ఆరుగురిని హత్య చేసిన కేసులో ఒకనికి ఉరి.. విశాఖ జిల్లా కోర్టు సంచలన తీర్పు

ఆరుగురిని హత్య చేసిన కేసులో ఒకనికి ఉరి.. విశాఖ జిల్లా కోర్టు సంచలన తీర్పు

Publish Date:Jun 27, 2025

పెందుర్తి మండలం జుత్తాడలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని దారుణంగా హత్య చేసన కేసులో బమ్మడి అప్పలరాజు అనే వ్యక్తికి ఉరిశిక్ష విధిస్తూ విశాఖ  జిల్లా కోర్టు శుక్రవారం (జూన్ 27) తీర్పు వెలువరించింది.  ఏప్రిల్ 15, 2021న అప్పల రాజు పాత కక్షలతో బమ్మిరి రమణ అనే వ్యక్తి కుటుంబానికి చెదిన ఆరుగురిని దారుణంగా హత్య చేశారు. బమ్మిడి రమణ కుటుంబంతో అప్పల రాజు కుటుంబానికి ఆస్తి తగాదాలు ఉన్నాయి. వాటికి తోడు బమ్మిడి రమణ కుటుంబానికి చెందిన విజయ్ అనే వ్యక్తి అప్పలరాజు కుమార్తెపై 2018లో అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై అప్పట్లో కేసు కూడా నమోదైంది. అప్పటి నుంచీ రెండు కుటుంబాల మధ్యా వైరం తీవ్రమైంది. ఈ నేపథ్యంలోనే బమ్మిడి రమణ కుటుంబం విజయవాడకు మకాం మార్చింది. అయితే 2021లో స్థానిక ఎన్నికలలో ఓటు వేసేందుకు ఆ కుటుంబ సభ్యులు స్వగ్రామానికి వచ్చారు. దీంతో ఇదే అదునుగా భావించిన అప్పలరాజు బమ్మడి రమణ సహా ఆ కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు, ఇద్దరు పిల్లలను కత్తితో విచక్షణా రహితంగా పొడిచి హత్య చేశాడు. ఆ తరువాత స్థానిక పోలీసు స్టేషన్ లో లొంగిపోయాడు.   విశాఖపట్నం జిల్లా కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది.  ఈ కేసులో కోర్టు అప్పలరాజును దోషిగా నిర్ధారించి, ఉరిశిక్ష విధించింది.   
గాంధీలు జైలుకు వెడతారా?

గాంధీలు జైలుకు వెడతారా?

