'ఆర్ఆర్ఆర్'లో... విజయశాంతి ఏమన్నారు?
on Sep 10, 2019
సుమారు పదమూడేళ్ల తర్వాత మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరూ'తో విజయశాంతి వెండితెరపైకి మళ్లీ వస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేశారు కూడా! అలాగే, 'బాహుబలి' తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న 'ఆర్ఆర్ఆర్'లోనూ ఆమె నటిస్తున్నారని వార్తలొచ్చాయి. కొమరం భీంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా మెగాపవర్ రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి ప్రధాన పాత్రలో నటిస్తున్నారనేది ఆ వార్తల సారాంశం. వీటిపై విజయశాంతి ఏమన్నారో తెలుసా? "అవేవీ నిజం కాదు. ప్రస్తుతానికి నేను అంగీకరించిన సినిమా 'సరిలేరు నీకెవ్వరూ' మాత్రమే. కథ నచ్చడంతో చేస్తున్నా. ఈ సినిమా తర్వాత ఎన్ని సినిమాలు చేస్తానో నాకు తెలియదు. ఒక్కటి మాత్రం క్లియర్... రాజకీయాలకు బ్రేక్ తీసుకునే ఆలోచన లేదు" అని విజయశాంతి అన్నారు. కొన్నేళ్ల క్రితం దర్శకుడు అనిల్ రావిపూడి ఓ సినిమాలో పాత్ర చేయమని విజయశాంతిని సంప్రదించారట. అప్పట్లో రాజకీయాల్లో బిజీగా ఉండటంతో నో చెప్పారు. ఎన్నికల తరవాత ఖాళీ సమయం దొరకడం, కథ నచ్చడంతో రీ ఎంట్రీకి 'సరిలేరు నీకెవ్వరూ' సరైన సినిమా అనుకుని ఓకే చెప్పారు.