'ఆ నలుగురు' తర్వాత రాజేంద్రప్రసాద్ టాప్ 9 క్యారెక్టర్స్!
on Jul 8, 2020
"ఎన్నో సినిమాల్లో నటిస్తున్నా కొన్ని సినిమాలకే ఉద్వేగం, ఏదో చెయ్యాలన్న ఉత్సాహం కలుగుతుంది. అటువంటి ఉత్సాహం కలిగిస్తున్న సినిమాలు వస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఎన్టీఆర్కి, ఎఎన్నార్కి వాళ్ల కెరీర్లో వయసుతో నిమిత్తం లేకుండా మంచి పాత్రలు దొరికాయి. అలా నాక్కూడా దొరుకుతున్నాయి" అంటారు నటకిరీటిగా అభిమానులు ఆప్యాయంగా పిలుచుకొనే రాజేంద్రప్రసాద్. ఆయన కెరీర్లో 'ఆ నలుగురు' మూవీ అత్యంత ప్రత్యేకం. అందుకే రాజేంద్రప్రసాద్ కెరీర్లో 'ఆ నలుగురు'కు ముందు, 'ఆ నలుగురు'కు తర్వాత అని విభజించి చెప్పుకోవచ్చు.
'ఆ నలుగురు' మూవీలో పత్రికా సంపాదకుడు రఘురామ్ పాత్రలో రాజేంద్రప్రసాద్ నట విశ్వరూపాన్ని కన్నులారా దర్శించిన దర్శకులు అప్పట్నుంచీ ఆయన కోసమేనన్నట్లు కొన్ని స్పెషల్ క్యారెక్టర్లు సృష్టిస్తూ వస్తున్నారు. ఆ పాత్రల్లో ఆయన తనను తాను కొత్తగా ఆవిష్కరించుకంటూ, మనకు ఎప్పటికప్పుడు సరికొత్త రాజేంద్రప్రసాద్కు అందిస్తూ అలరిస్తున్నారు. అలాంటి పాత్రలవైపు చూపు సారిస్తే...
1. రాజాజీ (మీ శ్రేయోభిలాషి)
భార్యనీ, కూతుర్నీ కోల్పోయి ఆత్మహత్య చేసుకోవాలనుకొనే రాజాజీ అనే వృద్ధునిగా రాజేంద్రప్రసాద్ అభినయం హృదయాల్ని పిండేస్తుంది. 'ఆ నలుగురు' తర్వాత 'మీ శ్రేయోభిలాషి'లో మరోసారి ప్రేక్షకుల్ని అదే తరహా అభినయ సామర్థ్యంతో ఆయన ఆకట్టుకున్నారు.
2. నారాయణరావు మాస్టారు (ఓనమాలు)
క్రాంతిమాధవ్ డైరెక్ట్ చేసిన 'ఓనమాలు' చిత్రంలో ఓ గ్రామీణ స్కూలు మాస్టారు నారాయణరావు పాత్రలో రాజేంద్రప్రసాద్ జీవించారు. జీవితం మలి దశలో అమెరికా వెళ్లి కొంత కాలం తర్వాత తన గ్రామానికి తిరిగివచ్చిన ఆయన అక్కడి పరిస్థితులు వేగంగా మారిపోవడం చూసి, మానవ విలువలు మృగ్యమవడం చూసి, బాధపడి ఆ ఊరిని బాగుచేయడానికి పడే తపనను తన హావభావాలతో ఉన్నత స్థాయిలో ప్రదర్శించారు.
3. నారాయణరావు (శ్రీమంతుడు)
'ఓనమాలు' చిత్రంలోని నారాయణరావు మాస్టారు పాత్రకూ, 'శ్రీమంతుడు'లోని నారాయణరావు పాత్రకూ ఎలాంటి సంబంధంమూ లేదు. కరువుకాటకాలతో అల్లాడే దేవరకోట అనే ఓ మారుమూల గ్రామపెద్దగా రాజేంద్రప్రసాద్ గొప్పగా రాణించారు. ఆ ఊరిలోని భూముల్ని ఆక్రమించబోతున్న శశి అనే గూండాని ఎదిరించలేక మానసిన క్షోభను అనుభవించే పాత్రను తనదైన విలక్షణ శైలిలో పోషించారు.
