Read more!

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ కు హైకోర్టులో ఊరట

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసులో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ కు తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. గతంలో రవిప్రకాష్ సీఈవో హోదాలో మరో ఇద్దరు ఉద్యోగులతో కలిసి టీవీ9 మాతృసంస్థ అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ (ఏబీసీఎల్) నుంచి రూ.18 కోట్ల నిధులను అనుమతుల్లేకుండా విత్ డ్రా చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై ఏబీసీఎల్ ప్రతినిధులు రవిప్రకాష్ తదితరులపై ఫిర్యాదు చేయగా, గతేడాది కేసు నమోదైంది. 

ఈ కేసు ఆధారంగా ఈడీ రంగంలో దిగింది. ఈడీ వర్గాలు ఎన్ ఫోర్స్ మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) నమోదు చేయడంతో, తను మళ్లీ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని భావించిన రవిప్రకాష్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం కొన్ని షరతులతో బెయిల్ ఇచ్చింది. రూ.లక్ష చొప్పున రెండు ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. అంతేకాదు, ఈడీ అధికారులు ఎప్పుడు విచారణకు పిలిస్తే అప్పుడు హాజరు కావాలని స్పష్టం చేసింది. ఈడీ విచారణ కొనసాగించుకోవచ్చని హైకోర్టు తెలిపింది.