ప్రభాస్ బర్త్డేకి ఫ్యాన్స్ ఏం చెయ్యబోతున్నారు?
on Oct 16, 2020
దయ, ప్రేమ.. ప్రభాస్ బర్త్డేని సెలబ్రేట్ చేయడం ద్వారా అభిమానులు వ్యాప్తి చెయ్యాలనుకుంటున్న రెండు అంశాలు. తెర బయట అత్యంత నిరాడంబరంగా కనిపించే ప్రభాస్ స్నేహపూర్వక ప్రవర్తన అతని చుట్టూ ఉండేవాళ్లనూ, అతని ఫ్యాన్స్నూ ఎప్పుడూ విస్మయపరుస్తూనే ఉంటుంది. తెరమీదైతే, అతని సమ్మోహన శక్తి అద్వితీయం. ఆ విషయం 'బాహుబలి' రెండు భాగాల ద్వారా ప్రపంచానికి తెలిసింది. 'సాహో' మూవీలో అతని రూపం దక్షిణాదికి మించి ఉత్తరాది అభిమానులను మరింతగా ఆకట్టుకోవడం మనం చూశాం.
అక్టోబర్ 23న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్డే. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు పెద్ద ఎత్తున అతని పుట్టినరోజు జరపడానికి ఇప్పట్నుంచే సన్నాహాలు చేస్తున్నారు. కోలాహలంతో కాకుండా ప్రేమను పంచే కార్యక్రమాలతో తమ హీరోను సంతోషపెట్టడానికి వారు ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే టాలీవుడ్లో 'డార్లింగ్'గా ప్రభాస్కు ఉన్న మంచి పేరు. ఆ పేరుకు తగ్గట్లే అందరికీ స్నేహాన్ని పంచిపెట్టేందుకు ఫ్యాన్స్ ప్రయత్నిస్తున్నారు.
ప్రభాస్ బర్త్డేకి రెండు రోజుల ముందు నుంచే వారు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. అంటే అక్టోబర్ 21న మొక్కలు నాటే కార్యక్రమం పెద్ద ఎత్తున జరపడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రభాస్ హైదరాబాద్లో ఓ పెద్ద పార్క్ను దత్తత తీసుకుని, అందులోని మొక్కల పోషణ బాధ్యతను భుజాలకు ఎత్తుకున్న విషయం మనకు తెలుసు. దానికి అనుగుణంగా తాము కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఫ్యాన్స్ చేపడుతున్నారు.
22వ తేదీ ప్రభాస్ పేరిట దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు కూడా ఫ్యాన్స్ ప్లాన్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన తమ యంగ్ రెబల్స్టార్ భవిష్యత్తులో మరిన్ని శిఖరాలను అధిరోహించడంతో పాటు, అతను ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని కోరుకుంటూ వారు ఈ పూజలు చెయ్యనున్నారు.
ఇక అసలు తేదీ అయిన అక్టోబర్ 23న భారీ కేకులను కట్ చేసి, అనాథ శరణాలయాలకు వెళ్లి వారికి ప్రభాస్ పేరిట చిన్న చిన్న కానుకలు అందజేయాలని ఫ్యాన్స్ ప్లాన్ చేస్తున్నారు. వీటితో పాటు మరికొన్ని మంచి పనులు కూడా వారి దృష్టిలో ఉన్నాయి.
వృత్తిపరంగా చూస్తే, ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్లో 'రాధే శ్యామ్' షూటింగ్లో పాల్గొంటున్నాడు. ఇటలీలో ఈ షూటింగ్ జరుగుతోంది. దాని తర్వాత చేసే రెండు క్రేజీ ప్రాజెక్టులను ప్రభాస్ ప్రకటించాడు. ఒకటి ఓం రౌత్ డైరెక్ట్ చేసే డైరెక్ట్ బాలీవుడ్ ఫిల్మ్ 'ఆదిపురుష్' కాగా, మరొకటి వైజయంతీ మూవీస్ బ్యానర్పై నాగ్ అశ్విన్ రూపొందించే సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్.
Also Read