శ్రీదేవి, రేఖకు అక్కినేని నాగేశ్వరరావు అవార్డ్
on Nov 14, 2019
ప్రతిష్ఠాత్మక అక్కినేని నాగేశ్వరరావు అవార్డుకు ప్రఖ్యాత తారలు రేఖ, దివంగత శ్రీదేవి ఎంపికయ్యారు. ఈ విషయాన్ని గురువారం అన్నపూర్ణ ఏడెకరాల స్టూడియోస్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏఎన్నార్ నేషనల్ అవార్డ్ కమిటీ చైర్మన్ టి. సుబ్బరామిరెడ్డి ప్రకటించారు. నవంబర్ 17న అన్నపూర్ణ స్టూడియోస్లో జరిగే కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ అవార్డులు ప్రదానం చేయనున్నారు. 2018 సంవత్సరానికి శ్రీదేవికీ, 2019 సంవత్సరానికి రేఖకూ ఈ అవార్డులు అందజేస్తారు. శ్రీదేవి తరపున ఆమె భర్త బోనీ కపూర్, కుమార్తెలు జాన్వి, ఖుషి అవార్డును స్వీకరిస్తారని సుబ్బరామిరెడ్డి తెలిపారు. "ఈ అవార్డును ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన గొప్ప గొప్ప వ్యక్తులకు ఇస్తూ వస్తున్నాం. లతా మంగేష్కర్, దేవానంద్, వైజయంతీ మాల, హేమమాలిని, బాలచందర్, శ్యాం బెనెగల్, అమితాబ్ బచ్చన్, ఎస్.ఎస్. రాజమౌళి వంటి జాతీయ స్థాయిలో గొప్ప పేరు తెచ్చుకున్న వ్యక్తులకు ఇచ్చాం. శ్రీదేవికి ఈ అవార్డును అందజేయాలన్నది నాగేశ్వరరావుగారి కోరిక. తండ్రి తర్వాత ఏఎన్నార్ అవార్డును కొనసాగిస్తున్న నాగార్జునకు అభినందనలు" ఆయన చెప్పారు.
నాగార్జున మాట్లాడుతూ "నాన్నగారి పేరు ఉన్నంతవరకూ ఈ అవార్డును కొనసాగిస్తూనే ఉంటాం. నాన్న వెళ్లిపోయాక సుబ్బరామిరెడ్డిగారు మా కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నారు. అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా కార్యక్రమాన్ని కూడా ఈ అవార్డు వేడుకకు జోడిస్తూ వస్తున్నాం. ఈసారి ఆ కాలేజీ నుంచి 70 మంది విద్యార్థులకు రేఖగారి చేతుల మీదుగా డిగ్రీలను అందజేయనున్నాం. ఈ అవార్డుకు ఎంపిక చేశామని రేఖగారికి ఫోన్ చేసి చెప్పగానే నాన్నతో తనకు చాలా అనుబంధం ఉందని, కెరీర్ తొలినాళ్లలో ఆయన నుంచి ఎన్నో సలహాలు, సూచనలు తీసుకున్నానని ఆమె చెప్పారు. నాన్నగారు మొదలుపెట్టినప్పటి లాగే అవార్డు గ్రహీతలకు రూ. 5 లక్షలు నగదు బహుమానం కూడా ఇస్తాం" అని చెప్పారు.
Also Read