Publish Date:Apr 19, 2025

అవును. ఇప్పుడు ఈ ప్రశ్న రాజకీయ వర్గాల్లోనే కాదు, సామాన్య ప్రజల్లోనూ ప్రముఖంగా వినిపిస్తోంది. నేషనల్‌ హెరాల్డ్‌  మనీలాండరింగ్‌ కేసులో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన చార్జి షీట్ లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్, పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ,లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీలను ఎ1,ఎ2గా పేర్కొన్న నేపధ్యంలో  గాంధీలు జైలుకు  వెళతారా? అనే ప్రశ్న దేశంలో ప్రముఖగా వినిపిస్తోంది. మరో వంక ఈ కేసును తెర పైకి తెచ్చిన రాజ్యసభ మాజీ సభ్యుడు సుబ్రమణ్య స్వామి  ఆ ఇద్దరి అరెస్ట్ తప్పదని  పూటకో టీవీ చానల్ లో ప్రవచనం చెప్పినట్లు చెపుతున్నారు. సో..సహజంగానే సోనియా, రాహుల్ గాంధీలను ఈడీ అరెస్ట్  చేస్తుందా? అనే ప్రశ్న కాంగ్రెస్  వర్గాల్లోనే కాదు, సామాన్యులలోనూ  వినిపిస్తోందని అంటున్నారు. అయితే కావచ్చును కాంగ్రెస్  నాయకులు ఆరోపిస్తున్నట్లుగా, కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా ఇటు బీజేపీకి అటు మోదీ నాయకత్వానికి సవాలుగా దూసుకొస్తున్న రాహుల్ గాంధీ దూకుడును అడ్డుకునేందుకే మోదీ ఈడీని ఉసిగొల్పుతున్నది నిజం కావచ్చును. కానీ  కేసు చరిత్రను  చూస్తే అసలు ఏమీ లేకుండానే  పదేళ్లకు పైగా విచారణలో ఉన్న కేసులో ఈడీ ఏ ఆధారాలు లేకుండానే ఛార్జిషీట్‌ దాఖలు చేస్తుందా? అందులోనూ  సోనియా, రాహుల్ గాంధీ పై ఛార్జిషీట్‌ దాఖలు చేసే సాహసం చేస్తుందా? అనే  సందేహాలు కూడా గట్టిగానే వ్యక్తం అవుతున్నాయి. అదలా ఉంటే.. పరిపాలనా దక్షత, అభివృద్ధి లెక్కల విషయంలో ఎలా ఉన్నా..  రాజకీయ లెక్కలు వేయడంలో తప్పుచేయని మోదీ షా జోడీ  కాంగ్రెస్ అగ్ర నేతలు ఇద్దరినీ ఒకే సారి టార్గెట్  చేస్తారా?  ఆ తప్పు మోదీ షా జోడీ చేస్తుందా? అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.  నిజానికి  రాజకీయ నాయకుల అవినీతి బాగోతాలకు సంబందించిన కేసుల్లో చాలా చిక్కు ముళ్ళు ఉంటాయి. ముఖ్యంగా ఈ  ‘స్థాయి’ కేసుల్లో  చాలా పకడ్బందీగా, ఎక్కడా ఏ దర్యాప్తు సంస్థకూ దొరక్కుండా, పక్కా పథకం ప్రకారం పని కానిచ్చేస్తారని  అంటారు. కానీ  నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి చిక్కు ముళ్ళు పెద్దగా లేవు. అంతా  ఓపెన్ సీక్రెట్ , ఖుల్లం ఖుల్లా ..అందరికీ అర్థమయ్యేలా ఉందని  అంటున్నారు.  క్లుప్తంగా కేసు వివరాలోకి వెళితే,మూడు నాలుగు తరాల రాజకీయాలతో ముడిపడిన ఈకేసులో  గొప్పగా చిక్కు ముళ్ళు ఏమీలేవు. నెహ్రూ గాంధీల తొలి తరం నేత, స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ  1935 లో  మరో 5000 మంది వాటాదారులతో కలసి స్వాతంత్ర పోరాటంలో అక్షర ఆయుధంగా పనిచేస్తుందని అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)సంస్థను స్థాపించి, ‘నేషనల్ హెరాల్డ్’ అంగ్ల పత్రికను ప్రారంభించారు. ఆ తర్వాత దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి పండిత జవహరలాల్ నెహ్రూ ప్రభుత్వం నేషనల్ హెరాల్డ్  పత్రిక కోసం ఢిల్లీ, లక్నో సహా మరికొన్ని మహానగరాలలో విలువైన స్థలాలను చౌకగా ఇచ్చారు. ఇవి కాక ఏజేఎల్ కంపెనీకి 90 లక్షల దాకా 10 రూ.విలువ గల షేర్స్ ఉన్నాయి. అంటే 9 కోట్ల మూలధనం ఉంది. అంతే కాకుండా నెహ్రూజీ మానస పుత్రికగా ముద్ర వేసుకున్న పత్రికకు  కాంగ్రెస్ ప్రభుత్వాలు విరాళాల రూపంలో,  ప్రకటనల రూపంలో ఆర్థిక సహకారం అందిస్తూ వచ్చాయి. (పత్రిక మూత పడిన తర్వాత కూడా హిమాచల ప్రదేశ్  ప్రభుత్వం, ఈ మధ్యనే రూ. 2.50 కోట్ల  ప్రకటనలు ఇచ్చినట్లు  ఈడీ చార్జి సీట్లో ఉందిట.) అయినా, కంపెనీ 2008 నాటికి, రూ.90 కోట్ల మేర అప్పుల ఊబిలో కూరుకు పోయింది. నేషనల్ హెరాల్డ్ పత్రిక మూత పడింది. ఈ అప్పులు తీర్చడం కోసం  కాంగ్రెస్ పార్టీ నేషనల్ హెరాల్డ్ కి రూ.90 కోట్లు అప్పు ఇచ్చింది.  నేషనల్ హెరాల్డ్  స్టొరీలో ఇదే టర్నింగ్ పాయింట్.  ఎందుకంటే.. ఒక రాజకీయ పార్టీ అప్పులు, ఇచ్చి పుచ్చుకోవదాలను చట్టం అనుమతించదు. అదొకటి అయితే.. పత్రిక మూత పడినా, దేశంలో అనేక నగరాల్లో ఉన్న ఏజేఎల్’ ఆస్తుల విలువ పడిపోలేదు.పెరింగింది.ఇప్పడు ఆస్తుల విలువ రూ. 2000 వేల కోట్ల పైమాటే అంటున్నారు.ఇంకొదరైతే రూ.5000కోట్లు అంటున్నారు. వాస్తవానికి ఈ  ఆస్తులు 2010 వరకు నెహ్రూ కుటుంబ ఆస్తులు కాదు. స్వచ్చంద సంస్థకు చెందిన ఆస్తులు.  కానీ 2010లో  సోనియా గాంధీ, రాహుల్ గాంధీచెరో 38 శాతం వాటాతో, (మిగతా 22 శాతంకు  ఆ స్కార్ ఫెర్నాండేజ్, మోతీలాల్ వోరా  వాటాదారులు) యంగ్ ఇండియా కంపెనీ తెర మీదకు వచ్చింది. అక్కడితో, సీన్ మారిపోయింది. కొత్త కంపెనీ మూలధనం కేవలం రూ.5 లక్షలు మాత్రమే అయినా.. రూ.2000 వేల కోట్ల పైబడిన  ఏజేఎల్ ఆస్తులతో పాటుగా, కంపెనీకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్లు చెపుతున్న రూ.90 కోట్ల అప్పు ఆ నలుగురి మధ్య కుదిరిన ఒప్పందంతో, యంగ్ ఇండియాకు బదిలీ అయిపోయింది.  అక్కడితోనూ  కథ ముగియ లేదు. ఏజేఎల్  ఆస్తులు యంగ్ ఇండియాకు బదిలీ అయిపోయిన వెంటనే  కాంగ్రెస్ ఇచ్చిన రూ.90 కోట్ల అప్పు ను  కాంగ్రెస్ పార్టీ ఉదారంగా..  యంగ్ ఇండియా నుంచి జస్ట్ ఓ రూ.50 లక్షలు తీసుకుని మాఫీ చేసేసింది. మళ్ళీ  యంగ్ ఇండియా కు ఆ రూ. 50 లక్షలు ఎక్కడివంటే..  అది మళ్ళీ మరో భేతాళ కథ.  సో .. మొత్తంగా చూస్తే సామాన్యులకు కూడా అర్థమయ్యే విషయం ఏమంటే..  సోనియా,రాహుల్ గాంధీలలు ప్రధాన షేర్ హోల్డర్లుగా ఉన్న యంగ్ ఇండియా  జస్ట్ ఓ రూ.5 లక్షల పెట్టుబడితో  రూ.2000 కోట్ల పైబడిన ఏజేఎల్ ఆస్తులకు హక్కు దారు అయింది.  సో.. ఇప్పుడు ఇలా నాలుగు గోడల మధ్యా జరిగినట్లు చెపుతున్న  ఒప్పందాలలకు సంభందించి సాగుతున్న విచారణలో భాగంగానే ఈడీ, సోనియా, రాహుల్ గాంధీలను ఎ 1,  ఎ 2 గా పేర్కొంటూ  చార్జిషీట్ దాఖలు చేసింది.   నిజానికి,   2012- 2013లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఈ కేసు వెలుగు చూసింది. సీబీఐ విచారణ చేపట్టింది. ఆ సమయంలోనే  సోనియా, రాహుల్ గాంధీలకు న్యాయస్థానం ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఇప్పటివకు వరకూ కూడా గాంధీలు ఇద్దరూ బెయిల్ పైనే ఉన్నారు. అలాగే ఈడీ కూడా గతంలో ఆ ఇద్దరినీ విచారించింది. ఇప్పడు చార్జి షీట్ దాఖలు చేసింది. అయితే, ఈడీ చార్జి షీట్ దాఖలు చేసినంత మాత్రాన వెంటనే అరెస్ట్ చేస్తుందని కాదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్,  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  వెంటనే అరెస్ట్ కాలేదు. అసలు అరెస్ట్ అవసరమా..  కాదా అనేది ఈడీ కాదు.. కోర్టులు నిర్ణయిస్తాయి. సో.. ఇప్పటికి ప్పుడైతే  గాంధీలు అరెస్ట్ అయ్యే అవకాశాలు అంతగా లేవనే అంటున్నారు.  బట్.. చట్టం తన పనితాను చేసుకు పోతుంది .. చట్టానికి సహకరించడం పౌరుల ధర్మం. గాంధీలు అందుకు అతీతులు కాదు. వారికి మినహాయింపూ ఉండదు. 

