నందినీరెడ్డి 'లస్ట్ స్టోరీస్' చెయ్యట్లేదా?
on Oct 12, 2019
హిందీలో 'లస్ట్ స్టోరీస్' వెబ్ సిరీస్ ఎంత పాపులర్ అయ్యిందో మనకు తెలుసు. నాలుగు భాగాలుగా వచ్చిన ఈ సిరీస్కు నలుగురు పేరుపొందిన డైరెక్టర్లు.. అనురాగ్ కశ్యప్, జోయా అఖ్తర్, కరణ్ జోహార్, దిబాకర్ బెనర్జీ డైరెక్ట్ చేశారు. రాధికా ఆప్టే, కియారా అద్వానీ, మనీషా కొయిరాలా, భూమి పెడ్నేకర్, విక్కీ కౌశల్ వంటి స్టార్లు అందులో నటించారు. ఈ సిరీస్ ఇప్పుడు తెలుగులో రాబోతోందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక ఎపిసోడ్లో అమలా పాల్, జగపతిబాబు నటిస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అంతేనా.. నాలుగు భాగాలకు నందినీరెడ్డి, సందీప్రెడ్డి వంగా, తరుణ్ భాస్కర్, సంకల్ప్రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారని కూడా వైరల్ అయ్యింది.
అయితే తెలుగు 'లస్ట్ స్టోరీస్'కు తను డైరెక్ట్ చేస్తున్నాననే ప్రచారాన్ని నందినీరెడ్డి ఖండించింది. తన సోషల్ మీడియా అకౌంట్లో.. "ఆల్రెడీ సబ్టైటిల్స్తో వచ్చిన 'లస్ట్ స్టోరీస్'ని నెట్ఫ్లిక్స్ మళ్లీ ఎందుకు రీమేక్ చెయ్యాలనుకుంటుంది? వై అమ్మా? ఏంటో ఈ వెరైటీ రూమర్స్" అంటూ వ్యంగ్యంగా పోస్ట్ చేసింది. అయితే ఆమె డైరెక్ట్ చేసిన 'జబర్దస్త్', 'ఓ బేబీ' మూవీస్ రెండూ రీమేక్లే. వాటిలో 'ఓ బేబీ' ఒరిజినల్ అయిన కొరియన్ మూవీ 'మిస్ గ్రానీ' ఇంగ్లీష్ సబ్టైటిల్స్తో విడుదలైన విషయం ప్రస్తావనార్హం. నందిని ఇలా రెస్పాండ్ అయినా, ఇప్పటికే ఈ సిరీస్ తెలుగు రీమేక్ షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోందనీ, అందులో అమలా పాల్ పాల్గొంటున్నదనీ ప్రచారం జరుగుతోంది. ఈ రెండు వెర్షన్స్లో ఏది నిజమో కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది.