి అంతగా ఆసక్తి ఉంటే, టవున్ ప్లానింగ్ అధికారుల దగ్గిరకి వెళ్తే అక్కడ మా ఇంటి తాలూకు డ్రాయింగులు చూసుకోవచ్చును."   "తెలుగు దేశం పార్టీలో ఒక నేతకి నా కాళ్ళకి దెబ్బ తగిలిందా లేదా? అని అనుమానం, మరో నేతకి అసలు నాకాలికి ఆపరేషను జరిగిందా లేదా అని అనుమానం. వారి నాయకుడికి మా ఇంట్లో బెడ్ రూములెన్ని అని అనుమానం. వీరికి ఇంతకన్నా మాట్లాడేందుకు మరే అంశం దొరకదా? అయినా ప్రతీ చిన్న విషయాన్నీ కూడా రాజకీయం చేసి ప్రయోజనం పొందాలని ప్రయత్నించడం చాల హేయమయిన పని,” అని అన్నారు.   దీనికి చంద్రబాబు ఆయన పార్టీ ధీటుగానే సమాధానం చెప్పవచ్చును. గానీ, అసలు ఈ రాజకీయ నాయకులు ఎందుకు ఇంత దిగజారిపోతున్నారని ఆలోచిస్తే, ఒక ఆశ్చర్యకరమయిన విషయం బయటపడుతుంది. అది మన సినీపరిశ్రమ, మీడియా చాల కాలంగా అనుసరిస్తున్నసూత్రాన్ని వారు అమలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది.   ప్రజలకి ఆసక్తి కలిగించే అంశాలను ప్రస్తావించడం, మాస్ మసాల అంశాలు జోడించిన ప్రసంగాలతో ప్రజలకి అవసరమయిన ‘కిక్కు’ అందించడం, మరి కొంత దిగజారి ఎదుట వారి బలహీనతలను బట్ట బయలు చేసి ప్రజలను రంజింపజేసి వారి చేత చప్పట్లు కొట్టించుకోవడం, ‘కిక్కు’ ఇచ్చే ప్రసంగాలుంటాయనే నమ్మకం ప్రజలకు కల్పించి, తద్వారా వారిని సభలకు రప్పించుకోవడం వంటి కొత్త (పాత) సూత్రాలతో నేడు మన రాజకీయ నాయకులు నోటికొచ్చిన మాటలతో ఎదుటవారిని దూషిస్తూ ప్రజలకి వినోదంపంచి ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల తాత్కాలికంగా జనం చప్పట్లు పడినా, అవి ఓట్ల రూపంలో ఎంతమేరకు మారగలవని వారు ఆలోచించుకోవాలి.   అయితే, ఇక్కడ కూడా వారు మరో సూత్రం అమలు చేస్తున్నారు. ఒక అబద్దాన్ని నిజం చేయాలంటే, అది అబద్దం కాదు నూటికి నూరు శాతం నిజమేనని వారు స్వయంగా ఆత్మవంచన చేసుకొని నమ్మడమే కాకుండా, అదే విషయాన్ని తమ సభల్లో, సమావేశాల్లో పదేపదే గట్టిగా చెప్పడం ద్వారా క్రమంగా ప్రజలను అబద్దాన్ని నిజం అని నమ్మే స్థాయికి తీసుకు రావచ్చుననే ఆలోచనతో మన రాజకీయ నాయకులు ప్రజలను వంచిస్తున్నారు.   ఇంకా, నిర్లజ్జగా చెప్పుకొంటే ప్రజలలో చాలా మంది కుల, మతం, ప్రాంతం ప్రభావాలలో ఉన్నందునే, వారి ఆటలు కొనసాగుతున్నాయి. తాము ఏ ప్రభావానికి లొంగి ఉంటే, దానికి సంబందించిన వ్యక్తులు చెపుతున్నవి అన్నీ కూడా నిజమేనని గుడ్డిగానమ్మే పరిస్థితులు ఇప్పుడు దేశమంతటా కనబడుతున్నాయి.   తమ ఉన్నత చదువులు, తమ లోకజ్ఞానం, తమ మేధస్సు వంటివేవీ కూడా, అటువంటి నాయకుల మాటలను, పార్టీలను ప్రశ్నించే వివేకం కలిగించకపోవడం మరో దౌర్భాగ్యం అని చెప్పక తప్పదు. ప్రజలలో ఉన్న ఈ బలహీనతలే రాజకీయ నాయకులకి అలుసుగా మారాయని చెప్పవచ్చును.

స్వామీ గౌడ్ కు వ్యతిరేఖంగా ఏకమయిన స్వతంత్ర అభ్యర్దులు

  ఏదో అదృష్టం బాగుండి తెలంగాణా ఉద్యమం పుణ్యమాని సకల జనుల సమ్మె జరగడం, దానితో తన రాజకీయ జీవితానికి బీజం వేసుకొని మెల్లగా తెరాస పార్టీలో జేరడం, అటు పిమ్మట కేసీఆర్ దయకి పాత్రుడవడంతో తెలంగాణా జేయేసీ కన్వీనర్ పదవి కూడా వచ్చి వళ్ళోవాలడం అన్నీ చకచక జరిగిపోయాయని సంతోషిస్తున్న తెరాస నేత స్వామీ గౌడ్ ను, ఒకవైపు తెలంగాణా యన్.జీ.ఓ. గృహ సొసైటీ అక్రమాల కేసు భూతంలా వెంటాడుతుంటే, మరో వైపు సొసైటీ సభ్యులు వెంటనే డైరెక్టర్ పదవి నుండి వెంటనే తప్పుకోమని డిమాండ్ చేయడం స్వామి గౌడ్ కు చాల ఇబ్బందికరంగా మారింది.   రాజకీయాలలోకి వచ్చాడు గనుక, అదంతా రాజకీయ కుట్ర అని ఎంతకొట్టి పారేసినా, కోర్టులు మాత్రం అందుకు అంగీకరించక కేసు నడపాల్సిందే! అని పట్టుబడుతూ ఆయన సహనానికి పరీక్ష పెడుతున్నాయి. కేసీఆర్ దయతలచి శాసనమండలి సీటుకు కూడా టికెట్ ఇచ్చి రాజకీయంగా మరో మెట్టు పైకి ఎక్కేందుకు ప్రోత్సహిస్తుంటే, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న 15 మంది స్వతంత్ర అభ్యర్ధులు ఒప్పందం చేసుకొని తమలో ఒక్కరే పోటీలో నిలబడి, స్వామీ గౌడ్ ను ఎలాగయినా ఈ ఎన్నికలలో ఓడించాలని నిర్ణయించుకొన్నారు. తనకి ఎంత కేసీఆర్ మద్దతు ఉన్నపటికీ, ఇంతమంది కలిసి తనకు వ్యతిరేఖంగా పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో, స్వామీ గౌడ్ కొంచెం కంగారు పడుతున్నట్లు సమాచారం. ఆయన స్థానికేతరుడయిన కారణంగానే తాము ఆయనకి వ్యతిరేఖంగా పోటీ చేస్తున్నామని మీడియా వారితో వారు చెపారు. కర్ణుడి ఓటమికి వేయి శాపాలన్నట్లు స్వామీ గౌడ్ క్కూడా, పళ్ళెంలో పెట్టి దొరుకుతున్న శాసనమండలి సీటును అందుకొనేందుకు బోలెడు సమస్యలు అడ్డుపడుతున్నాయి. ఆయన వీటిని అన్నిటినీ అధిగమించి శాసనమండలిలో కాలుపెట్టినట్లయితే, ఇక అయన రాజకీయ జీవితంలో మరో కొత్త అధ్యాయం మొదలయిందని భావించవచ్చును.

