హైకోర్టు చేతిలో చివాట్లు తిన్న రజనీకాంత్!
on Oct 15, 2020
దక్షిణాది సూపర్స్టార్ రజనీకాంత్ మద్రాస్ హైకోర్టు చేతిలో చివాట్లు తిన్నారు. ఆయనకు చెందిన శ్రీ రాఘవేంద్ర కల్యాణ మండపం ఆస్తిపన్నుగా రూ. 6.5 లక్షలు చెల్లించమంటూ గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ తాఖీదు ఇచ్చింది. దీనిని ఆయన మద్రాస్ హైకోర్టులో సవాలు చేశారు. శ్రీ రాఘవేంద్ర కల్యాణ మండపం తమిళనాడులోని కోడంబాకంలో ఉంది. మార్చి 24 నుంచి కల్యాణ మండపం మూసివేసి ఉందనీ, అందువల్ల అప్పట్నుంచీ దాని వల్ల ఎలాంటి ఆదాయం చేకూరలేదని తన పిటిషన్లో రజనీ పేర్కొన్నారు. అందువల్ల పన్ను నుంచి మినహాయింపు ఇప్పించాల్సిందిగా ఆయన కోర్టును కోరారు. అర్ధ సంవత్సరం ప్రాతిపదికన చెన్నై కార్పొరేషన్ ఆయనకు ఆస్తిపన్ను నోటీసు పంపింది.
పన్నుకు వ్యతిరేకంగా రజనీకాంత్ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు వచ్చిన సందర్భంగా అనవసరంగా కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నారనీ, ఆయనపై చర్యలు ఎందుకు తీసుకోరాదని హైకోర్టు హెచ్చరించింది. దీంతో తన కేసును ఉపసంహరించుకోవడానికి రజనీ తరపు న్యాయవాది సమయం కావాలని అర్థించారు. కాగా దీనిని అనుభవం నేర్పిన పాఠంగా గురువారం రజనీ పేర్కొన్నారు. టాక్స్ మినహాయింపు కోసం కోర్టును కాకుండా గ్రేటర్ చెన్నై కార్పొరేషన్కు అప్పీల్ చేసుకొని ఉండాల్సిందని, ఈ విషయంలో పొరపాటు జరిగిందనీ ఆయన ట్వీట్ చేశారు.
వర్క్ విషయానికి వస్తే, శివ దర్శకత్వంలో 'అన్నాత్తే' సినిమా చేస్తున్నారు రజనీ. ఇందులో నయనతార, ఖుష్బూ, మీనా, కీర్తి సురేశ్, ప్రకాశ్రాజ్ తదితర భారీ తారాగణం నటిస్తున్నారు.
Also Read