పరోపకారం... భగవంతుని చేరే మార్గం

 

భగవంతుడిని పొందడానికి ఎన్నో మార్గాలు వున్నాయి. వాటన్నిటిలో ‘సర్వభూత హితాభిలాష’ కూడా ఒకటి. ప్రతి ప్రాణిలోనూ భగవంతుడు కొలువై వుంటాడు. అందువల్ల సమస్త ప్రాణులకు హితాన్ని, సుఖాన్ని చేకూరుస్తూ వుంటే భగవంతుడిని సేవించినట్టే అవుతుంది.  ఎవరి హృదయం అయితే పరుల హితాన్ని కోరుకుంటూ వుంటుందో వారికి లోకంలో దుర్లభమైనది ఏదీ వుండదని భక్త తులసీదాసు కూడా చెప్పాడు. స్కాంద పురాణంలో ఒకచోట ఇలా పేర్కొనబడింది.

పరోపకరణం యేషాం జాగర్తి హృదయే సతామ్
నశ్యంతి విపదేస్తేషాం సంపదః స్యుః పదే పదే
తీర్థస్నానైర్న సా శుద్ధిర్బహుదానైర్న తత్ఫలమ్
తపోభిరుగ్రైస్తన్నాప్య ముపకృత్యా యదాప్యతే


ఏ సుజనుల హృదయంలో పరోపకార భావన జాగరూకమై వుంటుందో వారి ఆపదలన్నీ తొలగిపోతాయి. సంపదలెన్నో వారికి ప్రాప్తిస్తాయి. పరోపకారం వల్ల ప్రాప్తించే పవిత్రత అనేక పుణ్య తీర్థాలలో స్నానం ఆచరించినా ప్రాప్తించదు. అందువల్ల కలిగే పుణ్యఫలితం అధిక దానాలు చేసినా, తీవ్ర తపస్సు చేసినా కలుగదు.

నిష్కామ భావనతో పరోపకారం చేయడం కోసం పాటుపడేవారికి భగవత్ప్రాప్తి కూడా కలుగుతుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. కృష్ణ భగవానుడు భగవద్గీతలో ఇలా చెప్పారు...

లభంతో బ్రహ్మనిర్వాణమృషయః క్షీణకల్మషాః
ఛిన్నద్వైధా యతాత్మానః సర్వభూషితే రతాః


ఎవరి పాపములు నశించినవో, ఎవరి సకల సంశయాలు జ్ఞానం వల్ల తొలగిపోయినవో, ఎవరు ప్రాణుల హితమునందు ఆసక్తి వున్నవారై వుంటారో, ఎవరు మనస్సును జయించి నిశ్చలముగా పరమాత్మలో నిలిచి వుంటారో అట్టి బ్రహ్మవేత్తైన పురుషులు శాంత బ్రహ్మను పొందుతున్నారు.

పైన చెప్పిన లక్షణాలన్నీ కలిగి వుంది, పాప రహితులైన రుషులు సర్వభూత హితరతాన్ని కలిగి వుండటం వల్ల నిర్వాణ బ్రహ్మను పొందుతున్నారు. కాబట్టి మానవుడు సర్వ విధాలా స్వార్థాన్ని పరిత్యజించి, తన తనువును, మనసును, ధనమును ఇతరుల హితానికి అర్పించి దుఃఖంలో వున్నవారికి, అనాథలు, ఆపదలో వున్నవారికి సేవ చేయాలి. అభావంతో బాధపడుతున్న ప్రాణుల దుఃఖాన్ని నివారించి వారికి సర్వం వినియోగించాలి.  తమ జీవనము, తమ సర్వస్వము దీనులు, దుఃఖ గ్రస్తులు, అనాథలైన జనులను సేవించడం కోసమే వున్నదని ఎవరైతే భావిస్తారో వారు ధన్యజీవులు.

-శ్రీరామ్


More Purana Patralu - Mythological Stories