ప్రయత్నమంతా... బూడిదలో పోసిన పన్నీరే! .. పాపం రవితేజ!
on Jul 18, 2017
తాను గొప్పవాడైనప్పుడూ... తనతో పాటు తన కుటుంబాన్నికూడా ప్రపంచానికి పరిచయం చేయాలనుకోవడం తప్పేం కాదు. సినిమా పరిశ్రమలో అయితే... ఈ తరహా ఎక్కువగా కనిపిస్తుంటుంది. మన హీరోలందరూ తమతో పాటు తమ భార్యాపిల్లల్ని కూడా మీడియా ద్వారానో ప్రజలకు పరిచయం చేస్తుంటారు.
అయితే... రవితేజ మాత్రం ఇలాంటి వ్యవహారాలకు మొదట్నుంచీ దూరం. ప్రతి చోటా తను కనిపిస్తాడు కానీ... తన కుటుంబ సభ్యులు మాత్రం కనిపించరు. ఒకవేళ కనిపించినా... అది అరుదుగానే. తన తమ్ముళ్లపై మీడియాలో ఆరోపణలు వినిపించిన సందర్భాల్లో కూడా రవితేజ అంటీ అంటనట్టుగానే ఉండేవాడు.
కానీ ఇప్పడు మాత్రం ప్రత్యక్షంగా తానే మీడియాకు ఓ న్యూస్ అయ్యాడు. డ్రగ్స్ కేసులోని నిందితులలో ఒకడిగా నిలిచి, రాష్ట్రంలోనే హాట్ టాపిక్ గా నిలిచాడు. పరిశ్రమలో ఈ స్థాయికి రావడానికి రవితేజ పడ్డ కష్టాన్ని తేలిగ్గా కొట్టేయలేం. గాడ్ ఫాదర్ లేకుండా స్వయంకృషితో ఈ స్థాయికి వచ్చాడు రవితేజ. అలాంటి రవికి ఇప్పుడు ఇలాంటి కష్టం రావడం బాధాకరమే అనాలి.
ఈ ఏడాది ద్వితీయార్థం రవితేజకు అంతగా బాగుండినట్టు లేదు. తమ్ముడు మరణం అతని జీవితంలోనే బాధాకరమైన సంఘటన అయితే... తమ్ముని అంత్యక్రియలకు హాజరు కాకుండా తన జీవితంలో తొలి కాంట్రవర్సీకి తెరలేపారు రవితేజ. ఈ విషయంపై సోషల్ మీడియా మొత్తం రవితేజను ఆడేసుకుంది.
సరే.. ఆ కార్యక్రమానికి హాజరు కాకపోవడానికి అతని కారణాలు అతనికి ఉండొచ్చు. అయితే... ఆ విషయమే... మీడియాకు ఆహారంగా మారింది. ఆ వ్యవహారం సమసిపోయిందిలే అనుకునే లోపు... ఇప్పుడు ఏకంగా డ్రగ్స్ కేసులోనే ఇరుక్కున్నాడు రవితేజ. దాంతో... ఇప్పటివరకూ తన పర్సనల్ లైఫ్ విషయంలో ఎంత జాగ్రత్త తీసుకున్నాడో... అదంతా బూడిదలో పోసిన పన్నీరైనట్టు అయ్యింది. మీడియాకు ఆమడదూరంలో ఉండే రవితేజ కుటుంబ సభ్యులు సైతం ఇప్పడు ఈ విషయంపై స్పందించడానికి మీడియాను ఆశ్రయించాల్సిన పరిస్థితి.
తాను ఎదిగినా... మొదట్నుంచీ మీడియాకు ఆమడ దూరంలో ఉండటం రవితేజకు అలవాటు. చివరకు సినిమా వేడుకలకు కూడా తాను హాజరు కావడం అరుదు. ఇక కుటుంబ సభ్యులైతే... ఇల్లు వదిలి బయటకు రావడమే కనిపించదు. అలాంటిది తొలిసారి.. రవితేజ తల్లి ఆదిలక్ష్మి ‘నా బిడ్డకు ఏ పాపం తెలీదు’ అంటూ అన్ని ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చేశారు.
పరిశ్రమలో ఈ స్థాయికి రావడానికి రవితేజ పడిన కష్టాన్ని పూర్తిగా చూసిన వ్యక్తిగా... ముఖ్యంగా తల్లిగా... ప్రస్తుత పరిణామం ఆమెకు నిజంగా శరాఘాతమే. ‘ఇప్పటికే ఓ బిడ్డను పోగొట్టుకున్నాను. ఇప్పడు మరో బిడ్డ మీద అభాండాలు వేయొద్దు’అంటూ మీడియా సాక్షిగా కన్నీరు మున్నీరు అయ్యారు ఆదిలక్ష్మి.
రవితేజ... క్రమశిక్షణ గల వ్యక్తి అనీ, తనకు హెల్త్ కాన్షియస్ ఎక్కువ అని, ఏది పడితే అది తాను తినడు, తమను కూడా తిననీయడనీ ఈ సందర్భంగా ఆదిలక్ష్మి గుర్తు చేసుకున్నారు. తన బిడ్డ భరత్ పోయినప్పుడు జరిగిన వ్యవహారం విషయంలోనే మీడియాతో మాట్లాడాలనుకున్నాననీ, అయితే... బిడ్డను పోగొట్టుకున్న అప్పటి తన పరిస్థతి చాలా దీనంగా ఉందనీ.. ఇప్పడు రవితేజ పై వినిపిస్తున్న ఈ వార్తల నేపథ్యంలో మీడియా ముందుకు రాక తప్పలేదని ఆదిలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే... రవితేజ తల్లిగారైన ఆదిలక్ష్మి... ఇలా పలు ఛానల్స్ లో రవితేజపై వస్తున్న అభియోగాలపై మాట్లాడటం ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇది రవితేజే చేయించాడా? లేక మీడియా వాళ్లే వెళ్లి ఆమెను కలిశారా? లేక తనంతట తానే మీడియా వారిని పిలిపించుకొని ఆదిలక్ష్మిఈ ఇంటర్వ్యూలు ఇచ్చారా? అనే ప్రశ్నలు ప్రతి చోటా వినిపిస్తున్నాయి.