కదిరిలో నారా లోకేష్ పర్యటన

        తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ నాయుడు కదిరిలో పర్యటించారు. ఆయన పర్యటన సందర్భంగా టీడీపీ నేతలు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లోకేష్ నాయుడు పాల్గొన్నారు. లోకేష్ ఉత్సాహంగా పాల్గొనడంతో పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. ఈ బైక్ ర్యాలీలో లోకేష్‌తో పాటు పార్లమెంటు సభ్యుడు నిమ్మల కిష్టప్ప, ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పార్టీపై దృష్టి మరికొద్ది రోజుల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి నారా లోకేష్ అడుగు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కదిరిలో తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అత్తార్‌చాంద్‌బాషా కొత్తగా నిర్మించిన అత్తార్ రెసిడెన్సీ భవనంలో జరిగే ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొని అత్తార్ రెసిడెన్సీని ప్రారంభించనున్నారు. ఆ తర్వాత తెలుగునాడు విద్యార్ధి సమాఖ్య ఆద్వర్యంలో జరిగే కార్యక్రమం మేలుకొలుపులో పాల్లొంటారు. కదిరికి నారా లోకేష్ కదిరికి వస్తున్న సందర్భంగా హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప, పొలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు, మైనార్టీ సెల్ రాష్ట్ర నాయకులు లాల్‌జాన్‌బాషా, ఎమ్మెల్యేలు పరిటా ల సునీత , పయ్యావుల కేశవ్, బి.కె.పార్థసారథి, అబ్ధుల్‌ఘనీ, పల్లెరఘునాథరెడ్డి, ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి, ఇతర నాయకులు హనుమంతరాయ చౌదరి, మహాలక్ష్మీ శ్రీనివాస్, శమంతకమణి, హాజరు కానున్నట్లు మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అత్తార్‌చాంద్‌బాషా వివరించారు.

'గబ్బర్ సింగ్' నిర్మాత గణేష్ ఇంటిపై ఐటి దాడులు

        పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్' నిర్మాత బండ్ల గణేష్ ఇంటి పై ఐటీ అధికారులు దాడి చేశారు. ఏకకాలంలో ఆయన ఆఫీస్, ఇ౦టిపై తనిఖీలు నిర్వహిస్తున్నారు. బండ్ల గణేష్ ఆస్తులు, వ్యాపారాలకు సంబంధించిన కీలక పత్రాలను సోదా చేస్తున్నారు. తెలుగు సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేస్తూ వచ్చిన గణేష్ ఒక్కసారిగా భారీ నిర్మాతగా మారారు.   పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ అండతో బండ్ల గణేష్ భారీ నిర్మాతగా మారారని ఆ మధ్య వార్తలు కుడా వచ్చాయి. గణేష్ పవన్ కళ్యాణ్ తో తీసిన తీన్ మార్ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ కి బొత్స సత్యనారాయణ కూడా తన ఫ్యామిలీతో హాజరయ్యారు. రవితేజ తో ఆంజనేయులు సినిమా నిర్మించిన గణేష్ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో వెంట వెంటనే రెండు భారీ సినిమాలు చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. గబ్బర్ సింగ్ సినిమా సూపర్ హిట్ కావడంతో బాగా పాపులర్ అయ్యారు.   ప్రస్తుతం గణేష్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా శ్రీనువైట్ల డైరెక్షన్ లో 'బాద్ షా' సినిమాను నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏకకాలంలో నిర్మాత గణేష్ ఇన్ని పెద్ద సినిమాలు ఎలా నిర్మిస్తున్నారు? ఇంత భారీ పెట్టుబడి ఎలా పెడుతున్నారనే విషయాలపై ఐటి అధికారుల్లో అనుమానాలు రావడంతో రైడ్ చేసినట్లు తెలుస్తోంది.

కోదండరాం రాజకీయ ఉపన్యాసం

        అచ్చం ఒక రాజకీయ పార్టీ స్పోక్ పర్సన్ లా మాట్లాడుతున్నారు తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం. ఇప్పటికీ ప్రభుత్వ ఉద్యోగి అయిన కోదండరాం తాజాగా మరోసారి రాజకీయ ఉపన్యాసం చేశారు. అసలు తెలంగాణ ప్రజలు తెలుగుదేశం పార్టీని నమ్మవద్దని కోదంరాం పిలుపునిచ్చాడు. నేడు బస్సుయాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో కోదండరాం తెలంగాణ నుఉర్రూతలుగించే ప్రయత్నంలో భారీ ప్రసంగం ఒకటి వదిలాడు. టీడీపీతో పాటు కాంగ్రెస్, వైఎస్సాఆర్ కాంగ్రెస్ లను కూడా తరిమికొట్టాలని కోదండరాం పిలుపునిచ్చాడు. ఇక ఇన్ని పార్టీలో పోయాకా… తెలంగాణలో మిగిలింది రెండే పార్టీలు. ఒకటి తెలంగాణ రాష్ట్ర సమితి, రెండు బీజేపీ. మరి ఈ రెండు పార్టీల్లో కూడా దేన్ని నమ్మాల్లో ఆయనే సూచించి ఉంటే బాగుండేది.

నటుడు మంచు మోహన్‌ బాబుకు పితృవియోగం

          ప్రముఖ తెలుగు నటుడు మోహన్ బాబు తండ్రి మంచు నారాయణస్వామినాయుడు ఆదివారం అర్ధరాత్రి కన్నుమూశారు. తిరుపతి శ్రీ విద్యానికేతన్ ప్రాంగణంలోని ఆయన నివాసంలో మృతి చెందారు. నారాయణ స్వామి నాయుడు వయస్సు 95 సంవత్సరాలు. నారాయణస్వామినాయుడుకు భార్య, నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. గతంలో నారాయణస్వామి నాయుడు హెడ్‌మాస్టర్‌గా సేవలందించారు. నారాయణ నాయుడు మృతికి బంధువులు, అత్మీయులు, పలు రాజకీయవేత్తలు సంతాపం తెలిపారు.   ”మా తాత మంచి మనుసున్న వ్యక్తి. ఆయన రాత్రి 12.10 గంటలకు చనిపోయారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం. మా తాతయ్యను మేము మిస్ అయ్యాం” అని మంచు మనోజ్ ట్వీట్ చేయగా, ”95 ఏళ్లు అధ్బుతమయిన జీవితం గడిపారు. ఉపాధ్యాయుడిగా మీ సేవలు చిరస్మరణీయం. తాతయ్య మిమ్మల్ని మిస్ అయ్యాం” అని మంచు లక్ష్మీప్రసన్న ట్వీట్ చేశారు.

'వేర్పాటు'వాద పార్టీయే 'ఎన్టీఆర్'విగ్రహ విధ్వంసకశక్తి?!

