Read more!

క్షీణిస్తున్న బాల్ థాక్రే ఆరోగ్యం

 

శివసేన అధినేత బాల్ థాకరే ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదు. 86 సంవత్సరాల వయసున్న శివసేన సేనాని కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారు. శుక్రవారం ఆయన ఆరోగ్యం బాగా క్షీణించిందని చికిత్స చేస్తున్న వైద్యులు చెబుతున్నారు.

 

కిందటి నెల 24వ తేదీన లీలావతీ ఆసుపత్రిలోకూడా బాల్ థాక్రే చికిత్స చేయించుకున్నారు. ఇంటికెళ్లాక తిరిగి ఆయన ఆరోగ్యం క్షీణించడంతో మళ్లీ ఆసుపత్రికి తరలించారు. అప్పట్నుంచీ ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్న దాఖలాలు కనిపించనేలేదు.



మూడురోజులుగా ఆసుపత్రిలో ఉన్న బాల్ థాక్రే ఆరోగ్యం క్రమేపీ క్షీణిస్తోంది. ప్రజా జీవితంనుంచి తాను రిటైరవుతున్నానని, కొడుకు ఉద్ధవ్ థాక్రేకి, మనవడు ఆదిత్య థాక్రేకి మద్దతివ్వాలని కార్యకర్తల్ని కోరుతూ ఆయన ఇచ్చిన ఓ సందేశాన్ని రికార్డ్ చేసి ఉంచారు.

 

శివసేన వర్కింగ్ ప్రెసిడెంట్ ఉద్ధవ్ థాక్రే.. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఉన్నపళంగా పార్టీనేతలు సమావేశం కావడంపై ముంబైవాసుల్లో అనుమానం పెరుగుతోంది. బాబా గురించి ఎప్పుడు ఏ వార్త వినాల్సొస్తుందోనని ఆందోళన అభిమానుల్లో ఎక్కువైపోతోంది.