Read more!

భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేస్తావా? కేసీఆర్ కు సంజయ్ సవాల్

గ్రేటర్ హైదరాబాద్ లో ఆగిన వరద సాయం పంపిణిపై రాజకీయ మంటలు రేగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వరద సాయం ఆగిపోవడానికి బీజేపీనే కారణమని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద సాయాన్ని ఆపాలని ఎన్నికల సంఘానికి తాను లేఖ రాయలేదని అన్నారు. తన సంతకాన్ని టీఆర్ఎస్ పార్టీ ఫోర్జరీ చేసిందని ఆరోపించారు. వరద సాయాన్ని బీజేపీ ఆపిందని చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయంలో ప్రమాణం చేస్తావా? అంటూ కేసీఆర్ కు సవాల్ విసిరారు బండి సంజయ్. 

 

వరద సాయం కోసం క్యూలో నిల్చున్న మహిళ చనిపోవడం ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యేనని బండి సంజయ్ అన్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలతో హైదరాబాదులో సమావేశం నిర్వహిస్తామంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సంజయ్ స్పందిస్తూ... గతంలో కేసీఆర్ చెప్పిన ఫెడరల్ ఫ్రంట్ ఏమైందో జనాలంతా చూశారని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం తొత్తులా మారిందని విమర్శించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాదులో ఎన్నికల సాయాన్ని నిలిపివేయాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో వరద బాధితులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు.