చైనాలో సైనిక తిరుగుబాటు.. జిన్ పింగ్ గృహ నిర్బంధం!
posted on Sep 25, 2022 9:00AM
చైనా అధ్యక్షుడు జిన్పింగ్పై తిరుగుబాటు జరిగింది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ జిన్ పింగ్ ను గృహ నిర్భందం చేసింది. ఇప్పుడు బీజింగ్ మోత్తం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అధీనంలో ఉందనీ, పెద్ద ఎత్తున దళాలు మోహరించి ఉన్నాయనీ, ఇతర దేశాల నుంచి వచ్చే, ఇతర దేశాలకు వెళ్లే విమానాలను పెద్ద ఎత్తున రద్దు చేశారన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. అయితే సైనిక తిరుగుబాటు, జిన్ పింగ్ నిర్బంధం వార్తలను చైనా మీడియా కవర్ చేయలేదు. అలాగే ఈ సంఘటనలకు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.
ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న చైనాలో సైనిక తిరుగుబాట జరిగిందన్న వార్తలు ప్రపంచాన్ని నివ్వెర పరుస్తున్నాయి. దురాక్రమణ కాంక్ష, వరుసగా మూడో సారి కూడా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలన్న అధ్యక్షుడు జిన్ పింగ్ నిర్ణయం కారణంగానే సైనిక తిరుగుబాటు జరిగినట్లు చెబుతున్నారు. ఆయన విదేశీ పర్యటనలో ఉన్న సమయంలోనే సైనిక తిరుగుబాటుకు అంకురార్పణ జరిగిందంటున్నారు. అధ్యక్షుడి భద్రతను చూసే అ సీజీబీ ఈ తిరుగుబాటుకు నేతృత్వం వహించిందని చెబుతున్నారు.
పదేళ్ల కిందట అంటే 2012లో జిన్పింగ్ అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ తన సొంత బలాన్ని పెంచుకునే దిశగా వేగంగా అడుగులు వేశారనీ, ఈ క్రమంలోనే అవినీతి ఆరోపణలపై పలువురు అధికారులు, రాజకీయ నేతలకు కఠిన శిక్షలు అమలు చేస్తున్నారు. అవినీతి, అధికార దుర్వినియోగం ఆరోపణలపై ఇద్దరు మాజీ మంత్రులకు, మరో మాజీ ఉన్నతాధికారికి మరణశిక్షలు కూడా విధించారు. అలాగే మరి కొందరికి యావజ్జీవ శిక్షలు విధించారు. ఈ కారణంగానే సైన్యంలో అసంతృప్తి పెచ్చరిల్లిందని అంటున్నారు. జిన్పింగ్పై సైనిక చర్యకు ఇది కూడా ఓ కారణమని చెబుతున్నారు.
అయితే చైనా రాజధాని బీజింగ్ చుట్టూ సైన్యం మోహరించినట్టు ఉన్న వీడియోలు మాత్రం బయటకు వచ్చాయి. 80 కిలోమీటర్ల పొడవైన సైనిక కాన్వాయ్ బీజింగ్ దిశగా వెళ్తున్నట్టు కూడా కొన్ని వీడియోలు వెలుగులోకి వచ్చాయి. అలాగే సామాజిక మాధ్యమంలో అధ్యక్షుడు జిన్పింగ్ను గృహ నిర్బంధంలో ఉంచిన సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకుందని, సైనికాధికారి లీ కియావోమింగ్ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు కూడా చేపట్టారనీ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
ప్రస్తుతం చైనా రాజధాని బీజింగ్ కు ప్రపంచ దేశాలతో సంబంధాలు తెగిపోయాయనీ, అంతర్జాతీయ విమానరాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయనీ చెబుతున్నారు. ఉజ్బెకిస్థాన్లో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సదస్సులో పాల్గొని తిరిగి స్వదేశానికి చేరుకున్న జిన్ పింగ్ ను విమానాశ్రయంలోనే సైనం నిర్బంధంలోకి తీసుకుందని చెబుతున్నారు.