నాగబాబును రోడ్డుమీద నిలబెట్టిన 'ఆరెంజ్' మూవీ ఇప్పుడొస్తే ఆడుతుందా?
on Nov 26, 2020
రామ్చరణ్, జెనీలియా డిసౌజా జంటగా నటించిన 'ఆరెంజ్' మూవీ సరిగ్గా పదేళ్ల కిందట, అంటే 2010 నవంబర్ 26న విడుదలైంది. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్గా మారి, ఆ చిత్ర నిర్మాత, రామ్చరణ్ బాబాయ్ నాగబాబును తీవ్ర ఆర్థిక కష్టాల్లోకి నెట్టి, రోడ్డు మీద నిలబెట్టింది. ఆ టైమ్లో తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని కూడా ఆ తర్వాత కాలంలో నాగబాబు వెల్లడించడం సంచలనం సృష్టించింది. అయితే అదే 'ఆరెంజ్' సినిమా ఇప్పుడు వచ్చినట్లయితే విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని కొంతమంది విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.
దీనికి కారణం.. అప్పటితో పోలిస్తే ఆడియెన్స్ మైండ్సెట్ ఇప్పుడు చాలావరకు మారడం. పదేళ్ల క్రితం తెలుగు ప్రేక్షకులు ఇంకా సంప్రదాయ చట్రం నుంచి బయటకు రాలేదనీ, ఇవాళ సోషల్ మీడియా ప్రభావం విస్తృతంగా వ్యాప్తి చెందడంతో వారి భావజాలంలోనూ చాలా మార్పులు వచ్చాయనేది విమర్శకుల మాట. ప్రేమ అనే అంశంపై ఒక డిఫరెంట్ అప్రోచ్తో భాస్కర్ తీసిన ఈ రొమాంటిక్ డ్రామా 'ఆరెంజ్'. దీన్ని లవ్ స్టోరీ అనడం కంటే స్టోరీ ఎబౌట్ లవ్ అనడం కరెక్ట్. రామ్చరణ్, జెనీలియా చేసిన హీరో హీరోయిన్ల పాత్రలే కాకుండా, సినిమాలోని కీలక పాత్రలన్నింటికీ ప్రేమ-పెళ్లిపై తమవైన భావజాలం, అభిప్రాయం, ధోరణి ఉండటం విశేషం.
2010 తర్వాత రొమాంటిక్ రిలేషన్షిప్స్ చాలా మార్పుకు గురయ్యాయి. మనుషులపై సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా పెరిగింది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ గురించి ప్రతి ఒక్కరికీ తెలిసింది. కెరీల్ గోల్స్ మారిపోయాయి. నైతిక విలువల గురించి భిన్నమైన ధోరణులు వ్యక్తమవుతున్నాయి. ప్రజల జీవన శైలులు మార్పుకు గురవుతున్నాయి.
ఈ సినిమాలో రామ్చరణ్ పోషించిన రామ్ క్యారెక్టరే హైలైట్. ప్రేమనేది శాశ్వతంగా ఒకరిపైనే ఉండదనీ, అలా ఉంటుందనే అభిప్రాయం ఒక మిత్ అనీ రామ్ నమ్ముతుంటాడు. అతనికి హిపోక్రసీ అనేది ఉండదు. ఏదైనా నిజాయితీగా చెబుతాడు. జీవితాన్ని ఎప్పుడూ ఎంజాయ్ చేయాలనే అతని ప్రపంచంలోకి జానకి (జెనీలియా) వచ్చాక ఎలా అతను తనతో తను సంఘర్షణకు లోనయ్యాడు, ప్రేమించడమంటే ఏమిటో ఎలా తెలుసుకున్నాడనే అంశాన్ని డైరెక్టర్ భాస్కర్ నిజాయితీగా ఈ సినిమాలో చిత్రించాడు. కానీ దాన్ని మన ఆడియెన్స్ యాంటీ సెంటిమెంట్గా భావించి సినిమాని తిరస్కరించారు. ఫలితంగా బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైంది 'ఆరెంజ్'.
Also Read