నిఖిల్ పెళ్లి కూడా వాయిదా పడింది
on Apr 3, 2020
కరోనా ప్రభావం పెళ్లిళ్ల మీద కూడా పడుతోంది. ఇప్పటికే ఈ మహమ్మారి మరింత వ్యాప్తి చెందకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో ప్రజలు బయటకు రాలేని పరిస్థితి. ఈ కారణంగా ఏప్రిల్ 16న జరగాల్సిన తన పెళ్లిని యువ హీరో నితిన్ వాయిదా వేసుకున్నాడు. తాజాగా మరో హీరో నిఖిల్ కూడా పెళ్లిని వాయిదా వేస్తున్నట్లు తెలిపాడు. డాక్టర్ పల్లవి శర్మతో ఏప్రిల్ 16న ఏడు అడుగులు వేయడానికి అతడు సిద్ధమయ్యాడు. ఇప్పుడు ఆ తేదీకి పెళ్ళి జరగడం లేదు. లాక్ డౌన్ ముగిసిన తర్వాత కొత్త ముహూర్తం చూసుకోవాలని అనుకుంటున్నాడు.
మార్చి మూడో వారంలో, మనదేశంలో అప్పుడప్పుడే కరోనా కోరలు చాస్తున్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం పెళ్లిళ్లకు హాజరయ్యే అతిథుల సంఖ్యపై ఆంక్షలు విధించింది. తొలుత 200 మంది కంటే పెళ్లికి హాజరు కాకూడదని తెలిపింది. అప్పట్లో అతిథులు లేకున్నా గుడిలో పెళ్లి చేసుకుంటానని నిఖిల్ అన్నాడు. ఇప్పుడు మనసు మార్చుకున్నాడు. ఈ పెళ్లి వాయిదా వేయడానికి ముఖ్యకారణం నిఖిల్తో ఏడడుగులు వేయబోయే పల్లవి వర్మ. ఆమె డాక్టర్ కావడంతో పరిస్థితులపై పూర్తి అవగాహన ఉంది. ఆమె కోరడంతోనే నిఖిల్ పెళ్లిని వాయిదా వేశాడు. ఈ నెలాఖరున పురోహితులను కలిసే కొత్త ముహూర్తం ఖరారు చేయాలనుకుంటున్నారు.