ఆ రికార్డు ఒక్క నాగచైతన్యకే సొంతం!
on Dec 4, 2019
అదృష్టం అంటే నాగచైతన్యదే అంటున్నారు సినీ జనం. ఎందుకంటే తండ్రితో, తాతతో, భార్యతో, మేనమామతో కలిసి సినిమాలు చేసే అవకాశం పొందిన హీరో అతను మాత్రమే మరి. అది కూడా పదేళ్ల కెరీర్లోనే ఈ చాన్సులు అతను సంపాదించేసుకున్నాడు. 2009లో 'జోష్' మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన చైతూ ఈ పదేళ్ల కెరీర్లో లేటిస్ట్ ఫిల్మ్ 'వెంకీమామ'తో కలిపి లీడ్ యాక్టర్గా 18 సినిమాలు చేశాడు. రెండో సినిమా 'ఏ మాయ చేశావే'తో తొలి సక్సెస్ను అందుకున్న చైతూకు తర్వాత కాలంలో '100% లవ్', 'తడాఖా', 'మనం', 'ప్రేమం', 'రారండోయ్ వేడుక చూద్దాం', 'మజిలీ' వంటి హిట్లు వచ్చాయి. ఇవన్నీ ఒకెత్తు అయితే మూడు సినిమాలు ఇంకో ఎత్తు అని చెప్పాలి. అవి.. 'మనం', 'మజిలీ', 'వెంకీమామ'.
2014లో విడుదలై ఘన విజయం సాధించిన 'మనం' సినిమాలో తాత అక్కినేని నాగేశ్వరరావు, తండ్రి నాగార్జున, కాబోయే భార్య సమంతతో కలిసి నటించాడు చైతూ. ఇలా ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల హీరోలు లీడ్ రోల్స్ పోషించిన సినిమాగా 'మనం' చరిత్ర పుటల్లో నిలిచింది. వరల్డ్ సినిమాలో ఇంకెక్కడైనా ఇలాంటి ఘటన ఉందేమో తెలీదు కానీ, భారతీయ సినిమాకు సంబంధించి ఈ తరహాలో తాత, తండ్రి, కొడుకు కలిసి నటించడం ఇదే ప్రథమం. ఇందులో తాత, తండ్రి నటనకు ఏమాత్రం తీసిపోని రీతిలో చైతూ అభినయం ప్రదర్శించాడనే పేరు తెచ్చుకున్నాడు. ఏఎన్నార్, నాగార్జున, చైతన్య కలిసి ఒకే ఫ్రేంలో కనిపించే సన్నివేశాల్లోనూ చైతూ ఎలాంటి తొట్రుపాటూ, అపరిపక్వతకు తావులేని రీతిలో హావభావాలు పలికించాడు, డైలాగ్స్ పండించాడు. సమంతతో అతని కెమిస్ట్రీ, ఆమెతో అతని రొమాన్స్ కూడా ప్రేక్షకుల్ని బాగా అలరించింది. విక్రం కె. కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా టాలీవుడ్లోని మరపురాని చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
రెండేళ్ల క్రితం సమంతను జీవిత భాగస్వామిగా చేసుకున్నాడు చైతూ. అంతకుముందు ఆ ఇద్దరూ కలిసి 3 సినిమాల్లో నటిస్తే.. 'ఏ మాయ చేశావే', 'మనం' సినిమాలు హిట్టవగా, 'ఆటోనగర్ సూర్య' ఫ్లాపయింది. 2017లో సమంతతో వివాహం జరిగాక.. ఆ ఇద్దరూ జంటగా మళ్లీ ఎప్పుడు నటిస్తారో, అసలు కలిసి నటిస్తారా?.. అనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. వాటికి రెండేళ్లు తిరక్కుండానే 'మజిలీ' మూవీతో సమాధానమిచ్చారు ఆ జంట. ఈ ఏడాది ఏప్రిల్లో వచ్చిన ఈ మూవీలో చైతూ నటన విమర్శకుల్ని అమితంగా ఆకట్టుకుంది. అందులో అన్షు అనే అమ్మాయి ప్రేమలో పడి, ఆమె చెప్పాపెట్టకుండా దూరమైతే, మద్యానికి బానిసై, తండ్రి కోసం శ్రావణి అనే పొరుగింటి యువతిని పెళ్లాడినా.. ఆమెను శారీరకంగా, మానసికంగా దూరంగా పెట్టే పూర్ణ అనే క్యారెక్టర్లో చైతూ నటన ఉన్నత శిఖరాల్ని అందుకుంది. ఒక భగ్న ప్రేమికుడి మానసిక స్థితి ఎలా ఉంటుందో అతను కళ్లకు కట్టించాడు. ఈ మూవీలో శ్రావణిగా చైతూ నిజ జీవిత భాగస్వామి సమంత నటించింది. సినిమా సెకండాఫ్లో ఒకర్ని మించి మరొకరు తమ పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నారు.
లేటెస్టుగా రియల్ లైఫ్లో తన మేనమామ అయిన వెంకటేశ్తో 'వెంకీమామ' మూవీలో నటించాడు చైతూ. సినిమాలోనూ వెంకీకి అతను మేనల్లుడుగా కనిపించనుండటం విశేషం. బాబీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ఆర్మీలో కెప్టెన్ హోదాలో పనిచేసే కార్తీక్ శివరాం అనే పాత్ర పోషించాడు చైతూ. సినిమాలో అతనికి తల్లి, తండ్రి, మేనమామ.. అన్నీ వెంకీనే. అంటే కార్తీక్ కోసం వెంకీ పెళ్లి చేసుకోకుండా అతని పెంపకానికే తన జీవితాన్ని వెచ్చిస్తాడు. మామ నుంచి గోదావరిలో ఈత, బరిలో ఆట, జాతరలో వేట నేర్చుకున్నాడు కార్తీక్. తన కోసం పెళ్లాడకుండా ఉండిపోయిన మేనమామ ఒక పిల్లను ఇష్టపడ్డాడని తెలిసి, ఆ ఇద్దర్నీ కలపడానికి కృషి చేస్తాడు. కార్తీక్ పాత్రలో చైతూ గొప్పగా రాణించాడని డైరెక్టర్ బాబీనే కాకుండా మేనమాలు సురేశ్, వెంకటేశ్ కూడా బల్లగుద్ది మరీ చెబుతున్నారు. వెంకీ, చైతూ కలిసి కనిపించే సన్నివేశాల్లో ఈ విషయం స్పష్టమవుతుందని బాబీ అంటున్నాడు.
సో.. ఇలా 'మనం'లో తాత తండ్రులతో, 'మజిలీ'లో భార్యతో, 'వెంకీమామ'లో మేనమామతో కలిసి నటించి, ఈ రకమైన ఫీట్ సాధించిన ఏకైక హీరోగా చరిత్రపుటల్లో చోటు సంపాదించుకున్నాడు నాగచైతన్య. భావిష్యత్తులో అతడు ఇదే తరహాలో మరిన్ని రికార్డులు సొంతం చేస్తుకునే అవకాశాలున్నాయి.
Also Read