పవన్ కల్యాణ్తో పూజా హెగ్డే
on Jan 16, 2020
అవును... పవన్ కల్యాణ్తో పూజా హెగ్డే నటించడం దాదాపుగా ఖాయమే. పవన్-పూజ కాంబినేషన్ గత కొన్ని రోజులుగా వార్తల్లోకి వస్తోంది. అయితే... అందరూ అనుకుంటున్నట్టు 'పింక్' రీమేక్ లో పూజా హెగ్డే నటించడం లేదు. పవన్ కల్యాణ్ హీరోగా 'కంచె', 'కృష్ణంవందే జగద్గురుమ్', 'గమ్యం' సినిమాల దర్శకుడు క్రిష్ తీయబోయే సినిమాలో ఆమె నటించనుంది.
'అల వైకుంఠపురములో' ప్రమోషన్స్ కోసం పూజా హెగ్డే హైదరాబాద్ వచ్చినప్పుడు ఆమెను కలిసిన క్రిష్ కథ వివరించారట. కథ, అందులో తన పాత్ర పూజకు బాగా నచ్చాయని సమాచారం. సినిమాలో నటించడానికి సూత్రప్రాయంగా ఆమె అంగీకరించిందట. పవన్ ఆల్ టైమ్ హిట్స్ లో ఒకటైన 'ఖుషి' నిర్మించిన ఏఎం రత్నం ఈ సినిమా నిర్మించనున్నారు. అతి త్వరలో షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
పవన్ కల్యాణ్ ఈ సినిమాలో రాబిన్ హుడ్ టైప్ క్యారెక్టర్ చేస్తున్నారట. మొఘుల్ సామ్రాజ్యం నేపథ్యంలో క్రిష్ కథను సిద్ధం చేశారని తెలిసింది. 'కొండవీటి దొంగ'లో చిరంజీవి పాత్ర స్ఫూర్తితో పవన్ పాత్రను క్రిష్ రాసుకున్నారట. ఈ సినిమా కాకుండా 'పింక్' రీమేక్ లోనూ పవన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.