జగోనామిక్స్.. జగన్ పాలనలో అర్థశాస్త్రం ఆగమాగం..
posted on Oct 18, 2021 @ 12:27PM
లంకా దినకర్. బీజేపీ నేత. స్వతహాగా చార్టెర్డ్ అకౌంటెంట్ కావడంతో ఆర్థిక వ్యవహారాల్లో మంచి పట్టుంది. అందుకే వైసీపీ పాలనపై ఆయన చేసే విమర్శలు సుత్తి లేకుండా సూటిగా తాకుతుంటాయి. తిమ్మిని బమ్మి చేస్తూ.. లెక్కల గారడీ చూపిస్తూ.. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తూ.. ఏపీ ఆర్థిక స్థితిని అథోగతి పాలు చేస్తున్న జగన్రెడ్డి పాలనను ఎప్పటికప్పుడు తనదైన స్టైల్లో తూట్లు పొడుస్తుంటారు. తాజాగా, లంక దినకర్ చేసిన కామెంట్లు మరింత ఆసక్తికరంగా మారాయి.
సీఎం జగన్మోహన్రెడ్డి పాలనలో అర్థశాస్త్రం నిర్ఘాంతపోతోందని, ఎకనామిక్స్ కాస్తా జగోనామిక్స్లా తయారైందంటూ బీజేపీ నేత లంకా దినకర్ విమర్శించారు. ఈ ఆర్థిక ఏడాది మొత్తానికి రూ. 5 వేల కోట్ల రెవెన్యూ లోటు అంచనా కాస్త మొదటి 5 నెలల కాలానికి 31,188 కోట్లు అయిందని లంకా దినకర్ అన్నారు. ఆదాయం పెరిగినా రెవెన్యూలోటు కొండంత అయ్యిందన్నారు. మూలధన వ్యయం మొదటి 5 నెలల కాలానికి గతేడాది రూ. 8,604 కోట్లు అయితే, ఈ ఏడాది అది కేవలం 5,482 కోట్లు మాత్రమేనన్నారు. ఆదాయం, అప్పులు పెరిగినప్పుడు.. భవిష్యత్తు ఆదాయం సముపార్జించే మూలధన వ్యయం పెరగాలి.. కానీ దూరదృష్టవశాత్తు పప్పు బెల్లల మయం అయ్యిందని లంకా దినకర్ మండిపడ్డారు.
గత 5 నెలల్లో అంతకుముందు ఏడాది ఇదే కాలానికి పోలిస్తే ఏపీలో ఆదాయం, అప్పులు రెండు పెరిగినా మూలధన వ్యయంలో పెరుగుదల మాత్రం ప్రతికూలమన్నారు. రూ. 15 వేల కోట్లకుపైగా అదనపు ఆదాయం ఆర్జించినా జీతాలు సకాలంలో ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. ఈ ఏడాది మొదటి 5 నెలల కాలంలో రూ. 15,686 కోట్ల అదనపు ఆదాయం వస్తే, అదే కాలానికి ఏడాది మొత్తం చేయాల్సిన అప్పులో 98 శాతం చేశారని లంక దినకర్ ఆరోపించారు.