సీబీఎన్.. ఐటీ ఇండియన్ ఆఫ్ ది మిలీనియం!

Publish Date:Apr 19, 2025

రేసులో పడిపోయిన ప్రతిసారీ నిలబడటమే కాదు..  పరుగెత్తి గెలవడమంటే ఆషామాషీ కాదు.. అది ఎప్పటికప్పుడు చేసి చూపిస్తున్నారు కాబట్టే చంద్రబాబుని అపర చాణక్యుడు అంటారు.  చంద్రబాబు ఏజ్ బార్ అయింది.. టీడీపీ పనైపోయంది.. రాష్ట్రంలో ఇక వైసీపీకి ఎదురే లేదని జగన్ టీం తెగ హడావుడి చేసింది. అయితే సెవెన్టీ ప్లస్ ఏజ్‌లో కూడా పొలిటికల్‌గా తాను యంగ్ టర్క్‌నని నిరుపించుకున్నారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. అత్యధిక సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసి చరిత్ర సృష్టించారు.  దాంతో పాటు ఎన్డీఏ కూటమిలో రెండో అతి పెద్ద పార్టీగా అవతరించి, కేంద్రంలో కూడా చక్రం తిప్పుతున్నారు. 76వ పడిలోకి అడుగుపెట్టిన ఆయన పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు.  ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభంజనం స‌ృష్టించింది. ఇక్కడ ఎన్డీఏ కూటమి అనడం కంటే. తెలుగుదేశం, జనసేనల బలమే వైసీపీని మట్టికరిపించిందనడం కరెక్ట్.ఎందుకంటే ఆ పార్టీల అండ లేకుంటే బీజేపీకి ఏపీలో ఉన్న ఉనికి నామమాత్రమే. విజనరీ లీడర్, అపరచాణక్యుడిగా బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్న సీబీఎన్ మండుటెండల్లో  ప్రచారం చేసిన తీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇతర పార్టీల నేతలు భానుడి ప్రతాపాన్ని  తట్టుకోలేక షార్ట్ బ్రేక్‌లు తీసుకున్నారు.  కాని ఆ సూర్యుడు ఈ చంద్రుడి స్పీడ్‌కి  బ్రేక్‌లు కాదు కదా కనీసం స్పీడ్ బ్రేకర్లు కూడా వేయలేకపోయాడు. సెవెన్టీ ఫోర్ ఇయర్స్ ఏజ్‌‌లో తొంభై సెగ్మెంట్లలో సీబీఎన్ ప్రచారం చేశారంటేనే ఆయన స్టామినా ఏంటో అర్థం అవుతుంది.  ఐటీ ఇండియన్ ఆఫ్ ద మిలీనియం.  బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్..  సౌత్ అసియన్ ఆఫ్ ద ఇయర్.. వరల్డ్ ఎకనమిక్స్ ఫోరం డ్రీమ్‌ క్యాబినెట్‌ మెంబర్.. ఇదీ విజనరీ లీడర్  చంద్రబాబుకి అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన గుర్తింపు. ఆ విజనే రాజధాని లేకుండా విడిపోయిన ఏపీలో జరిగిన మొదటి ఎన్నికల్లో జనం చంద్రబాబుకు పట్టం కట్టేలా చేసింది. అంతర్జాతీయంగా నారావారిని ఎందరు ఎన్నిరకాలుగా ఆకాశానికెత్తేసినా,  తెలుగోళ్లకు మాత్రం అభివృద్ది కాముకుడు, అపరచాణక్యుడే.  చంద్రబాబు పేరు చెప్తే హైదరాబాద్ హైటెక్‌ సిటీకి పునాది వేసిన సైబర్ టవర్సే గుర్తొస్తాయి. అలా ఉమ్మడి రాష్ట్ర రాజధానిలో తనదైన బ్రాండ్ వేసుకున్న సీబీఎన్. విభజిత ఆంధ్రప్రదేశ్ కు  కూడా హైదరాబాద్ స్థాయి రాజధానిని ఏర్పాటు చేస్తారనీ,  అభివ‌ృద్దిని పరుగులు పెట్టిస్తారనే 2014 ఎన్నికల్లో ప్రజలు ఆయనను నెత్తినపెట్టుకున్నారు.  అమరావతి రాజధానికి అంకురార్పణ చేసి .. రాజధాని నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్న టైంలో చంద్రబాబు స్పీడ్‌కి బ్రేకులు పడ్డాయి.  ఒక్క ఛాన్స్ అంటూ వైసీపీ అధ్యక్షుడు చేసుకున్న అభ్యర్ధన రాష్ట్ర స్థితిగతుల్ని మార్చేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనామకంగా, అగమ్యగోచరంగా తయారైంది. ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధ్యక్షుడు జగన్, 14 ఏళ్లు సీఎంగా ఉన్న సీబీఎన్  రాష్ట్రానికి ఏం చేశారని ప్రశ్నించి అభాసుపాలయ్యారు.  చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒక వైపు అమరావతి డెవలప్‌మెంట్, రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ పనులు పరుగులు పెట్టిస్తూనే,  పెట్టబడులు, పరిశ్రమల స్థాపనపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు.  ఇప్పుడు ఏపీ, తెలంగాణ రోడ్లపై పరుగులు పెడుతున్న కియా కార్లను చూస్తే తెలుగోళ్లకు చంద్రబాబునాయుడే కనిపిస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగిన సీబీఎన్ ను  రాష్ట్ర విభజన తర్వాత మరోసారి సీఎంని చేసింది ఆ హైటెక్ విజనే.   ఆయన అమరావతి రాజధాని అనగానే జగన్‌ సహా అందరూ ఆమోదించారు. అయితే..  2019 ఎన్నికల తర్వాత ఈక్వేషన్లు మారిపోయాయి.  రాజధాని ఏదో చెప్పుకోలేని స్థితిలో ఏపీ ప్రజలు మిగిలారు .బటన్ నొక్కుడు పాలిటిక్స్ మొదలు పెట్టిన జగన్.. సంక్షేమం డబ్బులు డైరెక్ట్ గా లబ్ధిదారుల ఖాతాల్లోకి ట్రాన్స్ ఫర్ చేస్తూ కొత్త ట్రెండ్ మొదలు పెట్టారు. 2024 ఎన్నికల్లో కూడా ఆ నవరత్నాలే తనను గెలిపిస్తాయన్న ధీమాతో కనిపించారు.  పైగా.. తెలుగుదేశం అధికారంలోకి వస్తే తన హయాంలోని పథకాలు అన్నీ ఆగిపోతాయని ప్రచారంలో చెప్పారు. 2014లో ఎన్డీఏ కూటమితో గెలిచిన చంద్రబాబు.  గత ఎన్నికల్లో ఆ కూటమికి దూరమై దెబ్బ తిన్నారు.  అయితే... రాష్ట్రం సంక్షేమం కోసం  జగన్  ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని మళ్లీ 2024 ఎన్నికలకు ముందు బీజేపీ, జనసేనలతో కలిశారు.  అయితే పేరుకి  ఎన్డీఏ కూటమి అయినా దానికి పెద్ద దిక్కు చంద్రబాబే అయ్యారు. ప్రచార  బాధ్యతను కూడా భుజ స్కంధాలపై వేసుకుని ముందుకు సాగారు. ఓవైపు ప్రభుత్వంలోని వైఫల్యాలను ఎండగడుతూనే... తాము అధికా రంలోకి వస్తే చేసే పనులను ప్రజలకు వివరించారు చంద్రబాబు.. ఎండలను సైతం లెక్కచేయకుండా ప్రచారం నిర్వహించారు.  నవరత్నాలని  వైసీపీ అంటే. సూపర్ సిక్స్, భవిష్యత్తుకు గ్యారెంటీ హామీలతో  చంద్రబాబు దూసుకుపోయారు.  జగన్ సర్కారు మద్యం పాలసీ, ఇసుక దందాలు, వైసీపీ నేతల అరాచకాలపై ఫైర్ అవుతూ ఎన్నికల ప్రచారంలో క్లైమాక్స్ పంచ్‌లు విసిరారు.  టీడీపీ అధినేత నవరత్నాల పేరుతో  జగన్ ప్రజలకు చాక్లెట్ ఇచ్చి.. నెక్లెస్‌లు తీసుకుంటున్నారంటూ ప్రజల్ని ఆలోచింపచే శారు చంద్రబాబు. ఎన్నికల ప్రచారాన్ని అన్నీ తానై నడిపించారు .  పని రాక్షసుడిగా టాగ్‌లైన్ తగిలించుకున్న హైటెక్ లీడర్ బర్త్ డేట్ 1950 ఏప్రిల్ 20.  14 ఏళ్లు సీఎంగా పనిచేసిన ఆయన వయసు ప్రస్తుతం 74 ఏళ్లు. మండు టెండల్లో జరిగిన ఈ ఎన్నికల్లో ఆయన 90 సెగ్మెంట్లలో ఎన్నికల ప్రచారం పూర్తి చేసారంటే.. మామూలు విషయం కాదని రాజకీయ నిపుణులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.  దటీజ్ చంద్రబాబు అంటూ కితాబులిచ్చారు. . ఆయనకంటే వయస్సులో చిన్నవారైన పవన్‌కళ్యాణ్, జగన్‌.. ఎండ ధాటికి తట్టుకోలేక షార్ట్ బ్రేక్‌లు తీసుకున్నారు. కానీ.. చంద్రబాబు మాత్రం నిత్య యవ్వనుడిలా అలుపెరుగని పోరాటం చేశారు.  ఒక్కసారి కూడా బ్రేక్‌ తీసుకోకుండా,  అటు పార్టీ నేతలతో పాటు ప్రజలూ ఆశ్చర్య పడేలా చేశారు. అంతే కాదు..  రోజుకి మూడు నుంచి ఐదు సభల్లో పాల్గొంటూ జనాలతో మమేకం అయ్యారు. ప్రతి అంశాన్నీ జనాలకు చెప్పటంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. మేనిఫెస్టోలో అంశాలతో పాటు జగన్ ప్రభుత్వ పనితీరుపై  తనదైనలో శైలిలో కౌంటర్లు ఇచ్చుకుంటూ వచ్చారు.  ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమి ఏర్పాటు చేయాల్సిన పరిస్థితులు, సీట్ల సర్ధుబాటు సహా అన్ని అంశాలనూ జనంలోకి తీసుకెళ్లగలిగారు.  ఓవరాల్‌గా ఈ అభివృద్ది కాముకుడు చేసిన పోరాటం ఫలించింది.  ఆయన ఊహించిన దానికంటే బెస్ట్ రిజల్ట్ లభించింది.151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీకి కనీసం అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయగలిగారు. అటు కేంద్రంలోనూ సోలో మెజార్టీకి దూరమైన బీజేపీకి దిక్కు అయ్యారు.  ఎన్డీఏ కూటమిలో రెండో పెద్దపార్టీగా అవతరించడంతో కేంద్రానికి అణిగిమణిగి ఉండాల్సిన ఉండాల్సిన అవసరం లేకుండా పోయింది టీడీపీకి. ఆ క్రమంలో చంద్రబాబుతో పాటు ఏపీ వాసులంతా కలలుగంటున్న నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది.  అందుకే అందరి నోటా ఎన్నికల ప్రచారం తర్వాత ఒకటే మాట వినిపించింది. అదే .. సీబీఎన్ ద గ్రేట్.

మనిషికి, డబ్బుకు మధ్య సంబంధం!

Publish Date:Jun 27, 2025

“మనం డబ్బును సంపాదిస్తాం కానీ, డబ్బు మనల్ని సంపాదించడం లేదు కదా?” అని డాంబికంగా పలికేవారున్నారు. అనడానికైతే ఇలా అన్నప్పటికీ వారి జీవితమంతా డబ్బుకు దాస్యం చేస్తూనే వుంటారు. ఆ డబ్బుకై ఎవరినైనా ఆశ్రయిస్తారు. ఎంతైనా వేడుకుంటారు. లేనితనం వల్ల వీరిలా తయారైనారా అంటే అది నిజం కాదు, కేవలం ధనం మీద ఆపేక్షే వీరినిస్థితికి తెచ్చింది. అసలీ జీవితాన్ని ధనార్జనకు కాక మరొకందుకు వినియోగించే వీలుందనే ఆలోచన కలగదు. మతాన్ని ఆశ్రయించామని, దైవారాధనకు అంకితమయామని ప్రకటించే వారిలో కూడా చాలా మందికి ధనమే దైవం వారు తలపెట్టే “మహత్కార్యా” లన్నిటికీ ధనం పోగుచేస్తుంటారు. ఎక్కడో వందలాది ఎకరాల స్థలం కొంటామంటారు. అక్కడ అనేకమందిని చేర్చి ఏదో విశ్వమానవ కల్యాణం సాధిస్తామంటారు. మిగతా రంగాల్లో పనిచేసేవారు కూడా ఇలాంటి "లోక కళ్యాణ” పథకాలే రూపొందిస్తుంటారు. సినిమాలు తీసేవారు, సినిమాహాళ్ళు కట్టించేవారు. హోటళ్ళు నెలకొల్పేవారూ, మార్కెట్లోకి కొత్తపత్రికలు వెలువరించేవారూ, మార్కెట్లోకి కొత్త సబ్బు, విశిష్టమైన సూటింగ్ క్లాత్, చల్లటి కూల్డ్రింకు ప్రవేశ పెట్టేవారూ, అందరూ కూడా ప్రజాక్షేమం కాంక్షించే ఈ పనులు చేస్తున్నామంటారు. కానీ అందరికీ కావలసింది డబ్బే. కానీ డబ్బు అక్కరలేనివారు అరుదుగా ఎక్కడైనా కనిపించవచ్చు. అలాంటివారు కోర్కెల్నీ, సంకల్పాలనూ దాటి వుంటారు. నీమ్ కరోలి బాబా అలాంటి యోగి. ఆయన ఇటు ఇహంలోను, అటు పరంలోనూ ఏక కాలమందు నివసించినట్లు ఉండేవాడని అంటారు స్వామీ రామా. బాబా ఎవరి పరిచయమూ కోరేవాడు కాదు. ఎవరైనా తన దర్శనార్థమై వస్తే, “నేను మిమ్మల్ని చూడడమైనది. మీరు నన్ను చూడడమైనది. ఇక వెళ్ళిరండి" అనేయడం ఆయనకు అలవాటు. నైనిటాల్లో ఒకసారి బాబాతో కూచోనుండగా, భారతదేశంలోని అత్యంత ధనికుల్లో ఒకరైన ఒక వ్యక్తి కరెన్సీ కట్టలతో బాబా వద్దకు వచ్చారని అంటాడు స్వామీ రామా. " ఈ ధనమంతా మీకు సమర్పించడానికి తెచ్చానండీ" అన్నాడు ఆ ధనికుడు.  బాబా ఆ నోట్లకట్టలను కిందపరిచి చక్కగా వాటి మీద ఆసీనుడయ్యాడు. "కూర్చుకునేందుకు అంత మెత్తగా లేవు. వీటికన్నా దిండు నయం. నాకు చలిమంట వేసుకునే అలవాటు లేదు, పోనీ అందుకైనా ఉపయోగిద్దామంటే వీటినేమి చేయను?" అని అడిగాడు బాబా. "అయ్యా ఇది ధనమండీ" అన్నాడు అతడు.  బాబా ఆ మొత్తం తిరిగి ఇచ్చేస్తూ "దీనితో కాసిని పళ్ళు కొనుక్కురండి. అందరం తినచ్చు" అన్నాడు. "ఈ ప్రాంతంలో మార్కెట్ లేదు గదండీ?” అన్నాడు అతడు. "ఐతే మరి ఇది డబ్బెలా అవుతుందయ్యా. పండ్లు కూడా కొనలేని దీనిని నేనేమి చేసుకోను" అని, కాసేపు ఆగి "ఏమి కావాలని నావద్దకొచ్చావు" అన్నారు.  "నాకు విపరీతమైన తలనొప్పి, భరించలేని బాధ" అని చెప్పాడు అతడు "అది నువ్వు సృష్టించుకున్నదే, నేనేమి చేయగలను." అన్నారు బాబా.  "అలా అంటే ఎలా మహాత్మా? మీరు నాకు సాయపడాలి.” అని వేడుకున్నాడు అతను. అప్పుడు బాబా, “పోనీ పాపం” అనుకున్నట్లున్నారు.. “సరే ఇకనుండి నీకు తలనొప్పి ఉండదు పో, కానీ ఇవాళ నుండి నీవు ఇతరులకు పెద్ద తలనొప్పిగా రూపొందుతావు. నీ దగ్గర వెర్రి డబ్బు పోగవుతుంది. తద్వారా నీవు సమాజానికి గొప్ప శిరోవేదన కలిగిస్తావు, ఇక వెళ్ళు" అని పంపించేశాడు నీమ్ కరోలి బాబా. ఆయన చెప్పినట్లే, ఆ ధనికుడు ఆరోగ్యవంతుడై, తన జీవన విధానంతో సంఘానికి గొప్ప “శిరోభారం" గా పరిణమించాడు.                                             ◆నిశ్శబ్ద.
[

Health

]

శరీరంలో ఈ 5 ప్రాంతాలలో నొప్పి అనిపిస్తే..  కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నట్టే..!

Publish Date:Jun 27, 2025

  అధిక కొలెస్ట్రాల్ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్య. ఇది అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తుంది. ఆరోగ్యకరమైన కణాలను నిర్మించడానికి కొలెస్ట్రాల్ చాలా అవసరం. కొలెస్ట్రాల్ అధిక మోతాదు గుండె జబ్బులు,  స్ట్రోక్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కొలెస్ట్రాల్ అంటే ఏమిటి? కొలెస్ట్రాల్ అనేది కాలేయం ద్వారా ఉత్పత్తి అయ్యే కొవ్వు పదార్థం, ఇది వివిధ శారీరక విధులకు అవసరం. ఇది కొన్ని ఆహారాలలో కూడా కనిపిస్తుంది. కొలెస్ట్రాల్ రెండు రకాలు: LDL (తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్) - దీనిని "చెడు" కొలెస్ట్రాల్ అని కూడా పిలుస్తారు, ఇది ఎక్కువగా ఉండటం వలన ధమనులలో ఫలకాలు ఏర్పడతాయి. HDL (అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్) - "మంచి" కొలెస్ట్రాల్ అని పిలుస్తారు. ఇది రక్తప్రవాహం నుండి అదనపు LDL ను తొలగించడానికి సహాయపడుతుంది. అనారోగ్యకరమైన జీవనశైలి అంటే సరైన ఆహారం లేకపోవడం, వ్యాయామం లేకపోవడం, ధూమపానం,  అధిక మద్యం సేవించడం వంటివి అధిక చెడు కొలెస్ట్రాల్ కు కారణం. పెద్దలు 20 సంవత్సరాల వయస్సు నుండి ప్రతి 4-6 సంవత్సరాలకు ఒకసారి  కొలెస్ట్రాల్‌ పరీక్ష చేయించుకోవాలని  వైద్యులు చెబుతున్నారు. అధిక కొలెస్ట్రాల్ కు కారణమేమిటి? అధిక కొలెస్ట్రాల్‌కు అనేక కారణాలు ఉన్నాయి.. సంతృప్త,  ట్రాన్స్ కొవ్వులు (ప్రాసెస్ చేసిన,  వేయించిన ఆహారాలు) అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం. శారీరక శ్రమ లేకపోవడం అధిక శరీర బరువు. ధూమపానం, మద్యం వినియోగం జన్యుశాస్త్రం (కొంతమందికి అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు వారసత్వంగా వస్తాయి) అధిక కొలెస్ట్రాల్ చరిత్ర ఉన్నవారికి, జీవనశైలి మార్పులు మాత్రమే దానిని నియంత్రించడానికి సరిపోకపోవచ్చు. అధిక కొలెస్ట్రాల్‌ను ఉంటే ఈ లక్షణాలు కనిపిస్తాయి. రక్తప్రవాహంలో కొలెస్ట్రాల్ పెరిగితే, అది రక్త ప్రసరణను పరిమితం చేస్తుంది.  శరీరంలోని వివిధ భాగాలను ప్రభావితం చేస్తుంది. ఇక్కడ కొన్ని సాధారణ  సంకేతాలు ఉన్నాయి. చర్మంపై పసుపు రంగు మచ్చలు.. అధిక కొలెస్ట్రాల్  మొట్టమొదటి కనిపించే సంకేతాలలో ఒకటి పసుపు రంగు కొవ్వు నిల్వలు లేదా చర్మంపై, ముఖ్యంగా కళ్ళు, మోచేతులు మరియు మోకాళ్ల చుట్టూ గడ్డలు. వీటిని జాంతోమాస్ అని పిలుస్తారు. రక్తంలో అదనపు కొలెస్ట్రాల్‌ను సూచిస్తుంది. చేతులు,  కాళ్ళలో జలదరింపు,  తిమ్మిరి.. ధమనులలో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు, రక్త ప్రసరణ మందగిస్తుంది, దీని వలన చేతులు,  కాళ్ళలో తిమ్మిరి, జలదరింపు లేదా సూదులు గుచ్చిన  అనుభూతి కలుగుతుంది. చికిత్స చేయకపోతే ఇది నరాలు దెబ్బతినడం వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. జీర్ణ సమస్యలు,  పిత్తాశయ రాళ్లు.. అధిక కొలెస్ట్రాల్ జీర్ణక్రియకు అంతరాయం కలిగిస్తుంది.  పిత్తాశయ సమస్యలకు దారితీస్తుంది. పిత్తంలో అధిక కొలెస్ట్రాల్ పిత్తాశయ రాళ్లకు కారణమవుతుంది. ఇది ఉదరం  కుడి ఎగువ భాగంలో నొప్పి, వికారం,  అజీర్ణానికి దారితీస్తుంది. ఛాతీ నొప్పి,  శ్వాస ఆడకపోవడం.. ధమనులలో కొలెస్ట్రాల్ పేరుకుపోయినప్పుడు అది గుండెకు రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది, దీని వలన ఛాతీ నొప్పి (ఆంజినా),  శ్వాస ఆడకపోవడం జరుగుతుంది. ఈ లక్షణాలను ఎప్పుడూ విస్మరించకూడదు, ఎందుకంటే అవి గుండె జబ్బుల ప్రారంభ సంకేతాలు కావచ్చు. తిమ్మిరి,  మాట్లాడటంలో ఇబ్బంది.. కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల మెదడుకు రక్త ప్రసరణకు ఆటంకం కలిగితే, అది స్ట్రోక్‌కు దారితీస్తుంది.  ఆకస్మిక తిమ్మిరి లేదా బలహీనత, మాట్లాడటంలో ఇబ్బంది,  సమతుల్యత కోల్పోవడం వంటివి దీని లక్షణాలే. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. అధిక కొలెస్ట్రాల్ తరచుగా సమస్యలు తలెత్తే వరకు స్పష్టమైన లక్షణాలను చూపించదు. కాబట్టి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం.                                       *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...