దీపికకు ఎంత ప్రమాదం తప్పింది
on Mar 16, 2017
నిజ జీవిత గాధలను వెండితెర కావ్యాలుగా మలుస్తూ సూపర్హిట్లు కొడతాడు బాలీవుడ్ విలక్షణ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ. ఇలాంటి ఎన్నో కథలను విజయవంతంగా తీర్చిదిద్దాడు ఆ ప్రయత్నంలో ఏనాడూ ఎలాంటి ఆటంకాలు ఎదుర్కోలేదు. కాని ప్రస్తుతం ఆయన ప్రయత్నానికి కొందరు అడ్డు తగులుతున్నారు. మధ్య యుగంలో రాజస్థాన్ ప్రాంతానికి చెందిన రాణి పద్మావతి జీవిత గాధతో పద్మావతి అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు భన్సాలీ. ఇందులో రాణి పద్మావతిగా దీపికా పదుకొనే, అల్లావుద్దీన్ ఖిల్జీగా రణ్వీర్ సింగ్, రాజా రావల్ రతన్ సింగ్గా షాహిద్ కపూర్ నటిస్తున్నారు.
దీనిలో భాగంగా జైపూర్లో షూటింగ్ జరుపుకుంటుండగా రాజ్పుత్ కర్నిసేన కార్యకర్తలు చిత్ర యూనిట్పై దాడికి దిగారు..పద్మావతి చరిత్రను వక్రీకరించారంటూ భన్సాలీతో పాటు మరికొందరిని చితకబాదారు. దీంతో ఆ షూటింగ్ అర్థాంతరంగా ముగించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు తాజాగా కొల్హాపూర్లోనూ ఇదే సీన్ రీపిట్ అయ్యింది. అర్థరాత్రి ఒంటిగంట సమయంలో కొంతమంది వ్యక్తులు దాడి చేసి సెట్ను తగులబెట్టారు. అయితే ఆ సమయంలో సెట్లో ఎవ్వరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కాని సెట్, ఇతర సామాగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. ఈ సంఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.