- డా. ఎబికె ప్రసాద్ సీనియర్ సంపాదకులు]     "ప్రజల ఆకాంక్షలు వేరు, (వి)నాయకుల కోరికలు వేరు' అన్నాడు మహాకవి శ్రీ శ్రీ, ఇక్కడ "ప్రజల ఆకాంక్షలు'' అంటే, వారి మనుగడకు దోహదపడే దైనందిన [తిండి, బట్ట, వసతి, ఉపాథి] ప్రయోజనాలు అని అర్థం. కాగా "నాయకుల కోరికలు వేరు'' అంటే, పరస్పరం స్పర్థల ద్వారా, సమాజంలో అశాంతిని సృష్టించడం ద్వారా ప్రజలమధ్య నెలకొన్న ఐకమత్యాని చెడగొట్టడం ద్వారా, తమ పదవీ ప్రయోజనాల కోసం కృత్రిమంగా ఉద్యమాలు నిర్మించడం ద్వారా అధికారాన్ని కైవశం చేసుకోవాలని రాజకీయ నిరుద్యోగులు వెళ్ళబుచ్చుకునే కోరికలు అని అర్థం! ఆ స్వార్థపూరిత కోరికలు నెరవేర్చుకోడానికి అబద్ధ ప్రచారాలతో, వంచనతో లేని ఆశలు పెంచడం ద్వారా యువతలో బలహీనమనస్కులుగా ఉన్న వారిని రాజకీయ 'చేతబడుల' ద్వారా ఆత్మహత్యలను ప్రోత్సహించడం రాజకీయ నిరుద్యోగులకు అబ్బిన కూసువిద్య. ఈ రహస్యాన్ని అనేక అనుభవాల ద్వారా తెలంగాణా తెలుగుప్రజలు తెలుసుకొన్నారని గ్రహించిన ఒక వేర్పాటువాద పార్టీ "టాంక్ బండ్''పై నెలకొని వున్నతెలుగుజాతి తేజోమూర్తుల విగ్రహాలను విధ్వంసం చేయడానికి గతంలో పథకంపన్ని తెలుగుజాతి ఆగ్రహజ్వాలలకు గురికావలసివచ్చింది. తిరిగి అదే పార్టీ నాయకత్వం తమ వేర్పాటు ఉద్యమం ఇక ముందుకు సాగడం కష్టమని భావించి, కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని కలిపెస్తాను, కాని, వందలాదిమంది యువకుల ఆత్మహత్యలకు తాము కారణమన్న వాస్తవాన్ని మింగలేక కక్కలేని పరిస్థుతుల్లో రేపటి ప్రజల ఆగ్రహం నుంచి కాపాడుమని చేయగల విన్నపాలు చేసుకుంది. "ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర'' సాధన పేరిట ఆ వేర్పాటువాద పార్టీ తలపెట్టిన 'ఉద్యమం' వెర్రితలలు వేసి జాతికి స్ఫూర్తిదాయకమైన తోజోమూర్తుల విగ్రహాలను ధ్వంసం చేసింది, లేదా ఆ విధ్వంస కార్యక్రమానికి ప్రేరణగా నిలిచింది. తిరిగి తన అధికార దాహాన్ని తీర్చగల సానుకూల పరిణామాలు వచ్చే అవకాశాలు మృగ్యమైపోతున్నందున 'ఉద్యమ'బాటను చివరికి "2014 ఎన్నికల బాట''గా ఆ పార్టీ మార్చేసింది. కాని, తన లోపాయికారీ విధ్వంసక పాత్రను ఆ పార్టీ విరమించుకోలేదు; ఒకవైపున తనకేమీ తెలియనట్టు ఆ పార్టీ నటిస్తూనే, మరికొంతమంది యువకుల్ని [ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకున్న వారితో సహా] "ప్రత్యేక రాష్ట్రం''కోసమే ప్రాణత్యాగం చేసినట్టు చివరికి సొంతపార్టీలోని ముక్కుపచ్చలారని బిడ్డల్ని సహితం పరోక్షంగా ముద్రవేసి లోకానికి చూపిస్తోంది!  తెలుగుజాతిని విచ్చిన్నం చేయడం కోసం ఆ వేర్పాటువాద ముఠా తెలుగుజాతి కీర్తికిరీటాల్లో ఒకరైన దివంగత ముఖ్యమంత్రి, అగ్రశ్రేణి తెలుగు నటశేఖరుడైన ఎన్.టి. రామారావు గౌరవార్థం తెలంగాణాప్రజలు షామీర్ పేటలో నెలకొల్పుకున్న ఆయని విగ్రహాన్ని [07-02-2013] నిప్పంటించి ధ్వంసం చేశారు. ఈ వికృతచేష్ట స్థానికప్రజలలో అశాంతికి కారణమయింది. ఈ ఘటనకు ముందు యు.పి.ఎ. అధ్యక్షురాలు, కాంగ్రెస్ నాయకురాలు అయిన సోనియాగాంధీ, ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి 'కటవుట్ల'ను కూడా తగలపెట్టారు. ఆ విధ్వంసకులు ఎవరు అన్న ప్రశ్నకు ఈ రెండు సందర్భాలలోనూ వినవచ్చిన "రొడ్డకొట్టుడు'' (రొటీన్) సమాధానం మాత్రం ఒకటే - "గుర్తుతెలియని వ్యక్తులు'' అని! కాని, ఎవరు 'ఉద్యమం'పేరిట బండబూతులు వల్లిస్తూ వచ్చారో, ఏ తిట్లు, శాపనార్థాలు ఆధారంగా తెలుగుజాతి మధ్య విద్వేష వాతావరణాన్ని ఎవరు సృష్టిస్తూ వచ్చారో వారికి చెందిన పార్టీ తాలూకు ముఠాయే ఈ విగ్రహ విధ్వంసక చర్యలకు కూడా కారణమై ఉండాలి. ఎందుకంటే, రాజకీయ నిరుద్యోగులకు తప్ప మిగతా సామాన్య ప్రజాబాహుళ్యానికి ఆ అవసరం ఉండదుగాక ఉండదు. ఈ రెండు ఘటనలకూ కారకులయినవాళ్ళు నిస్సందేహంగా అదే పార్టీకి చెందినవాళ్ళయి ఉంటారు. ఇది దాచినా దాగని రేపు రుజువు కాబోతున్న సత్యం! అంతేగాదు, భారత దళితవర్గాల ఉద్యమ స్ఫూర్తిదాత, రాజ్యాంగ నిర్మాత అయిన బి.ఆర్. అంబేడ్కర్, 'తెలుగుదేశం' వ్యవస్థాపక అధ్యక్షుడయిన ఎన్టీఆర్, తెలుగువారి ప్రాణత్యాగ పురుషులలో ఒకరైన పొట్టి శ్రీరాములు విగ్రహాలు పలుచోట్ల కూడా గాడితప్పిన రాజకీయ నిరుద్యోగుల ఉద్యమపార్టీ విధ్వంసక కార్యక్రమాలకు గురైనాయి. పైగా, ఎన్టీఆర్ విగ్రహాన్ని షామీర్ పేట వద్ద విధ్వంసం ఏ సమయంలో జరిగింది? పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి కేంద్రప్రభుత్వం నిర్ణయించి ఆ వైపుగా రూపకల్పన చర్యలు తీసుకుంటున్న సమయంలో ఈ పని జరిగింది. అయినా, ఇంతకూ రాష్ట్రంలో అంతర్భాగమైన తెలుగువారి తెలంగాణా ప్రాంతానికి ఎన్టీఆర్ చేసిన 'ద్రోహం' ఏమిటి? 1982-83 ఎన్నికల్లో మొత్తం రాష్ట్రవ్యాపితంగా 9 మాసాలలో కలయతిరిగి, అంత స్వల్పవ్యవథిలో రాష్ట్రచరిత్రలోనే గాక ప్రపంచచరిత్రలోనే ఎన్నికల ద్వారా వందేళ్ళకు పైబడిన చరిత్రగల కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమికి కారకుడయి చరిత్ర సృష్టించిన వ్యక్తి ఎన్టీఆర్. ఇక్కడ గమనించవలసింది ఎన్నికల్లో ఒక రాజకీయపార్టీగా 'తెలుగుదేశం' సాధించిన విజయాన్ని మాత్రమే కాదు; ఎన్టీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శతాబ్దాలుగా నిజాం నిరంకుశపాలన కింద దొరల, జాగిర్దార్ల, దేశ్ ముఖ్ ల, పటేల్, పట్వారీల ధాష్టీకం తాలూకూ మిగిలి ఉన్న అవశేషాలకు చరమాంకంగా తెలంగాణా చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక్క కలంపోటుతో పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దుచేసి, ప్రజాస్వామ్య విస్తరణలో భాగంగా ప్రజలకు పాలనావ్యవస్థను సన్నిహితంగా చేర్చినందుకు యావత్తు తెలంగాణా ప్రజాబాహుళ్యమూ ఎన్టీఆర్ కు నీరాజనాలు తెలిపిన పరిణామాన్ని తెలంగాణాప్రజలు మరవలేరుగాక మరవలేరు! అంతేగాదు, ఉద్యోగ సద్యోగాల విషయంలో తన దృష్టికి వచ్చిన కొన్ని అవకతవకలను [వీటిని ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత ఏర్పడిన ప్రభుత్వాలలో అత్యంత కీలక పదవులను అనుభవిస్తూ వచ్చిన తెలంగాణా ప్రాంత మంత్రులు ఎవరూ గుర్తించడంలో విఫలులయినా] సరిచేయడానికి నడుంబిగించి "జీ.వో. 610''ని విడుదల చేసినవాడూ ఎన్టీఆరేనని మరవరాదు. కాని ఇప్పుడు తిరిగి ఆ ఎన్టీఆర్ విగ్రహాన్నే ధ్వంసం చేయడం వెనక, టాంక్ బండ్ పై తేజోమూర్తుల (అన్ని ప్రాంతాలకు చెందినవారి) విగ్రహాలను ధ్వంసం చేయడం వెనక ఉన్నది 'దృశ్య'శక్తులేగాని 'అదృశ్య'శక్తులు కావు; ఈ సత్యం రాష్ట్ర పోలీసు అధికారులకు, ప్రభుత్వానికీ తెలుసు. అయినా ప్రజానాయకుల విగ్రహాల రక్షణకు ఉన్న చట్టాన్ని కూడా వినియోగించి, విధ్వంసకులపై కఠినచర్యలు రాష్ట్రప్రభుత్వం ఇంతవరకూ తీసుకోలేదు, ఒకవేళ చర్య తీసుకొని ఉంటే, అందుకు కారాకుల పేర్లనూ కనీసం బయటపెట్ట లేదు. ప్రజలమధ్య శాంతిభద్రతలను భగ్నం చేసిన వాళ్ళను శిక్షించడానికి అవకాశమిస్తున్న చట్టాలను సహితం వినియోగించలేని 'వాజమ్మ'లుగా పాలకవర్గాలు ఉండిపోరాదు. ఆ పనిని నిర్వహించడంలో ప్రభుత్వాలు ఏదో ఒక 'మిష'పైన, లేదా కేవలం రాజకీయ ప్రయోజనాలకోసం, విఫలమవుతున్నందువల్లనే న్యాయస్థానాలు సహితం పాలనా నిర్వహణలో తరచుగా జోక్యం చేసుకోవలసి వస్తోంది. కోర్టుల జోక్యాన్ని తప్పుపట్టగల స్థాయికి పాలకవర్గాలు, వాటి విధానాలు యింకా ఎదిగరాలేదు. కనుకనే రాజ్యాంగం అనుమతించిన భావప్రకటనా స్వేచ్చనూ, వాక్, సభాస్వాతంత్ర్యాలను వాటి పరిథిలో అనుభవించాల్సిన రాజకీయశక్తులు ఆ పరిధుల్ని మించి తమ అదుపుతప్పి వ్యవహరించే ఉద్యమాలను, 'బంద్'లు, హర్తాళ్ తదితర నిరసనోద్యమాలను నియంత్రించేందుకు "ప్రజాప్రయోజన వాజ్యాలు'' (పిల్స్) ఆధారంగా సుప్రీంకోర్టు సాహసించుతోంది! ఉదాహరణకు 2009లో ఒకే ఒక్క సంవత్సరంలో కేరళలో వివిధ పార్టీల ఆధ్వర్యంలో విడివిడిగా 363 హర్తాళ్ళు, బంద్ లూ జరిగినప్పుడు ప్రభుత్వ, ప్రయివేట్ ఆస్తులకు జరిగిన విధ్వంసంలో భారీనష్టాలు వాటిల్లాయి. అప్పుడు సుప్రీంకోర్టు తనముందుకు విచారణకు వచ్చిన ఒక ప్రజాప్రయోజనాల రక్షణ వాజ్యాన్ని అనుమతిస్తూ దేశ అత్యున్నత్య న్యాయస్థానం "ప్రభుత్వ, ప్రయివేట్ ఆస్తుల'' రక్షణకు సంబంధించి ఒక ఉత్తర్వు జారీ చేసింది. ఇందుకుగాను కేంద్రప్రభుత్వం "ప్రభుత్వ ఆస్తుల విధ్వంస నిరోధక చట్టాన్ని'' సవరించి, బంద్ లు, హర్తాళ్ లు ఎవరు నిర్వహిస్తారో ఆయా పార్టీలనుంచి, నిర్వాహకులనుంచీ "నష్టపరిహారాన్ని రాబట్టుకునేందుకు మార్గదర్శకాలను'' రూపొందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది! కాని కేంద్రంగానీ, రాష్ట్రప్రభుత్వాలుగానీ ఇంతవరకూ "నిమ్మకునీరెత్తినట్టు'' కూర్చున్నాయేగాని సుప్రీం ఆదేశాలను గౌరవించలేదు! ఆచరణలో తగిన చర్యలూ తీసుకోలేదు.   అధికారలాలసతో తన పదవీ ప్రయోజనంకోసం తెలంగాణాలోని రాజకీయ నిరిద్యోగి ప్రారంభించిన 'వేర్పాటు ఉద్యమం' సందర్భంగా పబ్లిక్, ప్రయివేట్ ఆస్తులకు జరుగుతూ వచ్చిన నష్టాల సందర్భంగా కూడా రాష్ట్ర హైకోర్టు ఈ నష్టాన్ని రాజకీయపార్టీల నుంచి, వాటి నాయకులనుంచి వసూలు చేయవలసిందిగా ఒక సమయంలో రాష్ట్రప్రభుత్వానికి సూచించింది కూడా! అయినా ఉలుకూ, పలుకూ లేదు. ప్రజా శ్రేయస్సుతోనూ, వారి వకాలిక ప్రయోజనాలతోనూ సంబంధంలేని, కేవలం రాజకీయస్వార్థం కోసం నిర్వహించే బంద్ లూ, హర్తాళ్ళూ రాజ్యాంగ విరుద్ధమనీ, ఆ సమయంలో పౌరుల రక్షణ ప్రభుత్వాల బాధ్యత అనీ సుప్రీంకోర్టు 2009 తీర్పులోనే స్పష్టంచేసిందని గుర్తించాలి! "వేర్పాటు''వాదానికి మద్దతు సంపాదించేందుకని విధ్వంసకాండకు, అరాచకచర్యలకు దిగజారే రాజకీయ నిరుద్యోగులను సహించడమే పెద్దనేరంగా ప్రకటించాల్సిన సమయం వచ్చింది. విగ్రహ విధ్వంసక శక్తులు ఇస్లామియా ఉగ్రవాదులని ఇంతవరకూ భావిస్తున్నవాళ్ళు హైందవంలోని అరాచకశక్తులు కూడా ఇందుకు భిన్నమైనవాళ్ళుకారని తీర్మానించుకోక తప్పదు. అవధులుమించిన ఉద్రేకవాదే ఉగ్రవాది!  