4. కె.వి. చౌదరి (మహానటి)
మహానటి సావిత్రి బయోపిక్గా రూపొందిన ఈ సినిమాలో సావిత్రి పెదనాన్న కె.వి. చౌదరి పాత్రను సునాయాసంగా చేశారు రాజేంద్రప్రసాద్. చిన్నారి సావిత్రి చేసే అల్లరి తట్టుకుంటూ, ఆమె ఎదిగాక మొదట రంగస్థల నటిగా, తర్వాత సినీ తారగా ఆమెను మార్చడానికి తపనపడే కీలక పాత్రలో గొప్పగా రాణించారు.
5. ప్రసాద్ (ఎఫ్2)
'ఆ నలుగురు' తర్వాత కామెడీ క్యారెక్టర్లు కూడా సైమల్టేనియస్గా చేస్తూ వస్తున్న రాజేంద్రుడు చెలరేగిపోయిన పాత్ర ప్రసాద్. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన 'ఎఫ్2'లో వెంకటేశ్, వరుణ్తేజ్ హీరోలైనప్పటికీ, ఒకరికి తెలీకుండా ఒకరిని.. రెండు సంసారాల్ని మెయిన్టైన్ చేస్తూ వచ్చిన పాత్రలో హిలేరియస్గా ఆయన నవ్వించారు.
6. పసుపులేటి కనకరాజు/చంటి (ఓ బేబీ)
'ఓ బేబీ' సినిమా ఎవరిదంటే.. అందరూ చెప్పే పేరు సమంత కావచ్చు. కానీ బేబీ (లక్ష్మి/సమంత) స్నేహితుడు చంటి పాత్రను ఏ మాత్రమూ తక్కువ చెయ్యడానికి వీల్లేదు. బేబి యువతిగా మారిపోయాక ఆ క్యారెక్టర్ ఎలివేట్ కావడంలో ప్రధాన భూమిక వహించింది చంటి పాత్రే. ఒకవైపు సరదాగా, మరోవైపు ఎమోషనల్గా సాగే ఆ పాత్రలో ఆర్పీ నటనను చూసి తీరాల్సిందే.
7. కృష్ణమూరి (కౌసల్య కృష్ణమూర్తి)
క్రికెటర్ కావాలనుకున్న కూతురు కౌసల్య ఆరాటాన్ని అర్థం చేసుకొని, ఊళ్లో ఎవరేమన్నా లెక్కచెయ్యక ఆమె కలను నిజం చేయడానికి తపించే తండ్రి కృష్ణమూర్తిగా రాజేంద్రప్రసాద్ తనకే సాధ్యమైన అభినయాన్ని ప్రదర్శించారు. ఆ సినిమా ఆడకపోవడం వేరే సంగతి.
8. సోమరాజు (తోలుబొమ్మలాట)
సినిమాలో ఎక్కువసేపు ఆత్మరూపంలోనే కనిపించే సోమరాజు ఆస్తుల కోసం కొడుకు, అల్లుడు తగవులాడుకోటం, ప్రేమించుకున్న ఆ ఇద్దరి పిల్లలు విడిపోవడం చూసి, వాళ్లలో ఎలా మార్పు తీసుకొచ్చాడో, ప్రేమికుల్ని తిరిగి ఎలా కలిపాడో ప్రధానంగా కనిపించే 'తోలుబొమ్మలాట'లో.. ఆ పాత్రను ఆర్పీ మాత్రమే అలా చేయగలుగుతారనిపిస్తుంది.
9. శివప్రసాద్ (సరిలేరు నీకెవ్వరు)
దాదాపు హీరో మహేశ్కు సరిసమానమైన నిడివి (పాటలూ, ఫైట్లూ మినహాయిస్తే) ఉన్న శివప్రసాద్ క్యారెక్టర్లో మరోసారి ప్రేక్షకులకు నవ్వులు పంచారు రాజేంద్రప్రసాద్. మేజర్ అజయ్ (మహేశ్) వల్ల తరచూ ఫ్రస్ట్రేషన్కు గురవుతూ మనల్ని నవ్వించారు.
- బుద్ధి యజ్ఞమూర్తి