బ్యాంకు లోను కట్టడానికి.. 'బిగ్ బాస్' హౌస్లోకి!
on Sep 25, 2020
'బిగ్ బాస్' హౌస్లోకి 'ఎక్స్ట్రా జబర్దస్త్'లో టీమ్ లీడర్ అవినాష్ వెళ్లిన సంగతి తెలిసిందే. అతడికి 'స్టార్ మా' ఛానల్ మాంచి రెమ్యూనరేషన్ ఆఫర్ చేసిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. 'బిగ్ బాస్'లో పాల్గొంటే షో నుండి బయటకొచ్చిన తరవాత ఆరు నెలలు స్టార్ మా కాకుండా మరో ఛానల్లో ప్రోగ్రామ్ చేయకూడదని ఒక రూల్ ఉందట. దీనిబట్టి 'జబర్దస్త్'లో ఆరు నెలలు చేస్తే ఎంత డబ్బులు వస్తాయో.. అంతకంటే ఎక్కువ ఆఫర్ 'బిగ్ బాస్' నుండి అవినాష్కి వచ్చిందని అనుకోవాలి. అయినా... పేరు, గుర్తింపు తీసుకొచ్చిన 'జబర్దస్త్'ను వదులుకుని మరీ 'బిగ్ బాస్' హౌస్లోకి వెళ్ళడానికి కారణం బ్యాంకు లోను, ఈఎంఐలు అని సమాచారం.
'జబర్దస్త్' కామెడీ షోలో టీమ్ లీడర్లకు మంచి పేమెంట్లు ఉంటాయని అందులోని స్కిట్స్లో అప్పుడప్పుడూ సెటైర్లు పడుతుంటాయి. ఆ పేమెంట్ల మీద నమ్మకం పెట్టుకుని చాలామంది బ్యాంకు లోన్లు తీసుకుని కార్లు, ఇళ్లు కొనుక్కున్నారు. అయితే, అలా కొనుకున్న వాళ్ల ప్లానింగ్ మీద కరోనా వల్ల వచ్చిపడిన లాక్డౌన్ దెబ్బకొట్టింది. అవినాష్ కూడా లోను తీసుకుని ఒక ఫ్లాట్ కొనుకున్నాడు. లాక్డౌన్లో కొన్నాళ్లు 'జబర్దస్త్' ప్రోగ్రామ్ టెలికాస్ట్ కాలేదు. కరోనా వల్ల షూటింగ్ చేయలేదు. అప్పుడు అందులో పనిచేసే వాళ్లకు డబ్బులు రాలేదని టాక్. లోను, ఈఎంఐలు కట్టలేక అవినాష్ ఇబ్బందులు పడ్డాడని... 'బిగ్ బాస్' నుండి మంచి ఆఫర్ రావడంతో అటు వెళ్లాడని టాక్.