నిధి తుస్.. పూజ ప్లస్..!
on Oct 16, 2021
`అఖిల్`, `హలో`.. ఇలా తను కథానాయకుడిగా నటించిన తొలి రెండు సినిమాల్లోనూ డెబ్యూ హీరోయిన్స్ తోనే రొమాన్స్ చేశాడు అక్కినేని బుల్లోడు అఖిల్. సినీ నేపథ్యం ఉన్న సదరు కథానాయికలు (సాయేషా సైగల్, కళ్యాణి ప్రియదర్శన్).. అఖిల్ కి అంతగా అచ్చి రాలేదు. ఈ నేపథ్యంలో.. మూడో చిత్రం `మిస్టర్ మజ్ను` కోసం నిధి అగర్వాల్ తో జట్టుకట్టాడు. అప్పటికే అఖిల్ అన్న, యువ సామ్రాట్ నాగచైతన్యకి జంటగా `సవ్యసాచి`లో నటించిన నిధికి `మిస్టర్ మజ్ను` తెలుగునాట రెండో అవకాశం. అయితే, నిధి కాంబినేషన్ లో చేసిన సదరు రొమాంటిక్ డ్రామా అఖిల్ కోరుకున్న విజయాన్ని ఇవ్వలేకపోయింది.
కట్ చేస్తే.. తాజా చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్` కోసం మరోసారి చైతూతో రొమాన్స్ చేసిన భామతోనే జోడీ కట్టాడు అఖిల్. ఆ నాయికే.. `బుట్టబొమ్మ` పూజా హెగ్డే. `ఒక లైలా కోసం`తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పూజ సదరు చిత్రంలో చైతూ పక్కన సెట్ కాకపోయినా.. `MEB`లో మాత్రం అఖిల్ సరసన కనువిందు చేసింది. అంతేకాదు.. `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్`లో అఖిల్, పూజ కెమిస్ట్రీ సినిమాకి ప్రధాన ఆకర్షణ అవడమే కాకుండా.. బాక్సాఫీస్ పరంగానూ మెప్పిస్తోంది. మొత్తమ్మీద.. చైతూతో తొలుత జోడీకట్టి ఆపై అఖిల్ తో ఆడిపాడిన నాయికల్లో నిధి తుస్ అనిపిస్తే పూజ ప్లస్ అయిందన్నమాట!