షూటింగులకు ప్రభుత్వ అనుమతి అవసరం లేదన్న ఆర్జీవీ
on May 28, 2020
షూటింగులు చేయడానికి తనకు ప్రభుత్వ అనుమతి అవసరం లేదని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. లాక్డౌన్లో అగస్త్య మంజు దర్శకత్వంలో ఆయన 'కరోనా వైరస్' సినిమా షూటింగ్ కంప్లీట్ చేశారు. ఆల్రెడీ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. లాక్డౌన్ ప్రారంభమైన వారం తర్వాత 'కరోనా వైరస్' షూటింగ్ స్టార్ట్ చేసి, లాక్డౌన్లో సినిమాను పూర్తి చేశామని వర్మ స్పష్టం చేశారు.
ఒకవైపు టాలీవుడ్ పెద్దలు ప్రభుత్వ అనుమతుల కోసం వేచి చూస్తున్నారు. మరోవైపు వర్మ ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశారు. ఆయనకు అనుమతి అవసరం లేదా? ఈ ప్రశ్న వర్మ ముందు ఉంచితే... "మాటలు చెప్పడం కంటే చేతల్లో చూపించడం మంచిదని నేను నమ్ముతా. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో సరికొత్త పద్దతులలో ఎలా పని చేయాలని ఆలోచించడం ముఖ్యం. అవసరమే అన్ని ఆవిష్కరణలకు మూలం అవుతుందని పాత సామెత చెప్పినట్టు అవసరాన్ని బట్టి పని చేయాలి. షూటింగులు చేయడానికి నాకు ప్రభుత్వ అనుమతి అవసరం లేదు. ఎందుకంటే... మేం గైడ్లైన్స్ స్ట్రిక్ట్గా ఫాలో అయ్యాం. అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం" అని పేర్కొన్నారు. ఓటీటీ కోసం ఒక సిరీస్ చేస్తున్నట్టు ఆయన తెలిపారు.