Read more!

హిమాచల్‌ప్రదేశ్: విషాదాన్ని మిగిల్చిన విహారయాత్ర

 

వేసవి సెలవుల సందర్భంగా ఏర్పాటు చేసిన విహార యాత్ర విషాదాన్ని మిగిల్చింది. హైదరాబాద్ నగర శివార్లలోని బాచుపల్లిలోని విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ రెండో సంవత్సరం పూర్తి చేసుకున్న 48 మంది విద్యార్థులు ఈనెల 3న స్టడీటూర్‌కు వెళ్లారు. వారితో పాటు ముగ్గురు లెక్చరర్లు, ఒక లెక్చరర్ కుమారుడు కూడా ఉన్నారు. టూర్‌లో భాగంగా ఢిల్లీ, ఆగ్రా, ఉదంపూర్, సిమ్లాల్లో పర్యటించారు. అనంతరం ఆదివారం సాయంత్రం మండి జిల్లాలోని లార్జి హైడ్రోపవర్ ప్రాజెక్టు (తలోట్ గ్రామం) వద్దకు చేరుకున్నారు. డ్యామ్ గేట్ల సమీపంలోవిద్యార్థులు ఫొటో దిగుతున్న సమయంలో ఎలాంటి సమాచారం, హెచ్చరికలు లేకుండా ఒక్కసారిగా డ్యామ్ గేట్లను ఎత్తారు. దాంతో ఒక్కసారిగా పెరిగిన నది ప్రవాహంలో 24 మంది విద్యార్థులు కొట్టుకుపోయారు. సాయంత్రం 6.00-6.20 సమయంలో ప్రమాద ఘటన జరిగినట్టు తెలుస్తోంది. గల్లంతైన వారిలో 18 మంది విద్యార్థులు, ఆరుగురు విద్యార్థినులు ఉన్నట్లు తెలిసింది. విద్యార్థులతో పాటు వెళ్లిన లెక్చరర్లు ఆదిత్య కశ్యప్, కిరణ్, సుమబాల సురక్షితంగానే ఉన్నట్టు సమాచారం.