నిన్న బాలు, మొన్న సుశాంత్.. మృతుల చుట్టూ సంచలనాలు.. మనం ఎటుపోతున్నాం!
on Sep 30, 2020
సెప్టెంబర్ 25న భౌతిక ప్రపంచాన్ని వీడి దిగంతాలకు తరలిపోయారు గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఐదు దశాబ్దాలకు మించి రోజూ ఆయన పాటలు వింటూ, వాటి మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ వస్తున్న మనం, ఇక ఆయన మనమధ్య భౌతికంగా ఉండరనే నిజాన్ని నమ్మడానికి కష్టపడుతూ ఉన్నాం. ఇలాంటి సమయంలోనూ కొంతమంది అనసవర వదంతులు, వాదాలు లేవదీస్తూ బాలు కుటుంబానికి మరింత బాధను కలిగిస్తున్నారు. సెలబ్రిటీలు మృతి చెందినప్పుడు సంచలన వార్తలు, వివాదాలు రావడం కొత్తేమీ కాదు కానీ, ఇవాళ వాటిలో ఏమాత్రం సున్నితత్వం లేకపోవడం, మృతులకు గౌరవాన్ని ఇవ్వాలనే కనీస ఆలోచన చేయకపోవడం బాధాకరం.
బాలు మరణించారనే ప్రకటన వెలువడ్డాక హాస్పిటల్స్ బిల్లులను కుటుంబం సకాలంలో చెల్లించకపోవడం వల్లే, ఆయన పార్థివదేహాన్ని హాస్పిటల్ వాళ్లు వెంటనే ఇవ్వలేదనీ, అందుకే ఆయన మృతి వార్తను చాలా ఆలస్యంగా ప్రకటించారనీ కొన్ని మీడియా సంస్థలు ప్రచారంలోకి తెచ్చాయి. అంతే కాదు, తెలుగువాడైన బాలును కడసారి చూడ్డానికి టాలీవుడ్ పరిశ్రమ నుంచి ఒక్క సెలబ్రిటీ కూడా వెళ్లలేదని విమర్శిస్తూ దాన్ని సంచలనం చేయడానికి ప్రయత్నించాయి. కోలీవుడ్లోనూ బాలును హీరో విజయ్ సందర్శించుకుంటే, అజిత్ రాలేదనే విమర్శలను పుట్టించారు. వీటిపై బాలు తనయుడు చరణ్ స్పందించారు. పెద్దదిక్కును కోల్పోయిన బాధలో ఉన్న తమ కుటుంబానికి అలాంటి వదంతులు, విమర్శలు మరింత బాధను కలిగిస్తాయని, దయచేసి వాటిని ప్రచారం చేయొద్దని ఆయన అర్థించారు.
బాలు మృతి విషయంలోనే కాదు, సుశాంత్సింగ్ రాజ్పుత్ మృతి విషయంలోనూ ఒక వర్గం మీడియా అనుసరిస్తోన్న ధోరణి జుగుప్ప కలిగించక మానదు. మానవత్వం అనేది మచ్చుకైనా లేకుండా ఎన్ని రకాల వాదాలు, వివాదాలు పుట్టిస్తున్నారో చూస్తున్నాం. సోషల్ మీడియా దీనికి ఆజ్యం పోస్తోందనేది నిజం. అభిమానులను దృష్టిలో పెట్టుకొని సెలబ్రిటీలు తమ జీవితానికి సంబంధించిన పలు విషయాలను రెగ్యులర్గా సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా పంచుకుంటూ వస్తున్నారు. ఇదివరకు గుట్టుగా ఉండే అనేకానేక విషయాలు ఇప్పుడు బహిరంగమైపోతున్నాయి. దాంతో ఇంకా ఇంకా తెలుసుకోవాలని జనం ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలో వాళ్లు ఇన్సెన్సిటివ్గా మారిపోతున్నారు. కొన్ని సందర్భాల్లో వినకూడని, రాయకూడని భాషలో తిట్టుకుంటూ, విమర్శించుకుంటూ తాము మనుషులమని కూడా మర్చిపోయి ఎట్లా గొడవలు పడుతున్నారో చూస్తున్నాం.
మరణించినవారిని గౌరవించాలనేది మన సంస్కృతి మనకు చెప్పే నీతి. కానీ జరుగుతున్నదేమిటి? టీఆర్పీల కోసం పలు చానళ్లు వ్యక్తిత్వ హననానికి పాల్పడటానికి ఏమాత్రం వెనుదీయడం లేదు. సుశాంత్సింగ్ మృతి కేసును ఫాలో అవుతున్న వాళ్లకు ఆ కేసు విషయంలో ఆ చానళ్లు ఏం చేస్తున్నాయో తెలుస్తూనే ఉంది. అంతిమంగా వ్యాపారం కోసమే ఇదంతా చేస్తున్నప్పటికీ, ప్రజలకు అది ఎలాంటి సంకేతాలు ఇస్తోందనేదే ప్రశ్న.
టాలీవుడ్ సెలబ్రిటీలతో కానీ, అజిత్తో కానీ బాలు కుటుంబానికి ఎలాంటి సమస్యా లేదు. ఇంకా చెప్పాలంటే ఆ కుటుంబంతో వాళ్లు బాగానే ఉంటూ వస్తున్నారు. కానీ వాళ్లెందుకు బాలు అంతిమ సంస్కారానికి వెళ్లలేదనే ప్రశ్నను బాలు తనయుడికే వేయడం, ఆయన దానికి సమాధానం చెప్పుకోవాల్సి రావడం ఏమిటి? టాప్ సెలబ్రిటీల చుట్టూ ఉండే క్యూరియాసిటీని అర్థం చేసుకోగలం. కానీ దాంతో పాటు సున్నితత్వం, మర్యాద అనేవి కూడా ఉంటాయని మనం మర్చిపోతున్నాం. వార్తలను వార్తలుగా ఇస్తుంటే జనం పట్టించుకోరని, ప్రతి దానికీ సెన్సేషనలిజంను జోడించి ఇస్తూ పోతే.. ఇక వార్తకు అర్థం లేకుండా పోతుంది. ఈ విషయంపై అందరూ కాస్త ఆలోచిస్తే మంచిది...
Also Read