ప్రభుత్వాన్నే బెదిరిస్తారా?
on Aug 7, 2017
చిత్ర పరిశ్రమలో ‘డ్రగ్స్’ రాజేసిన సెగలు ఇప్పుడిప్పుడే చల్లారేలా లేవు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ కు ఇటీవల చిత్ర పరిశ్రమ ఈ వ్యవహారంపై లేఖ రాసిన విషయం తెలిసిందే. దాన్ని తప్పు పడుతూ.. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోమవారం మరో లేఖను మీడియాకు విడుదల చేసి మళ్లీ అగ్గి రాజేశారు. అసలు మీకు ఆత్మాభిమానం లేదా? నేరం రుజువు కాకుండా అపాలజీ ఎలా చెబుతారంటూ.. పరిశ్రమ పెద్దల్ని దుయ్యబట్టారు.
ఇదిలావుంటే.. ముఖ్యమంత్రి కేసీయార్ కు తెలుగు చిత్ర పరిశ్రమ రాసిన లేఖపై కూడా రాజకీయ వర్గాల్లో పలు విమర్శలు తలెత్తుతున్నాయి. ఆ లేఖలో ‘ఈ వ్యవహారంలో కాస్త హుందాగా వ్యవహరించండి’అని పేర్కొన్న లైన్ మీద పలువురు రాజకీయ నాయకులు, ప్రభుత్వోద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
‘హుందాగా వ్యవహరించండి’అనే పదాన్ని లేఖలో ఏ ఉద్దేశ్యంతో పొందుపరిచారు? అంటే ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నారా? అని పలువురు ప్రభుత్వ ప్రముఖులు ప్రశ్నిస్తున్నారు. ‘తెగే దాకా లాగితే మా దారి మేం చూసుకోవల్సొస్తుంది’ అని చెప్పకనే చెప్పినట్టు ఆ లైన్ ఉందని.. ముందు చిత్ర పరిశ్రమ దానిపై వివరణ ఇవ్వాలని కొందరు టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. ఈ విషయంలో మంత్రులు తప్పు చేసినా వదిలేదని లేదని కేసీయార్ గతంలోనే స్పష్టం చేశారనీ, ఇది చిత్ర పరిశ్రమపై జరుగుతున్న దాడి ఏమాత్రం కాదనీ వారు అన్నారు.
అపాలజీ చెబుతూ లేఖ రాసినందుకు ఓ వైపు వర్మ చిత్ర పరిశ్రమను తప్పు పడుతుంటే... లేఖలో ‘హుందాగా వ్యవహరించండి’అంటూ ప్రభుత్వానికి సలహాలివ్వడం ఏంటని? చిత్ర పరిశ్రమపై తెలంగాణ ప్రభుత్వ పెద్లలు అంతెత్తు లేస్తున్నారు. మరి వీరికి పరిశ్రమ నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి.