పులివెందుల పిల్లి పారిపోయింది..
posted on Apr 14, 2021 @ 3:16PM
‘‘సవాల్ చేసా. వెంకన్న సాక్షిగా ప్రమాణం చేసా. ఛాలెంజ్కి భయపడి పులివెందుల పిల్లి పారిపోయింది. ఈ రోజు బాబాయ్ మర్డర్ మిస్టరీ వీడిపోయింది. బాబాయ్ని వేసేసింది అబ్బాయే’’ అంటూ నారా లోకేశ్ ట్విట్టర్లో మండిపడ్డారు. #WhoKilledBabai అంటూ హ్యాష్ ట్యాగ్ జత చేశారు. ఆ వెంటనే అది ట్విట్టర్లో ట్రెండింగ్గా మారింది.
అలిపిరిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రమాణం చేశారు. వివేకా హత్యలో తనకుగానీ, తమ కుటుంబ సభ్యులకు గానీ ఎలాంటి పాత్ర లేదని.. వెంకన్న సాక్షిగా ప్రమాణం చేశారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి జగన్రెడ్డి బయటికి రాలేదన్నారు. చెల్లికి న్యాయం చేయలేనివాడు మహిళలకు ఏం న్యాయం చేస్తాడు? అని ప్రశ్నించారు లోకేశ్.
వైఎస్ వివేకా హత్యలో జగన్రెడ్డి పాత్ర ఉంది, అందుకే ఆయన రాలేదన్నారు. తమకు చిత్తశుద్ధి ఉంది కాబట్టే ఇక్కడికి వచ్చి ప్రమాణం చేశామన్నారు. కత్తులతో బతికే చరిత్ర ఏ కుటుంబానిదో ప్రజలకు తెలుసన్నారు. జగన్రెడ్డి సొంత కుటుంబ సభ్యుల్ని చంపాడని ఆరోపించారు.
అంతకుముందు.. అలిపిరి సర్కిల్లో ప్రమాణం చేసేందుకు సీఎం జగన్ కోసం గంటకుపైగా వేచి చూశారు నారా లోకేశ్. అ సమయంలో జగన్పై సంచనల వ్యాఖ్యలు చేశారు. ‘కత్తితో బతికేవాడు కత్తితోనే చస్తాడు.. జగన్ రెడ్డి గుర్తుపెట్టుకో’ అన్నారు లోకేశ్.
‘‘నారాసుర రక్తచరిత్ర అంటూ దొంగవార్తలు రాశారు. మా కుటుంబానికి రక్తచరిత్ర లేదు. నాకు, నా కుటుంబ సభ్యులకుగానీ ఎలాంటి పాత్ర లేదని ఆ వేంకటేశ్వర స్వామిపై ప్రమాణం చేస్తామని ఏప్రిల్ 7న సూళ్లూరుపేటలో సవాల్ చేశా. నేను అలిపిరిలో ఉన్నా.. తాడేపల్లి ప్యాలెస్ నుంచి సీఎం జగన్ రాగలరా.. వైసీపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే జగన్ను అలిపిరి తీసుకురావాలి. మా కుటుంబానికి వివేకా హత్య కేసుకు సంబందం లేదని ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నా.. 24 నెలలు గడిచినా సీబీఐ విచారణ ఎందుకు వద్దంటున్నారు. బాబాయిని హత్య చేసిన వారిని పట్టుకోవాలని జగన్కు లేదా?’’ అని ప్రశ్నించారు నారా లోకేశ్.
జగన్ పెద్ద దొంగ.. ఏ2 విజయ్ సాయిరెడ్డి చిన్న దొంగ. వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారని విజయసాయిరెడ్డి అన్నారు. మూడు గంటల తర్వాత పోలీసుల విచారణలో ఆయనను గడ్డపారతో చంపారని తేలింది. పోస్టుమార్టం జరగకముందే సాక్షాలు లేకుండా ఆరోజే చెరిపేశారు. ఆ సమయంలో గంగిరెడ్డి, వైఎస్ అవినాశ్ రెడ్డి తదితరులందరూ సీన్లో ఉన్నారు. మధ్యాహ్నం తర్వాత మాట మార్చారు. లోకేశ్కు, చంద్రబాబుకు హస్తం ఉందని ఆరోపించారు. తాతను, వివేకాను చంపింది మేమేనన్నారు. సీబీఐ ఎంక్వైరీకి డిమాండ్ చేశారు. గవర్నర్ను కలిసి కూడా ఇదే చెప్పారు. మరి సీఎం అయ్యాక సీబీఐ విచారణ ఎందుకు జరపడం లేదంటూ మండిపడ్డారు నారా లోకేశ్.