దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్కు మాతృ వియోగం
on Apr 6, 2020
ప్రముఖ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ మాతృమూర్తి కృష్ణవేణి (94) సోమవారం మృతి చెందారు. ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. భరద్వాజ్ తండ్రి కృష్ణమూర్తి అలనాటి ప్రముఖ నిర్మాతల్లో ఒకరు. ఆయన రవీంద్ర ఆర్ట్స్ పతాకంపై లక్షాధికారి, జమీందారు, బంగారు గాజులు, ధర్మధాత, దత్త పుత్రుడు, డాక్టర్ బాబు వంటి అనేక మంచి చిత్రాలు నిర్మించారు. 2013లో ఆయన మృతి చెందారు.
కృష్ణమూర్తి, కృష్ణవేణి దంపతులకు ఇద్దరు కుమారులు. డైరెక్టర్ అయిన పెద్ద కుమారుడు లెనిన్ బాబు చాలా కాలం క్రితమే చనిపోయారు. చిన్న కుమారుడు భరద్వాజ్ నిర్మాతగా, దర్శకుడిగా అనేక విజయవంతమైన చిత్రాలు అందించారు. మొదటి నుంచి వీరిది వామపక్ష భావాలున్న కుటుంబం. భరద్వాజ్ మాట్లాడుతూ.. అనారోగ్యంతో తన తల్లి రెండు నెలలుగా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. తన మిత్రులు, శ్రేయోభిలాషులు చాలా మంది ఫోన్లు చేస్తున్నారని, కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నందున తనను పరామర్శించడానికి ఎవరూ ఇంటికి రావద్దని ఆయన కోరారు.
ఫోన్లో భరద్వాజ్ను పరామర్శించిన చిరంజీవి
కృష్ణవేణి మరణ వార్త తెలిసిన వెంటనే. మెగాస్టార్ చిరంజీవి ఫోన్లో భరద్వాజను పరామర్శించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని సంతాప సందేశాన్ని తెలియజేశారు. సినిమా ఒక మజిలీ.. సమ సమాజం నా అంతిమ లక్ష్యం అనే కృష్ణమూర్తి తెలుగు సినిమా పరిశ్రమకు ఇతోదిక సేవలందించారని గుర్తుచేసుకున్నారు చిరంజీవి.
Also Read