మహాకుంభమేళాలో తొక్కిసలాట: 36 మంది మృతి

        మహాకుంభమేళాలో అనూహ్యంగా సంభవించిన తొక్కిసలాటలో 36 మంది మృతిచెందారు. మౌని అమావాస్య పురస్కరించుకొని కుంభమేళాకు దాదాపు మూడు కోట్ల మంది భక్తులు తరలివచ్చారు. పుణ్యస్నానాలు పూర్తిచేసుకొని అలహాబాద్‌ రైల్వేస్టేషన్‌కు తిరిగి వచ్చిన సమయంలోనే రాత్రి 7 గంటలకు ఈ ఘటన జరిగిందని డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ హరీందర్‌రావు తెలిపారు. 5, 6 నెంబర్ల ప్లాట్‌ఫారాల వద్దకు వేలాదిమంది యాత్రికులు ఒకేసారి చేరుకోవడంతో ఈ ఘటన సంభవించింది. ప్రత్యక్షసాక్షులు చెపుతున్న కథనం ప్రకారం, యాత్రికులు పెద్దసంఖ్యలో ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిపైకి చేరడంతో ఒక్కసారిగా అది 6వ నెంబర్‌ ప్లాట్‌ఫారంపై కూలిపోయింది. మూడు గంటల తర్వాత 10 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మరో 10 మరణించినట్లుగా అర్ధరాత్రి అందిన సమాచారం వచ్చింది. ఇప్పటి వరకు మొత్తం 36 మంది చనిపోయినట్లు తెలుస్తోంది.ఈ తొక్కిసలాటపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో పాటు భారతీయ రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.

ఔనంటే కాదనిలే వద్దంటే ఇమ్మనిలే....

  రాబోయే ఎన్నికలకి కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ నాయకత్వం వహిస్తారని ఖాయం అయిపోయిన తరువాత, ఇప్పుడు అందరి కళ్ళు దాని ప్రత్యమ్నాయమయిన భారతీయ జనతా పార్టీ మీదనే ఉన్నాయి. ఆ పార్టీలో ప్రముఖంగా మోడీ, అద్వానీ పేర్లు వినిపిస్తున్నపటికీ, మరో ఇద్దరు ముగ్గురు నేతలు కూడా ప్రధాన మంత్రి పదవికి ఆశగా ఎదురు చూస్తున్నారు.   వీరికి అదనంగా యన్.డీ.యే. కూటమి నుంచి కూడా కొందరు మాక్కూడా ప్రధాన మంత్రి పదవికి ‘ఒకే ఒక్క చాన్స్!’ అంటూ తమ సహచారులద్వారా తమ గళం వినిపిస్తున్నారు. వారిలో సమైక్య రాష్ట్రీయ జనత దళ్ పార్టీ అధ్యక్షుడయిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా ఒకరు.   మూడు రోజుల క్రితం శ్రీ లంక అధ్యక్షుడు రాజపక్స బీహారులోని బౌద్ధ గయకు వచ్చిన సందర్భంగా, ఆయనకు స్వాగతం పలికేందుకు వెళ్ళిన నితీష్ కుమార్ ను, పత్రికలవారు ఆయన పార్టీకి చెందిన మాజీ కేంద్ర మంత్రి హరి కిశోర్ సింగ్ ‘నితీష్ కుమార్ ప్రధాన పదవికి అన్ని విధాల అర్హుడు’ అన్నమాటలను గుర్తు చేసి, ఆయన ప్రతిస్పందన కోరినప్పుడు, "ఇటువంటివన్నీ పనికిరాని మాటలు. నేను ప్రధాన మంత్రి పదవి రేసులో లేను. ఎందుకంటే నేను ఆ పదవికి యోగ్యుడినికానని భావిస్తున్నాను. మా యన్.డీ.యే. కూటమిలో భారతీయ జనతాపార్టీయే అతి పెద్దపార్టీ గనుక సహజంగా దానికే మొదటి అవకాశం ఉంటుంది. ఒకవేళ, అది ఆ అవకాశాన్నిఉపయోగించుకోలేని పరిస్థితి ఏర్పడినప్పుడే, కూటమిలో ఇతర పార్టీలకు ఈ విషయంపై ఆలోచించే అవసరం ఏర్పడుతుంది. భారతీయజనతా పార్టీ త్వరలోనే తమ నాయకుడిని ప్రకటించే అవకాశం ఉందనుకొంటున్నాను. గనుక,ఆ పార్టీ తన నిర్ణయం ప్రకటించిన తరువాతే మా పార్టీ అభిప్రాయం చెపుతాము,” అని అన్నారు.   అయితే, “బీహార్ రాష్ట్రంలో ఆలూ (బంగాళ దుంపలు) ఉన్నంత కాలం, లాలూ కూడా ముఖ్యమంత్రిగా ఉంటాడు” అని స్వోత్కర్ష (స్వంత డబ్బా) చేసుకొన్నఆయన  చేతిలోంచి అధికారం గుంజుకొని, తనదయిన శైలిలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్ననితీష్ కుమార్ అంటే గిట్టని  లాలూ ప్రసాద్ యాదవ్ మాత్రం ఆయన మాటలను నమ్మడం లేదు.   నితీష్ కుమార్ తన అనుచరుల మాటలను మీడియా ముందు ఖండిస్తున్నపటికీ, తన అభ్యర్దిత్వంపై కూటమిలో మిగిలిన పార్టీల అభిప్రాయం తెలుసుకొనేందుకే, ఆయన స్వయంగా తన అనుచరుల ద్వారా ఈ చర్చలేవదీస్తున్నాడని లాలూ అభిప్రాయం వ్యక్తం చేసారు.   “ప్రధానమంత్రి పదవిపై నాకూ ఆశుంది, గానీ సాధ్యాసాద్యాలు కూడా చూసుకోవాలి కదా? ఆయన బీహార్ ముఖ్యమంత్రి అయినంత మాత్రాన్నఅది దేశ ప్రధాని పదవి చెప్పటేందుకు ప్రత్యేక అర్హత కాబోదు కదా? ఒకవేళ నితీష్ కుమార్ అదే తన ప్రధాన అర్హత అని భావిస్తే నేనూ, నా భార్య రబ్రీ దేవీ కూడా బీహార్ ముఖ్యమంత్రులుగా చేసాము గనుక, ఆయన కన్నా ముందు మేమే ప్రధాన మంత్రి పదవికి అర్హులమని అనుకోవాల్సి ఉంటుంది,” అని లాలూ ప్రసాద్ అన్నారు.   మన దేశ ప్రధాన పదవికి ఇంతమంది అర్హులుండగా ఇక మనకేల చింత?

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రేప్

        సాఫ్టువేర్ సంస్థలో ఇంజనీర్‌గా పని చేస్తున్న యువతికి ఆ సంస్థ యజమాని కూల్ డ్రింకులో మత్తుమందు కలిపి ఇచ్చి అత్యాచారం చేసిన ఘటన తమిళనాడులోని చెన్నైలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం దిండుక్కల్ అలగానగర్‌కు చెందిన 25 ఏళ్ల యువతి ఓ సాఫ్టువేర్ సంస్థలో పని చేస్తోంది. కొన్ని రోజుల క్రితం ఆ యువతికి ఆ సాఫ్టువేర్ సంస్థ యజమాని కూల్ డ్రింకులో మత్తుమందు కలిపి ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. స్పృహలోకి వచ్చిన ఆమెకు జరిగిన విషయాన్ని చెప్పాడు. తాను సదరు దృశ్యాలను చిత్రీకరించానని.. ఎవరికైనా చెబితే ఇంటర్నెట్‌లో పెడతానని బెదిరించాడు. పలుమార్లు ఆమెను బెదిరించి అత్యాచారం చేశాడు. భరించలేక ఆమె రెండు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు.

ఓవైసీ బ్రదర్స్‌కు కిరణ్ మరో ఝలక్!

        కాంగ్రెస్ పార్టీతో పొత్తు వదులుకున్నాక ఎంఐఎం అదినేత అసదుద్దీన్ ఒవైసీ సోదరులకు షాక్ మీద షాక్ తగులుతున్నాయి. మిథాని వద్ద ఉన్న రెండున్నర ఎకరాల భూమికి సంబందించి గతంలో ఒవైసీ సోదరులకు ఇచ్చిన నో అబ్జక్షన్ సర్టిఫికెట్ ను కిరణ్ సర్కార్ రద్దు చేసింది. నిజానికి ఆ రెండున్నర ఎకరాల భూమిని ప్రభుత్వం ఒవైసీ ఆస్పత్రికి ఇవ్వాలనుకుంది. అప్పట్లో రాజకీయంగా మద్దతు ఇస్తుండటమే ఇందుకు కారణం. ఆ భూమిని ఇస్తానని నాటి ప్రభుత్వ పెద్ద హామీ ఇచ్చిన విషయాన్ని కూడా రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. కానీ, ఇప్పుడు రాజకీయ పరిణామాలు మారాయి. ప్రభుత్వానికి మజ్లిస్ మద్దతు ఉపసంహరించుకుంది. అనూహ్యంగా మిథానీ భూములపై స్టే ఉత్తర్వులను ఉపసంహరిస్తూ నాలుగు రోజుల కిందట రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వును అందుకున్న రెవెన్యూ అధికారులు వెంటనే అక్కడ 'ఇది ప్రభుత్వ భూమి' అనే బోర్డు ఏర్పాటు చేశారు. రాజకీయం మారితే భూములు కూడా అలా మారిపోతాయి!.  

దేశంలో ముందస్తు ఎన్నికలు

        దేశంలో ముందస్తు ఎన్నికల సంకేతాలు ఉన్నాయని బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడు అన్నారు. ఎఫ్‌డిఐలను ప్రోత్సహించడం వల్ల నిరుద్యోగ సమస్య పెరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యూపిఏ అసమర్థ విధానాల వల్ల ద్రవ్యలోటు శాతం పెరిగిందన్నారు. త్వరలో పార్లమెంటుకు ఎన్నికలు వస్తాయన్నారు. ప్రజలు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నా థర్డ్ ఫ్రంట్‌కు అవకాశం లేదన్నారు. ప్రజల ఒత్తిడితోనే పార్లమెంటుపై దాడికి సూత్రధారి అయిన అప్జల్ గురును ఉరి తీశారన్నారు. అత్యున్నత న్యాయస్థానం విచారించి, దేశద్రోహికి సరైన శిక్ష విధించారన్నారు. పార్లమెంటు సిబ్బందిని హతమార్చినప్పుడు నోరెత్తని, పెదవి విప్పని కొందరు తీవ్రవాదిని ఉరి తీస్తే ప్రజా సంఘాల పేరుతో నిరసనలు తెలుపడం విడ్డూరమన్నారు.

డైరెక్టర్ మణిరత్నం ఇంటిని ముట్టడించిన బయ్యర్లు

        మణిరత్నం దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'కడల్‌' చిత్రం తమను నష్టాల పాల్జేసిందంటూ చిత్ర బయ్యర్లు ఆందోళనకు దిగారు. ఈ సినిమా తమిళ వెర్షన్ బయ్యర్లకు భారీ లాసులు మిగిల్చిందని వార్త. దీంతో చిత్రంతో తమకు కలిగిన నష్టాన్ని భర్తీ చేయాలంటూ బయ్యర్లు దర్శకుడు మణిరత్నం మీద పడ్డారు. ఈ సినిమాకు దర్శక, నిర్మాతగా వ్యవహరించిన మణి తమకు ఏదో ఒక దారి చూపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. చెన్నైలోని మణి ఇంటి ముందు వారు ఆందోళనకు దిగారు.  ఈ చిత్రం ఆశించిన విజయం సాధించలేకపోవడంతో తాము తీవ్రంగా నష్టపోయూమని బయ్యర్లు వాపోయారు. నష్టాన్ని భర్తీ చేయూలంటూ చెన్నై అడయార్‌లోని గ్రీన్‌వేస్ రోడ్డులో ఉన్న మణిరత్నం ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. వారిని అదుపు చేయడానికి మణిరత్నం ఇంటికి పోలీసులు భద్రత కల్పించారు.

వరవరరావు వితండ వాదన

  మేధావులుగా ముద్రలేసుకొని తిరుతున్న అనేక మందిలో విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు కూడా ఒకరు. కానయితే, ఆయనకీ ఆముద్ర జనం వేసారు గనుక ఎవరికీ అభ్యంతరం ఉండదు. పోలీసు ఎన్ కౌంటర్లో నక్సలైట్లు చనిపోతే అక్కడ తక్షణమే ప్రత్యక్షమయి మానవ హక్కుల ఉల్లంఘన గురించి మాట్లాడే ఆయన, నక్సలైట్ల చేతిలో పోలీసులు, అమాయక గిరిజనులు, సామాన్య పౌరులు చనిపోతే మాత్రం ఆయన అటుపక్కకి రారు, ఆయనకీ ఏ మానవ హక్కులు అప్పుడు గుర్తుకు రావు.   మళ్ళీ ఈ మిస్టర్ మేధావిగారు పార్లమెంటు మీద దాడికి తెగబడిన అఫ్జల్ గురుని ఈరోజు ఉరితీసినందుకు నిరసన తెలియజేస్తూ వీదులకెక్కినప్పుడు మాత్రం జనం పకపకమని నవ్వుకొన్నారు. అఫ్జల్ గురును ఉరి తీయడాన్ని ఖండిస్తూ ఆయన ఒక సభలో మాట్లాడుతూ “గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి వందలమందిని మతకలహాలలో మట్టుబెట్టినప్పుడు, ప్రజలు ఆయనను మెచ్చుకొని ఆయనకే ఓటు వేసారు. అంతేకాక, అటువంటి వ్యక్తినే దేశప్రధాని కావాలని ఇప్పుడు కోరుకొంటున్నారు. దేశ వ్యాప్తంగా పోలీసులు నక్సలయిట్లను బూటకపు ఎన్ కౌంటర్లలో హత్యలు చేస్తే వారికి మెడల్స్ ఇచ్చి మెచ్చుకొంటారు. గానీ, ఒక ఉద్యమకారుడయిన ముస్లిం వ్యక్తిని ఉరితీసేందుకు మాత్రం వెనుకాడరు. దీనిని అందరూ ఖండించాలి” అంటూ తన మేధసుని ఉపయోగించి బోడి గుండుకు మోకాలుకు ముడేసేప్రయత్నం చేసారు. ఒక దేశ ద్రోహికి మద్దతుగా ఆయన మాట్లాడుతూ, హైదరాబాదులో టాంక్ బ్యాండ్ వద్ద నిరసన కార్యక్రమం చెప్పట్టేసరికి పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి లోపలేసారు.   గుజరాత్ ముఖ్యమంత్రి మీద, పోలీసుల మీద ఆయనకీ అభ్యంతరాలున్నపుడు, ఈవిధంగా సభలు పెట్టి పనికి రాని ఉపన్యాసాలు ఇచ్చి ప్రజల మెదళ్ళుతినే బదులు కోర్టుకెళ్ళి కేసువేసి ఉంటే, ఆయనని ఎవరూ ఆపేవారు లేరు. అఫ్జల్ గురూకి ఉరిశిక్ష వేయకూడదనుకొంటే, దానికూడా కోర్టుకు వెళ్లి కేసువేసుకొని, తన మేధసుని ఉపయోగించి వాదించి విడిపించుకొని ఉండాల్సింది. గానీ, ఇటువంటి వ్యర్ధ ప్రసంగాలు చేసి మనదేశం సార్వభౌమత్వానికి చిహ్నమయిన పార్లమెంటు మీద దాడి చేసిన ఒక దేశద్రోహిని కమ్యునిస్టు భావాలుగల వరవరరావు సమర్దించడం చాలా అవివేకం.

బ్రదర్ అనిల్‌ చేసేవి దొంగ ప్రార్థనలే

        దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అల్లుడు అనిల్‌కు భక్తి లేదని, అన్ని దొంగ ప్రార్థనలే అని చంద్రబాబు ఆరోపించారు. అవినీతి సొమ్ముతో లోటస్‌పాండ్‌లో 70 గదుల ఇళ్లు కట్టారని, కుటుంబ సభ్యులు అంతా రెండు గదుల్లో ఉంటే, మిగిలిన రూముల్లో దయ్యాలు తిరుగుతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌కు చెందిన నేతలు జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. జలయజ్ఞానికి రూ.70 వేల కోట్లు ఖర్చు చేస్తే, రూ.30 వేల కోట్లు అవినీతి జరిగిందని కాగ్ తేల్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మంత్రి అనుచరులు తప్పుడు పత్రాలతో భూములను కబ్జా చేస్తున్నారని, కబ్జాదారులపై తిరగబడాలని, ప్రజలకు అండగా ఉంటామని బాబు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కిరణ్‌ ఉద్యోగాలు అమ్ముకుంటున్నారని, ఆయన తమ్ముళ్లు డబ్బులు వసూలు చేసుకున్నారని చంద్రబాబు నాయుడు విమర్శించారు. వివాదాస్పదమైన 26 జీవోల వ్యవహారంలో మరో 15 మంది మంత్రులు కూడా ఉన్నారని, వారిని సీఎం కాపాడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.  

తెలంగాణ రాష్ట్రం అవసరం లేదు

      మాకు ప్రత్యేక రాష్ట్రం అవసరం లేదు. సమైక్య రాష్ట్రమే మంచిది. విడిపోతే తెలంగాణ ఇబ్బందులలో పడుతుంది” అని తెలంగాణలోని వరంగల్ నుండి కొందరు విద్యార్లులు నాకు ఫోన్ చేశారు” అని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు సమైక్యాంద్ర జేఏసీ సమావేశంలో వెల్లడించారు. శ్రీకృష్ణ కమిటీ కార్యదర్శి దుగ్గల్ కూడా తెలంగాణ బాగా అభివృద్ది చెందిందని, తెలంగాణ రాష్ట్రం అవసరం లేదని ఆయన అన్నారు. తెలంగాణ ఎంపీలకు విద్యార్థులు వత్తిడి చేయడంతో కేంద్రం మీద వత్తిడి తెచ్చారని, సమైక్యాంధ్రకు మద్దతుగా ఎనబైమంది ప్రజా ప్రతినిధులం వెళ్లి తమ వాదన వినిపించామని అన్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో తెలంగాణ అస్సలు రాదని, రోశయ్య ప్రభుత్వం గొడవల మూలంగా ఐదువేల మంది చనిపోతారని చెప్పడంతో తెలంగాణకు అనుకూల నిర్ణయం కేంద్రం తీసుకుందని అన్నారు.సమైక్య రాష్ట్ర ఉద్యమానికి తాము మద్దతు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు.