ఆర్జీవీలో స్పీడు తగ్గింది! థియేటర్లపై ధ్యాస మళ్లింది!!
on Dec 4, 2020
థియేటర్లకు కాలం చెల్లిపోయిందనీ, ఇక డిజిటల్ సినిమాదే ఫ్యూచర్ అనీ ఇదివరకు తన సినిమాలను ఏటీటీలో విడుదల చేసిన టైమ్లో మాట్లాడుతూ వచ్చిన రామ్గోపాల్ వర్మ ఎందుకో మళ్లీ థియేటర్లకు విలువనిస్తున్నట్లు కనిపిస్తోంది. కరోనా మహమ్మారిపై తాను నిర్మించిన 'కరోనా వైరస్' సినిమాను డిసెంబర్ 11న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు కొద్ది రోజుల క్రితం ఆయన ప్రకటించారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో 300 పైగా స్క్రీన్లలో ఆ సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఆ 300 థియేటర్లలో హైదరాబాద్లోని సంధ్య 70ఎంఎం, వైజాగ్లోని జగదాంబ 70ఎంఎం థియేటర్లు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు.
లాక్డౌన్ తర్వాత థియేటర్లలో రిలీజవుతున్న మొట్టమొదటి సినిమా 'కరోనా వైరస్' అని చెప్పుకొచ్చారు. అయితే ఈ సినిమాని తన ఆర్జీవీ థియేటర్ యాప్లో కానీ, మరో ఏటీటీలో కానీ విడుదల చేస్తున్నట్లు లేదు. లాక్డౌన్ విధించాక ఆయన స్పీడ్, ఆయన డైలాగ్స్ చూస్తే వారానికో సినిమాని తన ఆర్జీవీ థియేటర్లో రిలీజ్ చేసేట్లు అనిపించింది. కానీ ఈ ఎనిమిది నెలల కాలంలో ఆర్జీవీ వరల్డ్లో రిలీజయ్యింది కేవలం నాలుగంటే నాలుగు సినిమాలే.. క్లైమాక్స్, నేక్డ్ (నగ్నం), పవర్స్టార్, థ్రిల్లర్.
విపరీతమైన ప్రచారం చేసినా వీటిలో బాగా డబ్బులు వచ్చింది 'నేక్డ్' మూవీకి మాత్రమే. మిగతా వాటిని జనం పెద్దగా పట్టించుకోలేదు. 'మర్డర్', 'దిశ ఎన్కౌంటర్' సినిమాలు కోర్టు మెట్లెక్కాల్సి రావడంతో విడుదల ఆలస్యమైంది. ఏదేమైనా ఆర్జీవీలో మునుపటి స్పీడ్ తగ్గిందనీ, ఆయన ట్వీట్లు ఇదివరికటిలా నెటిజన్లను ఎట్రాక్ట్ చేయలేకపోతున్నాయనీ సినీ జనం భావిస్తున్నారు. అన్నట్లు 'కరోనా వైరస్'ను అగస్త్య మంజు డైరెక్షన్లో ఆర్జీవీ నిర్మించారు.