Read more!

మూఢ నమ్మకాలతో బలి దానాలు, హత్యలు!  దేశంలో పెరిగిపోతున్న తాంత్రిక ఘోరాలు 

మనదేశంలో మాయ మాటలు చెప్పే బాబాలు, తాంత్రికులకు  ఉన్న  క్రేజీ.. తమ పరిశోధనలతో కొత్త ఆవిష్కరణలు అందించే సైంటిస్టులకు ఉండదు. మ్యాజిక్ ను నమ్మే జనం లాజిక్ ను అస్సలు పట్టించుకోరు. మూఢనమ్మకాలతో పచ్చిగా ప్రవరిస్తూ కొందరు ప్రాణాలు తీసుకున్నారు. మరికొందరు తమ కుటుంబ సభ్యులనే చంపుకున్నారు. ఉన్మాదుల్లా మారి ఇతరులను కిరాతకంగా హతమార్చిన
వారున్నారు. బలి ఇస్తే మేలు జరుగుతుందనీ, తాంత్రిక శక్తులు ఉన్నాయనీ, చనిపోయి మళ్లీ బతుకుతామని నమ్మి...  మూఢనమ్మకాలు, క్షుద్రపూజలతో కుటుంబాలే కనుమరుగైన ఘటనలు ఉన్నాయి. మదనపల్లిలో క్షుద్ర పిచ్చితో  కన్నబిడ్డలను చంపుకున్న తల్లిదండ్రుల ఉదంతంలో  పిచ్చి పరాకాష్టగా చేరినట్లుగా ఉంది. 

దేశవ్యాప్తంగా ప్రస్తుతం మదనపల్లి ఘటన కలకలం రేపుతోంది. అయితే రెండేళ్ల క్రిందట ఢిల్లీలోనూ ఇలా జరిగింది. 2018లో ఢిల్లీలోని బురారీలో  ఓ కుటుంబంలోని మొత్తం 11 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబంలోని పది మందిని ఇంట్లో దూలానికి ఉరి వేసి, ఆ తర్వాత 77ఏళ్ల నారాయణ్ దేవీ ఓ గదిలో విషం తీసుకుని మరణించింది. మళ్లీ బతుకుతామని నమ్మే వీరంతా ఈ దారుణానికి పాల్పడ్డారని విచారణలో తేలింది. ఈ ఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం స్పష్టించింది. 

2015లో జూన్ నెలలో కలకత్తాలోనూ మూఢనమ్మకాలతో ఓ కుటుంబం బలి తీసుకుంది. రాబిన్సన్ వీధిలో పార్థో డే అనే వ్యక్తి తండ్రి మృతదేహాన్ని అందజేయడానికి పోలీసులు వెళ్లారు. ఆ ఇంట్లో పోలీసులకు అతడి సోదరి, ఓ కుక్క అస్తిపంజరాలు పోలీసులకు కనిపించాయి. చనిపోయిన తల్లి తిరిగి లేస్తుందన్న నమ్మకంతో కొన్ని నెలలుగా ఉపవాసం ఉండి ఆరు నెలల క్రితం ఆమె చనిపోయింది. శునకం కూడా మరణించింది. అయినా వాటితోనే పార్థో డే సహజీవనం చేశాడు. ఇంటిని పరిశీలించిన పోలీసులు అవాక్కయ్యారు. 

2018 సెప్టెంబర్ లో అహ్మదాబాద్ లో  ఓ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది. 45 ఏళ్ల వ్యక్తి తన భార్యకు, 16ఏళ్ల కూతురికి విషం ఇచ్చి చంపి, ఆ తర్వాత తాను కూడా ఉరేసుకుని చనిపోయాడు. ఇంట్లో దొరికిన లేఖలో మాజీ ప్రేయసి ఆత్మ తమను చనిపొమ్మని చెప్పిందని రాసి ఉంది. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో గతేడాది  దీపావళి  రోజున ఓ యువకుడు పక్కింట్లో ఉన్న ఏడేళ్ల బాలికను అపహరించి ఉరేసి చంపాడు. ఆ తర్వాత ఆమె కాలేయం, ఇతర శరీరభాగాలను కోసి తన బంధువులకు ఇచ్చి కూర వండుకుని తినమని చెప్పాడు. అలా చేస్తే పిల్లలు పుడతారని తాంత్రికులు చెప్పింది నమ్మి ఆ యువకుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. తన బంధువులు పిల్లలు లేకపోవడంతో బాధపడుతున్నారని ఆ యువకుడు ఇంతటి అమానుషానికి ఒడిగట్టాడుయ 
 
 2018లో హైదరాబాద్ లోనూ ఇలాంటి ఘటన జరిగింది. నింజు పౌర్ణమిరోజు ఓ బాలికను బలి ఇస్తే మంచి జరుగుతుందని మంత్రగాళ్లు చెప్పింది నమ్మి.. 2018వ సంవత్సరం జనవరి 31న హైదరాబాద్ లో ఓ నెలలు నిండని బాలికను క్షుద్రపూజలు చేసి చంపేశారు. హైదరాబాద్ లోని కేరుకొండ రాజశేఖర్, తన భార్య శ్రీలతతో కలిసి ఓ తాంత్రికుడు చెప్పింది నమ్మి, ఫుట్ పాత్ పై తల్లి ఒడిలో నిద్రపోతున్న బాలికను ఎత్తుకొచ్చి ఈ దారుణానికి ఒడిగట్టారు.