'మేజర్' వాళ్లమ్మ అడివి శేష్ను వాళ్లబ్బాయి లాగే ఉన్నావన్నారు!
on Nov 28, 2020
2008 నవంబర్ 26న జరిగిన ముంబై టెర్రిరిస్ట్ దాడిలో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అడివి శేష్ 'మేజర్' అనే చిత్రాన్ని చేస్తున్నాడు. శశికిరణ్ తిక్కా డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా జర్నీని ఐఏఎన్ఎస్ వార్తా సంస్థతో పంచుకున్నాడు శేష్. 2008లో టీవీ చానల్స్లో మేజర్ సందీప్ ఫొటోగ్రాఫ్ను తొలిసారి అతను చూశాడు. అతని కళ్లు, పెదాలపై నవ్వు శేష్ను కట్టిపడేశాయి.
"ఆయన ముఖాన్ని చూస్తే నా కుటుంబ సభ్యులలో ఒకరనిపించాడు. ఈ దేశం కోసం తన జీవితాన్నే అర్పించాడని తెలిశాక అతని ఐకానిక్ పాస్పోర్ట్ ఫొటోగ్రాఫ్ నుంచి చూపు తిప్పుకోలేకపోయాను" అని చెప్పాడు శేష్. సందీప్ ఉన్నికృష్ణన్ గురించిన పరిశోధనలో భాగంగా ఆయన తల్లిదండ్రులను కలుసుకున్నాడు శేష్.
"సందీప్ తండ్రి ఉన్నికృష్ణన్ను అంకుల్ అని పిలిచినప్పుడు తన కుమారుడి జీవితం గురించి పదేళ్ల నుంచీ ఒకరు రీసెర్చి చేస్తున్నారనీ, ఆయన జీవితం స్ఫూర్తితో ఓ కథ చెప్పాలనుకుంటున్నారనే విషయాన్ని ఆయన నమ్మలేదు. నన్ను కానీ, నా టీమ్ని కానీ వాళ్లు నమ్మకపోయినా మేం అంకుల్, ఆంటీలను కలుస్తూనే వచ్చాం. నాలుగో మీటింగ్లోనో, ఐదో మీటింగ్లోనో వాళ్లు నన్ను కొంచెం కొంచెంగా నమ్మడం మొదలుపెట్టారు. నా కళ్లలోని సిన్నియారిటీని గుర్తించిన అంకుల్ మా అబ్బాయి జీవితం గురించి 10 శాతం సినిమా తియ్యాలనుకుంటున్నావని నేను నమ్ముతున్నాను" అన్నారు అని చెప్పాడు శేష్.
వాళ్లతో మాట్లాడి, ఆ ఇద్దరికీ గుడ్బై చెప్పి లిఫ్ట్ దగ్గరకు వచ్చాక సందీప్ వాళ్లమ్మగారు దూరం నుంచి అతడిని చూస్తూ, "ఇలా రా" అని పిలిచారు. శేష్ ఆమె దగ్గరకు వెళ్లాడు. ఆమె అతడి కళ్లలోకి చూశారు. "దూరం నుంచి చూస్తుంటే నువ్వు అచ్చం మా అబ్బాయి లాగే ఉన్నావు" అని చెప్పారు. అలా చెప్తుంటే ఆమె కళ్లల్లో నీళ్లు చిప్పిల్లాయి. "ఆ క్షణం నాకు తెలిసింది. వాళ్లబ్బాయి జీవితం స్ఫూర్తిగా ఓ కథ చెప్పడానికి వాళ్ల పర్మిషన్ నాకు లభించింద"ని అని శేష్ తెలిపాడు.
'మేజర్' అనేది సందీప్ ఉన్నికృష్ణన్ ఎలా జీవించారనే సినిమాయే కానీ ఆయన ఎలా మృతి చెందారో చెప్పే సినిమా కాదు అని అతనంటాడు. సూపర్స్టార్ మహేశ్ ఓ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ మూవీ తెలుగు, హిందీ భాషల్లో ఏక కాలంలో వచ్చే ఏడాది విడుదల కానున్నది.
Also Read