200 కుటుంబాలకు తిండి పెడుతున్న రకుల్ప్రీత్
on Apr 5, 2020
గుర్గావ్ (న్యూఢిల్లీ)లోని తన ఇంటి సమీపంలో ఉన్న మురికివాడలో నివసిస్తున్న 200 నుంచి 250 కుటుంబాలను ఆదుకోవాలని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నిర్ణయించుకుంది. వారికి ఇంట్లో వండిన ఆహార పదార్థాలను అందజేస్తూ రకుల్ కుటుంబం వారి ఆకలిని తీరుస్తోంది. ఆ రోజు (ఆదివారం) నుంచే వారికి రెండు పూట్లా భోజనం పంపడానికి ఏర్పాట్లు చేసింది.
ఈ విషయాన్ని రకుల్ తెలియజేస్తూ, "ఈ మురికివాడలో ప్రాథమిక అవసరాలు కూడా తీర్చుకోలేని నిరుపేదలు ఉన్నారని మా నాన్న తెలుసుకున్నారు. అలాంటి వాళ్లందరికీ మేం రెండు పూటలా భోజనం సమకూరుస్తున్నాం. లాక్డౌన్ పీరియడ్ ముగిసేదాకా ఈ పని చేయాలని మేం నిర్ణయించుకున్నాం. లాక్డౌన్ కాలం పెంచితే, దానికి అనుగుణంగా ఈ పనిని మేం కొనసాగిస్తాం. ఇప్పటికైతే, ఏప్రిల్ నెలాఖరు వరకు ఈ పని చేయడానికి కట్టుబడి ఉన్నాను. పరిస్థితిని బట్టి అప్పుడు చూస్తాం. మా సొసైటీలోని ఒక ప్రదేశంలో వండిన ఆహారాన్ని అక్కడకు పంపిస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఈ సంక్షోభ సమయంలో తమ వంతు కృషి చేయాలి" అని చెప్పింది.
ఈ కష్టకాలంలో పేదలను ఆదుకోవడానికీ, కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంలో ఆర్థిక సాయం చేయడానికీ మేల్ సెలబ్రిటీలే ముందుకు వస్తున్నారనీ, ఫిమేల్ సెలబ్రిటీలు రావట్లేదనీ విమర్శలు చెలరేగుతున్న సందర్భంలో ఒక్కొక్కరే హీరోయిన్లు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ప్రణీత, లావణ్యా త్రిపాఠి, నయనతార తమ దాతృత్వాన్ని ప్రదర్శించగా, తాజాగా రకుల్ప్రీత్ ఆ లిస్టులో చేరడం ముదావహం.