ఫ్రీగా మార్నింగ్ షోలు... పాకెట్ మనీతో సినిమా తీశాడట
on Nov 20, 2019
‘శుక్రవారం ఉదయం మా సినిమాను ఫ్రీగా చూడండి. అన్ని థియేటర్లలో ఫస్ట్ డే మార్నింగ్ షో టికెట్లు ఫ్రీగా ఇవ్వబడును’ అంటూ ప్రేక్షకులను ఆకర్షించిన సినిమా ‘బీచ్ రోడ్ చేతన్’. స్ర్కీన్ప్లేను నమ్ముకుని తెరకెక్కించిన రియలిస్టిక్ రా యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ‘రోజులు మారాయి’, ‘ఫస్ట్ ర్యాంక్ రాజు’లో హీరోగా నటించిన చేతన్ మద్దినేని ఈ సినిమాకు హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్. మూడు సినిమాల్లో హీరోగా నటించిన అనుభవంతో ఆన్లైన్ డైరెక్షన్ ట్యుటోరియల్స్ చదివి ఈ సినిమాకు డైరెక్షన్ చేశానని అతడు తెలిపాడు. లో బడ్జెట్ సినిమా అయినా... ఎంతలో సినిమా తీశాననేది చెప్పలేదు కానీ, తొమ్మిది నెలల తన పాకెట్ మనీతో ఈ సినిమా తీశానని చేతన్ చెప్పుకొచ్చాడు. సినిమా చూశాక తన పాకెట్ మనీ ఎంత ఉంటుందో ఊహించుకోమన్నాడు.
ప్రేక్షకులకు మార్నింగ్ షో ఫ్రీగా చూపించాలనే ఐడియా తనదేనని చేతన్ మద్దినేని తెలిపాడు. చిన్న సినిమాలకు ప్రేక్షకుల్లో సరైన బజ్ రావడం లేదనీ, ఆడియన్స్లో అటెన్షన్ కోసమే మార్నింగ్ షో ఫ్రీగా చూపిస్తున్నానని ఈ హీరో చెప్పాడు. ఇంకా చేతన్ మద్దినేని మాట్లాడుతూ ‘‘నేను ఒక రోజు యూట్యూబ్లో ‘ఈ సినిమా సూపర్హిట్ గ్యారెంటీ’ అనే సినిమా చూశా. చాలా నవ్వుకున్నాను. ఆ డైరెక్టర్ నంబర్ తీసుకుని ఫోన్ చేసి మాట్లాడాను. ఎందుకు ఆడలేదని ఆడిగా. ప్రేక్షకుల్లో టాక్ రాలేదన్నాడు. ఒకవేళ అందరూ సినిమా చూసి మౌత్టాక్ స్ర్పెడ్ అయితే ఆ సినిమా హిట్ అయ్యేది. అందుకని, నా సినిమాకు మార్నింగ్ షోలు ఫ్రీగా వేస్తున్నా. వంద మంది సినిమా చూస్తే... అందులో 80 మందికి నచ్చుతుందనే నమ్మకం నాకుంది’’ అన్నాడు.
సింగిల్ స్ర్కీన్ థియేటర్స్లో కౌంటర్లో టికెట్స్ ఫ్రీగా ఇస్తారట. మల్టీప్లెక్స్లో మాత్రం ‘బీచ్ రోడ్ చేతన్’ ఏజెంట్స్ను పెడుతున్నామనీ, వాళ్లు టైటిల్ లోగో ఉన్న టీషర్టులు వేసుకుంటారనీ, టికెట్స్ ఫ్రీగా ఇస్తారని చేతన్ అన్నాడు. ఒకవేళ ఎవరైనా ఆన్లైన్లో మల్టీప్లెక్స్లో టికెట్స్ బుక్ చేసుకుంటే డబ్బులు వాపస్ ఇస్తామన్నాడు.
Also Read