బాబు బన్నీ... వాళ్లిద్దరూ ఎవరో చెప్పరాదే!
on Dec 18, 2018
సాయి పల్లవి అభిమానుల్లో ఓ పెద్ద స్టార్ హీరో ఉన్నారని 'పడి పడి లేచె మనసు' ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ చెప్పారు. సదరు స్టార్ హీరో ఎవరు? అనేది మాత్రం చెప్పలేదు. "సాయి పల్లవికి చాలామంది అభిమానులు ఉన్నారు. పబ్లిక్లోనే కాదు... ఆమెకు ఓ పెద్ద స్టార్ హీరో పెద్ద ఫ్యాన్. నన్ను అడగొద్దు.. అతను ఎవరో నేను చెప్పను" అని అల్లు అర్జున్ సెలవిచ్చారు. అందర్నీ సస్పెన్స్లో పడేశారు. అందువల్ల, ఆ స్టార్ హీరో ఎవరో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది. ప్రస్తుతం ప్రేక్షకులకు ఇదో పజిల్. అల్లు అర్జున్నీ, సాయి పల్లవినీ అభిమానించే ప్రేక్షకులకు శుభవార్త ఏంటంటే.. సాయి పల్లవికి అల్లు అర్జున్ కూడా ఫ్యాన్. ముఖ్యంగా 'ఫిదా' పోరి డ్యాన్సులకు. 'వచ్చిండే.. మెల్లగ వచ్చిండే' పాటను బన్నీ విపరీతంగా చూశాడట. సాయి పల్లవి కంటే తనే ఆ పాటను ఎక్కువసార్లు చూసి ఉంటానని స్టయిలిష్ స్టార్ చెప్పాడు. సాయి పల్లవితో సినిమా చేసే అవకాశం వస్తే.. సన్నివేశాల కంటే సాంగులో డ్యాన్స్ చేయాలని ఎక్కువ ఎదురు చూస్తున్నానని తన మనసులో మాటను అల్లు అర్జున్ బయట పెట్టాడు. బన్నీ అంత డైరెక్టుగా చెప్పాడు కనుక.. త్వరలో అతడి పక్కన కథానాయికగా నటించే అవకాశం సాయి పల్లవికి ఖాయం అనుకోవచ్చు.
సాయి పల్లవికి ఓ స్టార్ హీరో అభిమాని అని చెప్పిన అల్లు అర్జున్.. హీరో శర్వానంద్కి కామెడీ చేయడం రాదని ఓ పెద్ద దర్శకుడు తనతో అన్నాడని అల్లు అర్జున్ మరో పజిల్ ఇచ్చారు. 'పడి పడి లేచె మనసు' ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో శర్వానంద్ గురించి అల్లు అర్జున్ మాట్లాడుతూ "శర్వా అంటే నాకు ఇష్టం. తను మంచి నటుడు. బెస్ట్ పెర్ఫార్మర్. ఇదే మాట ఓ దర్శకుడితో అంటే 'శర్వా చేయడం రాదు' అన్నారు. ఇప్పటివరకూ శర్వా కామెడీ, ఎంటర్టైన్మెంట్ రోల్స్ చేయలేదు. వస్తే బాగా చేస్తాడు' అన్నాను. ఆ దర్శకుడు చేయలేదని అన్నారు. 'రన్ రాజా రన్' విడుదల తరవాత అతడికి ఫోన్ చేసి.. 'శర్వాకు కామెడీ చేయడం రాదని అన్నారుగా' అన్నాను. తనది తప్పని దర్శకుడు ఒప్పుకున్నారు. మేమంతా సినిమా నేపథ్యం నుంచి వచ్చాం. శర్వా తనకు తానుగా ఎదిగాడు. సెల్ఫ్ మేడ్ హీరో" అన్నారు. శర్వానంద్ని విపరీతంగా పొగిడారు అల్లు అర్జున్. హీరో శర్వానంద్ విషయంలో కూడా అల్లు అర్జున్. కానీ, ఆ దర్శకుడు పేరు మాత్రం చెప్పలేదు. శర్వాకి కామెడీ చేయడం రాదని ఎవరు అన్నారో మరి! అసలు విషయం చెప్పి.. సదరు విషయం ఎవరన్నారో చెప్పకపోతే ఎలా? వాళ్లు ఎవరో కనిపెట్టాలని మీడియాతో పాటు ప్రేక్షకులు ప్రిపేర్ అవుతున్నారు.